Sunday, September 30, 2018

పితృదేవతల ఆహారాన్ని కాకి ముట్టుకుంటే వారికి చేరుతుందా?

మహాలయ పిత్రుపక్షమున తెలుసుకోనవలసిన ముఖ్య విషయం. ఇది రామాయణ అంతర్గతమైన ఉత్తరకాండలో సవివరంగా వివరింపబడి వుంది. రావణాసురుడు తన అన్నగారైన కుబేరుని యుద్ధంలో ఓడించి ఆయనకు వరప్రసాదంగా లభించిన పుష్పకవిమానం ఎక్కి ప్రపంచం అంతా చుడుతూ ఒకసారి ఉశీరబీజ దేశమునకు చేరగా అక్కడ మరుత్తుడను మహారాజు దేవతలతో కూడి యజ్ఞం చేస్తూ కనబడ్డాడు. అక్కడకు అతడు వస్తున్నప్పుడు గమనించి దేవతలు అందరూ పశుపక్షులుగా మారి పారిపోయారు. ఇంద్రుడు నేమలిగాను, యమధర్మరాజు కాకి గాను, కుబేరుడు తొండగాను, వరుణుడు హంసగా మారి పలాయనం చిత్తగించారు. రావణుడు అపవిత్రమైన కుక్కలాగా ఆ యజ్ఞశాలలో ప్రవేశించి మరుత్తు మహారాజును తాను కుబేరుని తమ్ముడనని, అతడిని ఓడించి పుష్పకం గెలిచానని పరిహాసంగా మాట్లాడుతూ యుద్ధానికి రమ్మని కవ్వించాడు.

ఆ మరుత్తు మహారాజు యుద్ధానికి సన్నద్ధుడు అవుతుండగా ఆ యజ్ఞహోత బృహస్పతి తమ్ముడు అయిన సంవర్థ మహర్షి అది పరమేశ్వర ప్రీతీ కోసం చేస్తున్న యాగమని, మధ్యలో ఆపితే అది వంశనాశనం అని వారిస్తాడు. అతడు యుద్ధప్రయత్నాన్ని విరమించి యాగానికి సిద్ధపడతాడు. రాజు ఓడిపోయాడు అని రావణుడు ప్రకటించుకుని అక్కడున్న ఎంతో మంది మహర్షులను తన రాక్షస సపరివారంగా భుజించి వెళ్ళిపోయాడు. రావణుడు వెళ్ళిపోయిన పిమ్మట ఇంద్రాదిదేవతలు ఆ రూపాలను త్యజించి వారి వారి రూపాలలో వచ్చారు.
అప్పుడు ఇంద్రుడు మయూరాన్ని చూసి మేఎ జాతికి సర్పముల వలన భయం ఉండదనీ, ఇంద్రుని వలే ఆ నెమలి పించ్హానికి వేయి కన్నులు ఉంటాయని తాను మేఘరూపంలో వర్షిస్తుంటే అందంతో పొంగి పించాన్ని విప్పి ఆడుతుందని వరం ప్రసాదిస్తాడు. అంతకు ముందు కేవలం నీలంగా ఉన్న ఆ పించం అప్పటినుండి ఇంద్రప్రభావం వలన కన్నులతో అందంగా కనబడడం మొదలయ్యాయి.
తరువాత యమధర్మరాజు కాకితో ఇట్లా అన్నారు:” ఓ వాయసమా నీ రూపం ధరించి నేను హాయిగా ఉన్నాను. నీకు ఏ రోగాలు ఉండవని వరం ప్రసాదిస్తున్నాను. మిగిలిన ప్రాణులకు నా ప్రభావం వల్ల రోగాలోస్తాయి కానీ నీకు ఏ రోగాలు అంటవు. నా లోకములో చేరిన మానవులందరూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు. భూతలంలో ఉన్న వారి సంతానం నీకు ఆహారం ఇచ్చి త్రుప్తి పరచినచో వారియొక్క పితృదేవతల యొక్క క్షుత్పిపాసలు తీరుతాయి” అని వరం ఇచ్చారు.

అందుకే పిండప్రదానం చేసిన తర్వాత ఆ పిండాలు కాకులు ముట్టాలని అందరూ ఆశిస్తారు.

తద్దినం నాడు కాకిని ఉద్దేశించి పెట్టే పిండాన్ని వికిర పిండం అంటారు.దీనికి ఎవరిని ఉద్దేశించి తద్దినం పెట్టబడిందో వారికి ఏ సంబందము లేదు. ఆ కులంలో అగ్ని దగ్ధులు అనగ్ని దగ్ధులు ఎవరైనా ఉండి ఉంటే కనక అలాంటి వారికి ఉద్దేశించి పెట్టబడేదే వికిర పిండము. మంత్రంలో పైన చెప్పబడిన వారిని ఉద్దేశించి పెడుతున్నట్లు స్పష్టంగా చెబుతారు.కాని సంస్కృతం రాకపోవడం వల్ల భావం తెలియని వారెవరో చెప్పినది అదొక మహత్తరమైన విషయంగా కొనసాగి పోతోంది.

యే అగ్ని దగ్ధా యేనగ్నిదగ్ధా యే వా జాతాః కులే మమ ।
భూమౌ దత్తేన పిణ్డేన తృప్తాయాన్తు పరాఙ్గతిమ్।
అగ్ని దగ్ధేభ్యః అనగ్పి దగ్ధేభ్యః అస్మత్కుల
ప్రసూత మృతేభ్యః ఏష పిణ్డః ఉపతిష్ఠతు.

ఇది వికిర పిండం విడిచే ముందు చదివే మంత్రం. దీన్ని అనుసరించి ఆ కాకికి పెట్టే పిండం తద్దినం పెడుతున్న కర్త కులంలోని అగ్నిదగ్ధులు,అనగ్నిదగ్ధుల్ని మాత్రమే ఉద్దేశించినది.

కొన్ని గ్రంథాల్లో లేదా పంథాలలో ఈ మంత్రానికి మరొక్క అడుగు ముందుకు వేసి ఒక్క కులంలో మాత్రమే కాదు మన దగ్గర పనిచేసిన భృత్యులకు కూడా ఆ వికిర పిండం చెందుతుంది అని . అంటే సనాతన ధర్మం కుల మతాల కు అతీతంగా భృత్యులను కూడా పితృ దేవతల లో కలిపింది. ఒక్క సారి ఆలోచిస్తే మన ఇంటిలో ఎప్పుడో పనిచేసి అకాల మృతి పొందిన వారు కాకి రూపంలో భోజనం చేస్తే కానీ మనం భోజనం చేయకూడదు అనే అంత గొప్ప సంస్కారం సనాతన ధర్మం మాత్రమే నేర్పినది. అది అర్థం కానివారికి తద్దినం పెట్టిన వారి పేరు చెప్పి కథ లా అలవాటు చేసేసారు.
అనాదిగా వున్న వేద మంత్రాలులో కూడా కుల మత భేదాలు లేకుండా ఆచారాలు తయారు చేయబడ్డాయి. ఎప్పుడో పోయిన వారికే ఇంత ప్రాధాన్యత ఇస్తే మన కళ్ళెదుట వున్న వారికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అదే జరిగి వుంటే ఈ కుల మతాల గొడవలే వుండేవి కాదు. అంటే సనాతన ధర్మం అవగాహన లేక కర్మ సిద్ధాంతం మాత్రమే గుడ్డిగా అవలంబించటం వలన ఏర్పడిన వికారమే ప్రస్తుతం మనం చూస్తున్న వర్ణ వివక్ష అని నా అభిప్రాయం
(శ్రీరామకృష్ణ తురగ వారు ఈ విషయం ప్రస్తావించారు. దాన్ని జతపరుస్తున్నాను )

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు !!

Saturday, September 29, 2018

భజగోవిందం సాహిత్యం


భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే 
నహి నహి రక్షతి డుకృణ్ కరణే ||1||

భావం: భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని... ఓ బుద్ధిహీనుడా గోవిందుడినే భజించు. మరణసమయం ఆసన్నమైనప్పుడు ఈ (డుకృణ్ కరణే లాంటి ) వ్యాకరణ  సూత్రాలు నిన్ను రక్షించవు గాక రక్షించవు. 


మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం  తేన వినోదయ చిత్తం ||2||

భావం: ఓ మూర్ఖుడా! ధనసంపాదన ఆశ విడిచిపెట్టు. మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు. నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు. 



నారీస్తనభర నాభీదేశం

దృష్ట్వా  మాగామోహావేశం

ఏతన్మామ్సావసాది వికారం

మనసి విచంతయ వారం వారం ||3||


భావం: స్త్రీల సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అవి నిజంగా మాంసం, కొవ్వు మొదలైన పదార్థములతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు.



నళినీ దలగత జలమతి తరలం

తద్వాజ్జీవితమతిశయచపలం 

విద్ధి వ్యాద్యభిమానగ్రస్తం

లోకం శోకహతం చ సమస్తం ||4||


భావం: తామరాకు మీద నీటిబొట్టు ఎంత చెంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు ఈ మానవ జీవితం అంతా రోగాలతోనూ 'నాది' అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకో.



యావద్విత్తోపార్జన సక్తః

తావన్నిజ పరివారో రక్తః

పశ్చాజీవతి జర్జర దేహే

వార్తాం కోపి న పృచ్చతి గేహే ||5||


భావం: ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి, ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా వేయరు.



యావత్పవనో నివసతి దేహే

తావత్పృచ్చతి కుశలం గేహే

గతవతి వాయౌ దేహాపాయే

భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||6||


భావం: ఎంతవరకైతే ఈ దేహం లో ప్రాణం ఉంటుందో  అంతవరకే ఇంట్లోనివారు క్షేమాన్ని అడుగుతారు. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆ  చూసి భార్య కూడా భయపడుతుంది.




బాలాస్తావతీ క్రీడాసక్తః

తరుణస్తావత్తరుణీసక్తః |

వృద్ధస్తావాచ్చింతాసక్తః

పరమే బ్రహ్మణి కో పి సక్తః ||7||


భావం: మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల  పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!!




కా తే కాంతా కస్తే పుత్రః

సంసారో యమతీవ విచిత్రః |

కస్య త్వం కః కుత ఆయాతః

తత్వం చింతయ తదిహ భ్రాతః ||8||


భావం: నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా! ఆ తత్వాన్ని ఇక్కడే - ఈ దేహం లో ఉండగానే ఆలోచన చేయి.




సత్సంగత్వే నిస్సంగత్వం

నిస్సంగత్వే నిర్మోహత్వం |

నిర్మోహత్వే నిశ్చలతత్వం

నిశ్చలతత్వే జీవన్ముక్తి: ||9||


భావం: సత్పురుషులతో సాంగత్యం  చేయడం వల్ల  ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి.



వయసి గతే కః కామవికారః

శుష్కే నీరే కః కాసారః |

క్షీణే విత్తే కః పరివారః

జ్ఞాతే తత్వే కః సంసారః ||10||


భావం: వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు.  నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.



మా కురు ధన జన యవ్వన గర్వం 

హరతి నిమేషాత్కాలః సర్వం |

మాయామయమిదమఖిలం హిత్వా

బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా  ||11||


భావం: ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యౌవనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిముషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు.



దినయామిన్యౌ సాయం ప్రాతః

శిశిరవసంతవ్ పునరాయాతః |

కాలః క్రీడతి గచ్ఛత్యాయుః 

తదపి న ముంచత్యాశావాయుః  ||12||


భావం: రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి; పోతుంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలం కూడా అలాగే వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడు గాక వదలడు.




కాతే కాంతా ధనగతచింతా

వాతుల కిం తవ నాస్తి నియంతా |

త్రిజగతి సజ్జనసంగాతిరేకా

భవతి భవార్ణవతరణే  ||13||


భావం: ఓరి వెఱ్ఱివాడా! ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటిని, అందరిని నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక.



ద్వాదశమంజరికాభిరశేషః

కథితో వైయాకరణస్యైషః .

ఉపదేశో భూద్విద్యానిపుణైః

శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః  ॥13.అ॥


భావం: ఈ పన్నెండు (2-13) శ్లోకాలు శ్రీ శంకర భగవత్పాదులవారు ఒక వ్యాకరణకర్తకి ఉపదేశంగా ప్రసాదించారు.



జటిలో ముండీ లుంఛితకేశః

కాషాయాంబరబహుకృతవేషః |

పశ్యన్నపి చన పశ్యతి మూఢః

హ్యుదరనిమిత్తం బహుకృతవేషః ||14||


భావం: జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, జుట్టు పీకివేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించి  వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటికోసమే గాని, వీరు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు.



అంగం గలితం పలితం ముండం

దశనవిహీనం జాతం తుండం |

వృద్ధో యాతి గృహీత్వా దండం

తదపి న ముంచత్యాశాపిండం ||15||


భావం: శరీరం కృశించిపోయింది, తల నెరసిపోయింది, నోటిలో పళ్ళు ఊడిపోయినవి. ముసలితనం పైబడి కఱ్ఱ చేతికొచ్చింది. ఐనా సరే ఆశల - కోరికల మూట మాత్రం వదిలిపెట్టడు.



అగ్రే వహ్నిః పృష్ఠేభానుః

రాత్రౌ చుబుకసమర్పితజానుః |

కరతలభిక్షస్తరుతలవాసః

తదపి న ముంచత్యాశాపాసః ||16||


భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని,  వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు.



కురుతే గంగాసాగారగమనం

వ్రత పరిపాలన మథవా దానం |

జ్ఞానవిహీనః సర్వమతేన

ముక్తిం న భజతి జన్మశతేన ||17||


భావం: తీర్థయాత్రలు చేయవచ్చు; పూజలు, నోములు, వ్రతాలు చేయవచ్చు; దానధర్మాలు చేయవచ్చు. కాని ఆత్మజ్ఞానము పొందనివాడు నూఱు జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడని సర్వమతముల విశ్వాసం.



సుర మందిర తరు మూల నివాసః

శయ్యా భూతలమజినం వాసః |

సర్వ పరిగ్రహ భోగ త్యాగః

కస్య సుఖం న కరోతి విరాగః ||18||


భావం: దేవాలయాల్లోనూ, చెట్ల మొదళ్ళలోనూ నివసిస్తూ; కటిక నేల మీద నిద్రిస్తూ; చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ; దేనినీ గ్రహించకుండా - ఏమీ కావాలని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు? తప్పక లభిస్తుంది.



యోగరతో వా భోగరతో వా

సంగరతో వా సంగవిహీనః |

యస్య బ్రహ్మణి రమతే చిత్తం

నందతి నందతి నందత్యేవ ||19||


భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు; ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అట్టివారికే ఆనందం.




భగవద్గీతా కించిదధీత

గంగా జలలవ కణికాపీతా |

సకృదపి యేన మురారి సమర్చా

క్రియతే తస్య యమేవ న చర్చ ||20||


భావం: ఎవరైతే భగవద్గీతని కొంచమైనా అధ్యయనం చేస్తారో, గంగా జలాన్ని కొద్దిగా ఐనా తాగుతారో, కొంచమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అట్టివారికి యమునితో వివాదం ఉండదు.



పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం |

ఇహ సంసార బహు దుస్తారే

కృపయా పారే పాహి మురారే ||21||


భావం: మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం; మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం - ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు.



రథ్యా చర్పట విరచిత కంథః

పుణ్యాపుణ్య వివర్జిత పంథః |

యోగి యోగనియోజిత చిత్తో

రమతే బాలోన్మత్తవదేవ ||22||


భావం: దారిలో దొరికే గుడ్డ పీలికలతో తయారైన గోచిని ధరించిన వాడై; ఇది పుణ్యమని, అది పాపమని ఏ మాత్రం ఆలోచించక, నిరంతరం మనసుని యోగమునందే నిలిపిన యోగిపుంగవుడు ఈ లోకంలో బాలునిలాగ, పిచ్చివానిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.



కస్త్వం కోహం కుత ఆయాతః

కా మే జనని కో మే తాతః |

ఇతి పరభావయ సర్వమసారం

విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||23||


భావం: నీవెవరు? నేనెవరు? ఎక్కడ నుండి వచ్చాను? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? ఇదీ నువ్వు విచారణ చెయ్యవలసినది. ఈ ప్రపంచం సారహీనమైనది; కేవలం కలలో కనిపించు దృశ్యం లాంటిదే అని దీనిని విడిచిపెట్టు.



త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:

వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |

భవ సమచిత్తః  సర్వత్ర త్వం

వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం ||24||



భావం: నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు.



శత్రౌ మిత్రే పుత్రే బంధవ్

మా కురు యత్నం విగ్రహ సంధవ్ |

సర్వస్మిన్నపి పశ్యాత్మానం

సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం ||25||


భావం: శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని,  బంధువు గాని - వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే యత్నం మానుకో. అందరిలోను ఆత్మను చూస్తూ, భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టు.




కామం క్రోధం లోభం మోహం

త్యక్త్వా త్మానం భావయ కోహం |

ఆత్మజ్ఞాన విహీనా మూడాః

తే పచ్యంతే నరకనిగూడః ||26||


భావం: కోరిక, కోపం, లోభం, భ్రాంతి - వీటన్నిటిని విడిచిపెట్టిన సాధకుడు "ఆ పరమాత్మను నేనే " అనే సత్యాన్ని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానం లేనివారు మూఢులు. అట్టివారు ఈ సంసార జనన మరణ చక్రం అనే నరకంలో బంధింపబడి హింసించబడతారు.



గేయం గీతా నామ సహస్రం

ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |

నేయం సజ్జన సంగే చిత్తం

దేయం దీనజనాయ చ విత్తం ||27||


భావం: భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి.


సుఖతః క్రియతే రామాభోగః

పశ్చాద్ధంత శరీరే రోగః |

యద్యపి లోకే మరణం శరణం

తదపి న ముంచతి పాపాచరణం ||28||


భావం: సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాలపాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికి తప్పదు. ఐనా సరే మానవుడు పాప కార్యములను వదలనే వదలడు.



అర్థమనర్థం భావయ నిత్యం

నాస్తితతః సుఖలేశః సత్యం |

పుత్రాదపి ధన భాజాం భీతి:

సర్వత్రైషా విహితా రీతి: ||29||


భావం: డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. ధనవంతునికి తన కుమారిని వల్ల కూడా భయమే. అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే.



ప్రాణాయామం ప్రత్యాహారం

నిత్యానిత్య వివేకవిచారం |

జాప్యసమేత సమాధివిధానం

కుర్వవధానం మహదవధానం ||30||


భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం; విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం; నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం; జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు.



గురుచరణా౦బుజ నిర్భర భక్తః

సంసారాదచిరార్భవ ముక్తః |

సేంద్రియమానస నియమాదేవం

ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||31||


భావం: గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించిన ఓ భక్తుడా! నీ ఇంద్రియాలను, మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకులతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవై, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు గాక!



మూఢః కశ్చన వైయాకరణో

డుకృన్కరణాధ్యయన ధురిణః .

శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై

బోధిత ఆసిచ్ఛోధితకరణః ॥32॥


భావం: వ్యాకరణ నియమాలతో తనను తాను కోల్పోయి మూఢుడైన వ్యాకరణకర్త, శంకర భగవత్పాదులవారి బోధనలతో కడిగివేయబడ్డాడు.



భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే

నామస్మరణాదన్యముపాయం

నహి పశ్యామో భవతరణే ॥33॥


భావం: భజించు గోవిందుని! భజించు గోవిందుని! ఓ మూఢుడా  గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు.

|| ఇతి భజగోవిందం సంపూర్ణం ||

చక్ర భ్రమణం

కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం... ఇది ‘యుగచక్రం’.

వర్షకాలం, చలికాలం, ఎండకాలం... ఇది ‘రుతుచక్రం’.

రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు... ఇది ‘కాల చక్రం’.

బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం... ఇది ‘జీవిత చక్రం’.

సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ పరమేశ్వరుడి నిర్దేశానుసారం ‘చక్ర భ్రమణం’ నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది.

రంగులరాట్నంలో కింది నుంచి పైకి, పైనించి కిందికి తిరుగుతున్నట్టే మనిషి జీవితంలో సుఖానుభవాలు, దుఃఖానుభవాలు... ఒకదాని వెంట మరొకటిగా కలుగుతూనే ఉంటాయి.
ఈ సత్యం తెలిసికూడా మనసును మాయపొర కమ్మేయడంతో రాగబంధాలకు లోనైన మనిషి నిరంతరం బాధపడుతుంటాడు.

జీవిత ప్రయాణం అంటే- గమ్యం వైపు గమనం. ఏది గమ్యం అనేదే జటిలమైన ప్రశ్న!
గమ్యాన్ని నిర్దేశించేది కోరిక. ఆ కోరికను ప్రేరేపించేవి మూడు- ధనం, సుఖం, కీర్తి.
ఎంత ధనం కావాలి, ఎంత సుఖాన్ని అనుభవించాలి, ఎంత కీర్తిని మూట కట్టుకోవాలి? ఈ ‘ఎంత’ అనేదానికి ‘అంతు’ ఉందా? చాలామంది విషయంలో లేదు, ఉండదు!

మనిషి జీవితంలో- బాల్యం అమాయకంగాను, కౌమారం జిజ్ఞాసతోను, యౌవనం ఆశలతోనూ గడిచిపోతాయి. వార్ధక్యం వచ్చేసరికే అసలు సమస్య మొదలవుతుంది.

జీవిత చరమాంకంలోనూ కోరిక చావదు. ఇంకా ధనం కావాలి, సుఖాలు కావాలి, కీర్తి ప్రతిష్ఠలు కావాలి. ఇంకా, ఇంకా, ఇంకా... ఈ పరుగును ఎక్కడ ఆపాలో తెలియకపోవడమే దుఃఖానికి హేతువు అవుతుంది.

అలాగని కోరికే లేకుండా జీవించడం సాధ్యమే కాదు. ఆ కోరిక ఎంతవరకు అనే విచక్షణే సుఖదుఃఖాలను నిర్ణయిస్తుంది.

ఉరిశిక్ష పడిన ఓ నేరస్థుడికి శిక్ష అమలుపరచేందుకు తలారి సిద్ధమయ్యాడు. ఉరికొయ్యకు అతడి కాళ్లూచేతుల్ని తాళ్లతో ముడివేసి, పరిసరాలు కనిపించకుండా ముఖానికి నల్లటి ముసుగును కప్పేశాడు. ఇష్టదైవ ప్రార్థన చేసుకోవడానికి ఆ జైలు అధికారి అతడికి ఒక నిమిషం వ్యవధి ఇచ్చాడు. ఆఖరి క్షణాల్లో ఉన్న ఆ నేరస్థుడికి కేవలం తన పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడే ఒక తేలు అతడి పాదానికి అంగుళం దూరంలో కనిపించింది. భయంతో అతడు తన కాలివేళ్లను వెనక్కి తీసుకోవడానికి, తేలుకాటు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు... మరికొద్ది క్షణాల్లో ఉరిశిక్షను అనుభవించబోతున్న అతడికీ ప్రాణాలమీద ఆశే!

మరణించేదాకా జీవించాలనే ఆశను కలిగిఉండటం మనిషి నైజం!

అడవిలో ఒక రుషి తపస్సు చేసుకుంటున్నాడు దీక్షగా. రుషిని గురించి విన్న ఆ దేశ రాజు చూడటానికి వెళ్లాడు. కానీ అంతకు ముందురోజే ఆ రుషి హిమాలయాలకు వెళ్ళిపోయాడని తెలిసి, దర్శన భాగ్యం కలగనందుకు బాధపడిన రాజు, అలౌకిక సంపద కలిగిన రుషి తిరిగి వస్తాడనే నమ్మకంతో అన్ని వసతులతో కూడిన గొప్ప మందిరాన్ని నిర్మించాడు. కొంతకాలం తరవాత తిరిగివచ్చిన ఆ రుషి చెట్టు స్థానంలో వెలసిన మందిరంవైపు చూడగానే అక్కడివాళ్లు- రాజుగారు ప్రత్యేకంగా మీ కోసమే కట్టించారు స్వామీ అని సెలవిచ్చారు. విరాగి అయిన రుషి మందిరంవైపు నిర్వికారంగా చూసి దూరంగా ఉన్న మరో చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకోవడం ఆరంభించాడు! బ్రహ్మజ్ఞానం తప్ప మరే కోరికా లేకపోవడం రుషి నైజం.
ప్రాణంకోసం తపించే మామూలు మనిషి స్థితి నుంచి, ఈ ప్రాణమే శాశ్వతం కాదు అనే పరిపక్వ స్థితికి చేరడమే జ్ఞాన దర్శనం అంటే.

చక్ర భ్రమణంలో తనను తాను తెలుసుకుంటూ, జీవన ప్రస్థానంలో అన్ని దశలనూ దాటుకుంటూ మహాప్రస్థానం వైపు అడుగులు వేసేలోగా- ‘నిగ్రహం, నిర్మోహం, నిరాపేక్షత’ అనే త్రిలక్షణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. అలా చేయగలిగితే అంతర్యామిని చేరుకునే అలౌకికమైన ఆనందం సిద్ధిస్తుంది.

సమాధి అంటే ఏమిటి?

సమాధి గురించి, అందులోని వివిధ స్థితుల గురించి సద్గురు మనకు చెబుతున్నారు. అలాగే సమాధి వల్ల జ్ఞానోదయం కలుగుతుందా అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తున్నారు.

అది సమదృష్టిని కలిగించే ఒక మానసిక స్థితి. ఆ స్థితిలో బుద్ధి సహజమైన  వివేచనకు అతీతంగా పనిచేస్తుంది. ఇది మీకు మీ శరీరానికీ మధ్య కొంత దూరాన్ని తీసుకువస్తుంది. సమాధుల్లో అనేక రకాలున్నాయి. వాటిని అవగాహన కొరకు 8 రకాలుగా విభజించారు. ఈ ఎనిమిదింటినీ రెండు అతిముఖ్యమైన విభాగాలుగా విడదీసారు. సవికల్ప సమాధి స్థితులు (ఈ సమాధి స్థితిలో అనుభూతులు మనోహరంగా ఉంటూ, ఆనందాన్నీ, బ్రహ్మానందాన్నీ కలుగజేసేవి) నిర్వికల్ప సమాధి స్థితులు (అవి ఆనందానికీ, దుఃఖానికీ అతీతమై ఏ వికారాలూ లేని స్థితి). నిర్వికల్ప సమాధిలో శరీరంతో సంబంధం ఒకే ఒక బిందువుతో ఉంటుంది. తక్కిన శక్తి అంతా స్వేఛ్ఛగా భౌతికతతో ప్రమేయంలేకుండ చరిస్తుంది. తమకీ తమ శరీరాలకీ మధ్య తారతమ్యం ఉందని తెలియడానికి సాధకులు ఇటువంటి సమాధి స్థితిని సాధన చేస్తుంటారు.

మీరు జీవితంలో వివిధ స్థాయిల్లో వెరువేరు అనుభూతులకు లోనవుతుంటారు. సమాధి స్థితులు కూడా అటువంటివే
వ్యక్తి ఆధ్యాత్మిక పరిణామంలో సమాధి ఒక ముఖ్యమైన స్థితి. కానీ అదే అంతిమ స్థితి కాదు. మీరు ఒక సమాధి స్థితిని అనుభవించినంత మాత్రం చేత  మీ అస్తిత్వ పునరావృతుల నుండి మీకు విముక్తి లభించిందన్న హామీ లేదు. అది ఒక కొత్త స్థాయిలోని అనుభవం. అంతే! మీరు బాల్యంలో ఉన్నప్పుడు మీరు జీవితాన్ని ఒక స్థితిలో అనుభూతి చెందుతారు. మీరు యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత మీకు మరొక ప్రమాణంలో జీవితానుభూతి ఉంటుంది. మీరు జీవితంలో వివిధ స్థాయిల్లో వెరువేరు అనుభూతులకు లోనవుతుంటారు. సమాధి స్థితులు కూడా అటువంటివే.

కొందరు ఒకరకమైన సమాధి స్థితి చేరుకుని కొన్ని సంవత్సరాల పాటు అది అనుభవింప యోగ్యమైనదిగా ఉండడం వలన అక్కడే ఉంటారు.  ఈ స్థితిలో వాళ్లకి కాలంతో, స్థానంతో ఏ సంబంధం ఉండదు. వాళ్ళకి ఏ శారీరకమైన  సమస్యలూ ఉత్పన్నం కావు. ఇందుకు కారణం వాళ్లకి శరీర, మానసిక వ్యవస్థలతో కొంతమేరకు సరిహద్దులు చెరిగిపోవడమే. కానీ ఇది తాత్కాలికం. వాళ్లు ఈ స్థితి నుండి ఒకసారి బయటకి వచ్చిన తర్వాత శరీరానికి కావలసిన అవసరాలూ, మనసుకి పూర్వం ఉన్న అలవాట్లు తిరిగి వెనక్కి వస్తాయి.

సాధారణంగా, మాములుగా ఉన్నవాడి కంటే కొద్దిగా మత్తుపానీయాలు సేవించినవాడు వేరే స్థాయి అనుభూతిలో విజృంభిస్తూ ఉంటాడు. కానీ ఎప్పటికో ఒకప్పటికి ఆ స్థాయి నుండి క్రిందకు దిగిరావాలి. ఈ సమాధి స్థితులన్ని ఏ రసాయనిక పదార్థాలూ సేవించకుండా ఆ స్థితిని చేరుకునే మర్గాలు. మీరు ఈ స్థితిలోకి వెళ్ళినపుడు, మీకొక కొత్త ప్రమాణం తెరుచుకుంటుంది. కానీ అది మిమ్మల్ని శాశ్వతంగా మార్చలేదని గుర్తుంచుకోవలసిందే.  మీరు మరొక కొత్త వాస్తవంలోకి ప్రవేశించలేరు. మీ అనుభూతి సాంద్రమౌతుంది కానీ స్థూల దృష్టితో చూసినపుడు మీరు స్వతంత్రులు కాలేరు.

గౌతముడు ఇటువంటి స్థితులలో చేరుకున్నాక,"అది ఇది కాదు," అన్నాడు.
ఆత్మజ్ఞానం పొందినవారు సమాధి స్థితిలో ఎక్కువ కాలం ఉండలేదు. గౌతమ బుద్ధుడు తనకి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత, కూచుని సంవత్సరాల తరబడి ధ్యానం చెయ్యలేదు. అతని శిష్యులు చాలామంది సుదీర్ఘమైన ధ్యానంలో గడిపారు. గౌతమ బుద్ధుడు మాత్రం అలా చేయలేదు. బహుశా ఆయనకు ఆ అవసరం కనిపించి ఉండకపోవచ్చు. అతను ఆ ఎనిమిది రకాల సమాధి స్థితులనీ ఆత్మజ్ఞానాన్ని పొందకముందు అనుభవించి, తర్వాత వాటిని విడిచిపెట్టాడు. గౌతముడు ఇటువంటి స్థితులలో చేరుకున్నాక,"అది ఇది కాదు," అన్నాడు. అంటే, ఆ స్థితి తనని ఆత్మజ్ఞానానికి తీసుకుపోదని అతను గ్రహించాడు. సమాధి ఒక ఉత్ప్రేరకమైన ఉన్నత చైతన్య స్థితి, ఒక రకంగా బయట నుండి సేవించే మత్తుపదార్థాల ద్వారా కాకుండా, శరీరంలో జరిగే రసాయనిక చర్యల ద్వారా కల్పించుకున్న ఉన్నత మానసిక చైతన్య స్థితి. అందులో ఉన్న ప్రమాదం ఏమిటంటే, అది ప్రస్తుత వాస్తవం కంటే అందంగా ఉంటుంది కనుక మీరు అక్కడే ఉండిపోవాలని భ్రమపడవచ్చు. కానీ, ఎంత అందమైన అనుభవమైనా కాలక్రమంలో దాని అనుభూతి సాంద్రత తిరోముఖం పడుతుందని మనకి తెలిసినదే.

మీ జీవితంలో ఆత్మజ్ఞానం అందుకోవడమే ముఖ్యం అని మీరు తీర్మానించుకునప్పుడు, దాని వైపున ఒక్క అడుగైనా దగ్గిరకి తీసుకుపోలేని ఏ ప్రక్రియ అయినా మీకు అర్థం లేనిదిగా కనిపిస్తుంది.

హరుని మూడుగా నరికిన హరి

పూర్వం వీతమన్యుడు అనే పేరుగల నిరుపేద బ్రాహ్మణుడుండే వాడు. అతని భార్య ఆత్రేయి. వీరికి ఉపమన్యుడు అనే కుమారుడు ఉన్నాడు. వారు ఎంత దారిద్ర్యం లో ఉన్నారంటే వారి పిల్లాడు పుట్టి బుద్ధెరిగాక పాలు తాగలేదు. కేవలం వరిపిండి కలిపి నీరు తెల్లగాచేసి అవే పాలని అతని తల్లి త్రాగించేది.

ఊహతెలిసినప్పటి నుంచీ అవే త్రాగుతున్నాడు ఆ వరిపిండి నీళ్ళే పాలు అనుకుంటూ వచ్చాడు. అయితే ఒకరోజు తండ్రితో కూడా ఒకచోట భోజనానికి వెళ్ళి స్వచ్ఛమైన పాలతో చేసిన పరవాన్నం తిన్నాడు. పాల రుచి తెలిసింది.

ఇంటికి వచ్చాక తల్లి ఇచ్చిన పిండిపాలు వద్దు అవి అసలు పాలు కావని తనకు అసలు పాలు కావాలని గోలపెట్టాడు.

అతడిని బుజ్జగిస్తూ విరూపాక్షుడు అయిన శంకరుడు ప్రసన్నుడు కానివానికి పాలబువ్వ ఎలా వస్తుంది? ఆయన సంతోషిస్తే పాలబువ్వ వస్తుంది అని చెప్పింది.

అయితే విరూపాక్షుని ప్రార్థిస్తాను ఆయన ఎవరు అని అడిగాడు. దాంతో ఆమె విరూపాక్షుని ఆవిర్భావ కథ చెప్పింది.

పూర్వం శ్రీదాముడనే పేరు గల రాక్షసరాజు ఉండేవాడు. అతడు సర్వలోకాలూ ఆక్రమించి రాజ్యలక్ష్మిని సొంతం చేసుకున్నాడు. విష్ణుమూర్తి కౌస్తుభం  లాగుకోవాలని చూశాడు.

వాడి దుర్బుద్ధి తెలుసుకున్న శ్రీహరి కైలాసానికి వెళ్ళాడు.

శంంభుడు యోగమూర్తిధరుడై ఉన్నాడు. అందువల్ల విష్ణుమూర్తికి కనిపించలేదు. అప్పుడు విష్ణుమూర్తి తనను తానే ఆరాధించుకుంటూ కాలి బొటనవేలిపై నిలిచి వేయిసంవత్సరాలు తపస్సు చేశాడు.

శివుడు సంతోషించి విష్ణువు ముందు ప్రత్యక్షమై సుదర్శన చక్రం ప్రసాదించి రాక్షసుని చంపమన్నాడు.

అది సర్వశ్రేష్ఠమైన చక్రం అని సర్వాయుధాలను విఫలం చేస్తుందని శంభుడు అన్నాడు. దానికి పన్నెండు ఆకులు, ఆరు నాభములు, రెండు ఇరుసులు ఉన్నాయని చాలా వేగవంతమైనదని చెప్పాడు.

పన్నెండు ఆకులలో పన్నెండు రాసులు, మాసాలు, దేవతలు ఉన్నారని చెప్పాడు. కనుక ఈ సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని చంపమని చెప్పాడు.

చక్రాన్ని తీసుకున్న శ్రీహరి దాని పనితనం పరీక్షించాలనుకొని శివుని మీదనే ప్రయోగించాడు. అది ఈశ్వరుని మూడు ముక్కలుగా ఖండించింది.

శ్రీహరి తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు. శంకరుని పాదాలు ఉన్న ఖండముకు వంగి నమస్కరించాడు. అది చూసిన సర్వేశ్వరుడు హరిని పైకి లేవమన్నాడు.

‘‘కేశవా నీవు ప్రాకృతమైన నాశరీరాన్ని ఖండించావు. నా స్వభాన్ని కాదు. దానిని నరకడం కానీ, తగులబెట్టడం కానీ సాధ్యం కాదు. నీవు చేసిన ఈ మూడు భాగాలూ హిరణ్యాక్షుడు, సువర్ణాక్షుడు, విరూపాక్షుడు అవుతాయి. ఈ ముగ్గురూ నరులకు పుణ్యప్రదాయకులు అవుతారు. విచారించక వెళ్ళి రాక్షసుడిని సంహరించు‘‘ అని ఆజ్ఞాపించాడు.

శ్రీహరి వెళ్ళి దైత్యుని శిరస్సు ఖండించాడు. దైత్యసంహారం తరువాత తిరిగి వచ్చిన శ్రీహరి విరూపాక్షుని ఆరాధించి పాలకడలికి తన సుదర్శన చక్రంతో వెళ్ళాడు.

 ఈ కథను తన కుమారునికి చెప్పింది ఆత్రేయి.

అది విన్న ఉపమన్యుడు విరూపాక్షుని సేవించి సకలశాస్త్రాలు అభ్యసించి ధనధాన్యాదులతో జీవించాడు.

ఇది వామనపురాణంలో ఉన్న విరూపాక్ష ఆవిర్భావ వృత్తాంతం.

గురు అక్షరమాల స్తుతి

అ - అద్వైతమూర్తి - గురువు
ఆ - ఆనందస్ఫూర్తి - గురువు
ఇ - ఇలదైవం - గురువు
ఈ - ఈశ్వరరూపము - గురువు
ఉ - ఉద్ధరించువాడు - గురువు
ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు
ఋ - ఋజువర్తనుడు - గురువు
ౠ - ఋణము లేనివాడు - గురువు
ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు
ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు
ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు
ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు
ఓ - ఓంకార రూపము - గురువు
ఔ - ఔదార్య మేరువు - గురువు
అం - అందరూ సేవించేది - గురువు
అః - అహంకార రహితుడు - గురువు
క - కళంకము లేనివాడు - గురువు
ఖ - ఖండరహితుడు - గురువు
గ - గుణాతీతుడు - గురువు
ఘ - ఘనస్వరూపము - గురువు
ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు
చ - చక్రవర్తి - గురువు
ఛ - ఛత్రము వంటి వాడు - గురువు
జ - జనన మరణములు లేని వాడు - గురువు
ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు
ఞ - జ్ఞానస్వరూపము - గురువు
ట - నిష్కపటుడు - గురువు
ఠ - నిష్ఠకలవాడు - గురువు
డ - డంబము లేనివాడు - గురువు
ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు
ణ -  తూష్ణీభావము కలవాడు - గురువు
త - తత్త్వోపదేశికుడు - గురువు
థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు
ద - దయాస్వరూపము - గురువు
ధ - దండించి బోధించువాడు - గురువు
న - నవికారుడు - గురువు
ప - పంచేంద్రియాతీతుడు - గురువు
ఫ - ఫలాకాంక్షా రహితుడు - గురువు
బ - బంధము లేనివాడు - గురువు
భ - భయరహితుడు - గురువు
మ - మహావాక్యబోధకుడు - గురువు
య - యమము కలవాడు - గురువు
ర - రాగద్వేష రహితుడు - గురువు
ల - లవలేశము ద్వేషము లేనివాడు - గురువు
వ - వశీకరణశక్తి కలవాడు - గురువు
శ - శమము కలవాడు - గురువు
ష - షడ్భావ వికారములు లేనివాడు - గురువు
స - సహనశీలి - గురువు
హ - హరిహర రూపుడు - గురువు
ళ - నిష్కళంకుడు - గురువు
క్ష - క్షరాక్షర విలక్షణుడు - గురువు
ఱ - ఎఱుకలేనివాడు - గురువు

జైగురుదేవ్

వేదం గురించి తెలుసుకుందాం

(By యాజ్ఞికపీఠమ్ డెస్క్. 9848422815)

ప్రశ్న: ఋగ్వేదము అని దేనికి పేరు ?

సమాధానము :
 "ఋచాం వేదః ఋగ్వేదః" అని చెప్పబడుచున్నది. దీనిని అనుసరించి ఋక్కులు కలిగిన వేదమునకు ఋగ్వేదమని పేరు."అర్చ్యతే ప్రశస్యతే అనేన దేవవిశేషః ఇతి ఋక్" అని ఋక్ శబ్దమునకు నిరుక్తి.ఏ మంత్రము చేత దేవతార్చన, ప్రశంసచేయబడునో ఆ మంత్రమునకు "ఋక్" అని పేరు. ఋగ్వేదమునకు ఇటువంటి ఋక్కులు సుమారుగా 10500 కు పైగా వున్నవి .

ప్రశ్న : యజుర్వేదము అని దేనికి పేరు?

సమాధానము :
 "యా న గతిర్న చ పాదబద్ధం తత్ ప్రశ్లిష్టపఠితం యజుః" అను శబరస్వామి వచనములను అనుసరించి ఋక్ సామ భిన్నములగు గద్య రూపమును చదువుటకు అనుకూలమైన మంత్రములకు  "యజస్సులు" అని పేరు. యజస్సులు కల వేదము యజుర్వేదము అని పిలవబడుచున్నది....

ప్రశ్న : సామవేదము అని దేనికి పేరు?

సమాధానము :
 "సా చ అమశ్చేతి తత్ సామ్నః సామత్వమ్" అని బృహదారణ్యకము నందు చెప్పబడినది. సామవేదమందలి ఎక్కువ భాగము మంత్రములు ఋగ్వేదము నుండియే గ్రహించబడినవి. అట్లు గ్రహించిన ఋక్కులను
గాంధారాది స్వరములతో గానము చేయుటచే సామమేర్పడినది అని తెలియుచున్నది. ఇట్లు సామవేదము గాన ప్రధానమైనదిగా ప్రసిద్ధి పొందినది...

అథర్వణవేదము అని దేనికి పేరు ?

సమాధానము :
 "థర్వణము" అనగా కుటిలత అని అర్ధము. "అథర్వణము" అనగా కుటిలత లేనిది. కుటిలతలేక ఒక సహజమైన రీతిలో ఇహముత్ర ఫలప్రాప్తి కోసమువలన ఉపాయమును సూచించే వేదము కనుక అథర్వణవేదము అని పిలవబడుచున్నది అథర్వాంగీరసులచే  దర్శింపబడుటచే దీనికి "అథర్వాంగిరసమని" పేరు కూడా కలదు. దీనికే బ్రహ్మ వేదము అని పేరు ఉన్నది...

Thursday, September 27, 2018

లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది?

మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినపుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తుంటాం.

దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతోంది. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గానమాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూలశరీరాన్ని విడిన తరువాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం ఆంతరంగిక సంగీతసభ ఒకటి ఏర్పాటుచేసాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు. తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునకు స్వాగత సత్కారాలు లభించడం చూచిన నారదుడు మండిపడ్డాడు. అయినా, తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అదితెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమైయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి.

కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గు పడుతున్న నారదుని చూచి అన్నాడు - 'నారదా! నీ కోపకారణం నాకు తెలియును. నిజానికి భక్తి జ్ఞానములందు, శీల వర్తనములందు తుంబరుడు నీకన్న కపటి కాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికి వ్యర్థం. భక్తిశ్రద్ధలతో నన్నుకొలుచువారలకు అవశ్యం వశ్యుడనే. సంగీతం చేత ననుజేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధ పడటం లేదు. లోకహితమే జరుగుతుంది. చింతించ వద్దు.' నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది. "ఓ దేవదేవా! నా తప్పులను క్షమించుము. అవివేకివలె ప్రవర్తించాను. నన్ను కాపాడుము. తుంబర కౌశికులవలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా!' అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాలమీద పడ్డాడు.

భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్యహస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానససరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాంధం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చెతులు జోడించిన నారదుడు సెలవుపుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానససరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాధుర్యాన్ని పట్టుకుని ఆవలిగిరి శిఖరం చేరాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాసాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న 'గానబంధు' నారదుని చూడగానే వినయంతో ఆశనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశలప్రశ్నలు వేసాడు. ఏతెంచిన కారణం చెప్పమని ప్రార్థించాడు.

నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీత వేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనేం! తనకు కావలసింది సంగీతవిద్య. ఉలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యంకాని శ్రీహరిని తుంబుర కౌశికులు గానమాధుర్యంతో వశం చేసికొన్నారని, తనకూ అలాంటీ దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు, నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింప సాగాడు - పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలి గుండెగలవాడు. ధర్మవర్తనుడు. సంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుని కూడా భక్తిగీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేసాడు. ఆ గానమాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజబటులు వచ్చారు. హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం. మరణశిక్షతో సమానమైనది రాజ్యబషిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసికొని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు.

కాలచక్రం తిరగడం మానదుకదా! కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టినప్రాణి కూడ పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంధజన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయింది. పురాకృత దోషఫలితం కాబోలు; ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరగలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసికొన్న సుకృతం వల్ల మరణ దేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముని చూచి 'ధర్మరాజా! ఎందుకు ఈవిధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు?' అన్నాడు భువనేశుడు. దివాంధ స్థితికి యమధర్మరాజు జాలి పడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా! తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది! అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు.

"దివాంధమా! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసినమాట నిజమే. కాని పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువైనదియా! ఆ పాప ఫలితం కొండంతయై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తోంది. విష్ణుభక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయట పడటం ఎవరికీ సాధ్యం కాదు". సమవర్తి చెప్పింది విన్నాక గాని, దివాంధానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించ వచ్చన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాలమీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. "ఉలూకరాజా! చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకుని భక్షించు. అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది" అని దీవించి వెళ్ళాడు.

"ఓ మహర్షీ! ఆ దురదృష్టవంతుడను నేనే! ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా, దివ్య తేజస్వియైన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూచి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి, 'ఇది భువనేశుని కాయము వలెనున్నది. ఇందేల పడియున్నది? దీనిని యీ పక్షి భక్షించుటేమి?" అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుని గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపైబడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతుండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకనుగుణంగా ఇలా పలికాడు. 'నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నాయెడల చూపిన కాఠిన్యం నేను ఆరోజునే మరచాను. నీవనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక! గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువు గాక!' అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవనలు ఫలించి నేనిట్లున్నాను" అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు.

ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో గాని, తామసంతో కాని అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు. గౌరవ భావం మొహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా వేయేళ్లు గడిచాయి. కఠోరమైనదీక్షతో నారదుడు 3,60.006 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమితానందంతో గురువును జేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను. ఏమికావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సంశయింప వద్దన్నాడు.

శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. 'ఓ మహర్షీ! దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను! దివాంధమునకు వలసిన అవసరములేమి ఉంటాయి? శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉండునంత వరకు సంగీతకళతోపాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరము ప్రసాదింపుము' అని మనసులోని మాట బయట పెట్టాడు. నారదుడు విశాలంగా నవ్వాడు. 'గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీతకళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాధిస్తున్నాను. ప్రళయం సంభవించినవేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతునివలె శ్రీమహాలక్ష్మికి నీవు వాహనమై తరియింతువు గాక!' అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకొన్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది.

శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ఎన్ని రోజుల్లో గీతోపదేశం చేశారు?

అంత పెద్ద గీతోపదేశ కావ్యాన్ని ఆయనకు చెప్పడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసుకోగోరుతున్నాను.

జ: రోజుల కొద్దీ గీతను ఉపదేశించలేదు కృష్ణుడు. యుద్ధం ఆరంభమైన రోజున ఉభయ సైన్యాలూ రణరంగంలో ప్రవేశించిన వెంటనే సమరం ఆరంభం కాలేదు. ముందుగా చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. అర్జునుడి కోరిక మీద ఉభయ సైన్యాల మధ్య కృష్ణుడు రథాన్ని నిలిపాడు. వారిరువురి సంవాద రూపంలో గీతోపదేశం జరిగింది. ఆ తరువాత ధర్మరాజు పాదచారిగా సోదరులతో పాటు శత్రుసైన్యం వైపు నడచి భీష్మ ద్రోణాది కురువృద్ధుల్ని నమస్కరించి వచ్చాడు. ఆ తరువాత శత్రు పక్షంలో ఎవరైనా శరణువేడితే అభయమిస్తానని రథంపై నిలబడి ప్రకటించాడు. అప్పుడు యుయుత్సుడు పాండవపక్షంలో చేరాడు. ఆ తరువాత యుద్ధం ప్రారంభమయ్యింది.

గీతలో ఏడు వందల శ్లోకాలున్నాయి. అవన్నీ సామాన్య వేగంతో చదివితే ఒకటిన్నర గంటలో పూర్తవుతుంది. ఈ శ్లోక సంఖ్యలో వందకు పైగా 'సంజయ ఉవాచ'లు, వర్ణనలు, విమర్శలూ ఉన్నాయి.

అవన్నీ తీసేస్తే శ్రీకృష్ణుని ఉపదేశం ఆరువందల కన్నా తక్కువే. ఈ భాగం చదవాలంటే గంటాపదిహేను నిమిషాలకు మించి పట్టదు. ఒక విషయం మాట్లాడ్డానికి పట్టే సమయం కంటే, గ్రంథస్థం చేసి చదవడానికి ఎక్కువ సమయం అవుతుదన్నది స్పష్టమయిన విషయమే. పైగా మాట్లాడే విషయం వ్యాసమహర్షి ఛందో రూపంలో వ్రాశారు. కృష్ణుడు చెప్పే విషయాలను నొక్కి చెప్పే కొన్ని ఉపనిషద్వాక్యాలు కూడా చేర్చారు. ఇలా చూస్తే భగవద్గీత కృష్ణార్జున సంభాషణం మహా అయితే పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది. ఈ గీతను రోజుల తరబడి ఉపన్యాసాలిస్తూ ఉంటారు పెద్దలు. కృష్ణుడు మాత్రం రోజుల తరబడి చెప్పలేదు. మరో విషయం, గీతోపదేశాన్ని 'కావ్యం' అనరు. అది తత్త్వశాస్త్రం.

Wednesday, September 26, 2018

గంగా నది నీటిలో వున్న అమృతం ఏంటి?

గంగా నది నీటిలో వున్న అమృతం ఏంటి?
అందుకేనా పవిత్ర నది అని అన్నారు పెద్దలు!!!

గంగ మీద ఆధునిక కాలంలో జరిగిన పరిశోధనలు చాలా ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడయ్యాయి.

పురాణాల నుండి ఇతిహాసాల వరకు … భారతీయ ఆధ్యాత్మిక గ్రంధాలనుండి ఇప్పటి వరకు మనకు వినిపించే మాట గంగా నది స్వచ్ఛమైనది, పవిత్రమైనది అని.గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తే అన్ని వ్యాధులు నశించి, శుభాలు కలుగుతాయని చెబుతుంటారు మన పెద్దవారు.

1896 లో ' ఈ హంబురె హంకిన్ (E. Hanbury Hankin) ' అనే బ్రిటిష్ వైద్యుడు ( British physician) గంగా జలం మీద పరీక్షలు జరిపి, ప్రెంచి పత్రిక అన్నాలెస్ డి ఇన్స్టుట్ పాశ్చర్ (Annales de IInstitut Pasteur) లో ఒక పరీశొధనా వ్యాసం రాశారు. దాని సారాంశం
ప్రాణంతకమైన కలరా వ్యాధిని కలిగించే bacterium Vibrio Cholerae ని గంగా నీటిలో వెసినప్పుడు అది కేవలం 3 గంటల్లోనే పూర్తిగా నశించింది. అదే బ్యాక్టీరియా శుద్ధి చేయబడిన జలాల్లో (distilled water ) 48 గంటల తరువాత కూడా జీవనం కొనసాగించింది. ఇది మన గంగమ్మ తల్లి శక్తి.

సి. ఈ. నీల్సన్ అనే బ్రిటిష్ వైద్యుడు భారత్ నుండి తిరిగివెళ్తూ, గంగా నది ప్రవాహంలో అత్యంత కాలుష్యమైన ప్రదేశమైన హూగ్లీ నుండి గంగా నీటిని నౌకలో ఇంగ్లాండు తీసుకువెళ్ళాడు. అంత కలుషితమైనా కూడా గంగ నీరు ఆయన సుదీర్ఘ ప్రయాణంలోనూ, ఆయన ఇంగ్లాండుకు చేరిన తరువాత కూడా ఆ నీరు పరిశుద్ధంగానే ఉంది. మాములు నీటిని గాలి చొరబడని సీసాలో పెడితే ప్రాణవాయువు లేని కారణంగా ఆ నీటిలో వాయురహిత బ్యాక్టీరియా (anaerobic bacteria) వృద్ధి చెంది నీరు వాసన వస్తాయి. ఆ వాసన దాదాపు కుళ్ళు వాసనలాగే ఉంటుంది. కాని గంగ నీరు మాత్రం పరిశుద్ధంగానే ఉంది. ఇది గంగకున్న శక్తి.

ఇది మనం కూడా గమనించవచ్చు. కాశీ యాత్రకు వెళ్ళినవారు గంగాజలాన్ని ఇంటికి తీసుకువస్తే అది ఎన్ని సంవత్సరములు గడిచినా చెడిపోదు, కుళ్ళువాసన రాదు. ఇది మన హిందువులు పూజించే గంగమ్మ తల్లి శక్తి.

1927 లో Flix dHerelle అనే ఫ్రెంచి microbiologist గంగ నీటిలో కొద్ది అడుగుల క్రింద విరేచనాలు (dysentery), కలరా వంటి జబ్బులతో మరణించిన వ్యక్తుల శవాలు తేలుతుండటం చూసి, ఆ ప్రదేశంలో ఉన్న నీటిలో కొన్ని కోట్ల క్రిములుంటాయని భావించారు. కానీ ఆ నీటిని సేకరించి, పరిక్షిస్తే, అసలు అక్కడ క్రిములే లేవు.

అందుకే కొన్ని వేల సంవత్సరాలుగా హిందువులు గంగ మృతదేహాలను పవిత్రం చేస్తుందని అంటారు. దాని అర్ధం ఇదే. భయంకరమైన రోగాలతో చనిపోయిన వారి మృతదేహాలను కూడా పరిశుద్ధం చేస్తుంది. అటువంటి శక్తి గంగకుంది.

డి. యస్. భార్గవ అనే భారతీయ environmental engineer/professor of hydrology తన జీవితకాలాన్ని మొత్తం గంగ యొక్క అద్భుతమైన శక్తిని గురించి పరిశోధించడానికే అంకితం చేశారు. గంగకు తనను తాను ప్రక్షాళణ చేసుకునే శక్తి మిగితా నదులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని తన 3 ఏళ్ళ పరిశోధనలో తేల్చారు. మిగితా నదులతో పోలిస్తే గంగ తన బయోకెమికల్ ఆక్సిజెన్ డిమాండ్ స్థాయిని అత్యంత వేగంగా తగ్గించగలదని, ఇతర నదులకంటే 15 నుంచి 20 రెట్ల వేగంగా తనలో కలిసిన వ్యర్ధాలను తొలగించుకోగలదని ఆయన పరిశోధనలో తేలింది.

న్యూడిల్లీ మలేరియా పరిశోధన కేంద్రం వారు ఇతర నది జలాలు దోమల పునరుత్పత్తికి దోహదపడతాయి. కాని గంగానది ఎగువజలాలు మాత్రం దోమల పునరుత్పత్తి ఉండదు. అక్కడ దోమలు పునరుత్పత్తి కాకుండా నిరోదిస్తుంది గంగమ్మ తల్లి జలం. అంతేకాదు! ఇతర జలాల్లో గంగా జలాలను కలిపితే ఆ నీరు కూడా దోమల పునరుత్పత్తిని నిరోదిస్తుంది.ప్రధానంగా 2 చెబుతున్నారు పరిశోధకులు.
1) గంగలో బ్యాక్టీరియోఫేజ్ (Bacteriophage) ఉండడం వలన అది సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది.
2) శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని కారణం/ శక్తి గంగానదిలో ఉండడం వలన, అది వాతావరణంలో ఉన్న ఆక్సిజెన్ ను తీసుకునేందుకు అసాధారణమైన సామర్ధ్యాన్ని ఇస్తోంది. దీనినే  Mystery Factor/Mystery X Factor అని పిలుస్తున్నారు.

బ్యాక్టీరియోఫేజ్ అంటే బ్యాక్టీరియను చంపే వైరసులు. ఏ విధంగానైతే పిల్లి ఎలుకను తింటుందో, అదే విధంగా ఈ వైరస్లు బ్యాక్టీరియాలని నాశనం చేస్తాయి. నిజానికి హాంకిన్, 1896 లో గంగ యొక్క యాంటి-బ్యాక్టీరియల్ లక్షణం గురించి ఒక నివేదిక ఇచ్చారు. అదే ఆధునికకాలంలో బ్యాక్టీరియోఫేజ్ గురించి చెప్పిన తొలి డాక్యుమెంటేషన్. హెరెల్ల్ గంగ యొక్క ఈ విశిష్టవంతమైన లక్షణాన్ని గమనించి, గంగలో ఉన్న ఈ వైరస్ బ్యాక్టీరియోఫేజే  అని చెప్పారు.

గంగాజలంలో ఆక్సిజేన్ స్థాయులు అధికంగా ఉండడమే చేతనే గంగ నీరు సుదీర్ఘకాలం పాటు తాజాగా ఉంటాయి. గంగ నీటిని ఇతర జలాలకు తగినంత మోతాదులో కలిపినప్పుడు, ఇతర జలాల్లోకి ఈ బ్యాక్టీరియోఫేజ్ వ్యాపించి,ఆ నీటిని కూడా శుద్ధి చేస్తుంది. దానిలో ఉన్న క్రిములను సమూలంగా నాశనం చేస్తుంది. అందుకే పురాతన హిందువులు, గంగాజలాన్ని తమతో పాటు తమ స్వస్థలాలకు తీసుకువెళ్ళి, అక్కడ ఉన్న జలవనరులలో కలిపేవారు. అదే ఈరోజు కూడా ఆచరిస్తున్నాం కాని మనకు కారణం తెలియదు, అవి కలపడం వలన కలిగే ప్రయోజనం కూడా తెలియదు.

ఇంకా చెప్పాలంటే,  బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులకు యాంటి-బ్యాక్టీరియల్ ఔషధం గంగాజలం.  ఈ నీటిని వాడేవారు కనుకే పురాతన హిందువులు ఎటువంటి యాంటి-బయోటిక్ మందులు వాడకున్నా, ఏ రోగం లేకుండా జీవితాంతం సుఖంగా గడిపేవారు. అతి తక్కువ పరిశోధనలు జరుగునప్పటికి, ఈ నీటిని బ్యాక్టీరియోఫేజ్ థెరపికి ఉపయోగించవచ్చని పరిశోధకుల అంటున్నారు. ఇటువంటి పరిశోధనలు సోవియట్ యూనియన్ లో చాలా ఎక్కువగా జరిగాయి. ఎందుకంటే హెరెల్ల్ గంగానది యొక్క బ్యాక్టీరియోఫేజ్ నే ప్రపంచానికి పరిచయం చేశాక, రష్యాలో ఆయన పేరు మీద ఒక పరిశోధన సంస్థ కూడా ఏర్పడింది.

నేడు అనేక హానికారక బ్యాక్టీరియ యాంటి-బయోటిక్స్ ను తట్టుకుని నిలబడే సామర్ధ్యం పొందాయి. ప్రపంచంలో చాలా యాంటి-బయోటిక్స్ విఫలమవుతున్నాయి. అందువల్ల ప్రజలలో రోగనిరోధకత క్షీణించి, వారి చికిత్స చేయడం కూడా వైద్యులకు చాలా సంక్లిష్టంగా మారుతోంది. మానవజాతి యాంటి-బయోటిక్స్ కి పూర్వం ఉన్న శకంలోనికి వెళ్ళిపోతోందనే ఆందోళన మొదలైంది. అత్యవసరంగా ప్రత్యామ్నాయ పద్ధతులను అభివృద్ధి చేయడమే అతి ముఖ్యమైన అంశాలుగా ఆధునిక వైద్యము, బయోటెక్నాలజి రంగాలు కృషి చేస్తున్నాయి.

ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులలో గంగ నీటితో యాంటి-బయోటిక్ ను తయారుచేసి ఔషధంగా కనుక ఇస్తే కనుక ప్రజలు ఏ రోగం లేకుండా, మందులు వాడకుండా హాయిగా బ్రతకవచ్చని గంగ నది మీద  పరిశోధనలు చేసిన అనేక మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు తెగేసిచెప్తున్నారు.

ఇంత గొప్పది మన గంగమ్మ. ఇన్ని విశిష్టవంతమైన లక్షణాలు మన గంగమ్మ తల్లికే సొంతం. ఇది హిందువులకు, భారతదేశానికి గర్వకారణం.అంతేకాదండోయ్! మరొక ఆసక్తికరమైన అంశం, ఈ మధ్యే బ్రిటిష్ వారి పరిశోధనలలో తెలింది. ఈ పవిత్ర కుంభమేళా సమయంలో పవిత్రస్నానం చేసినవారికి మానసికరోగాలనుండి విముక్తి లభించిందట. చాలా శారీరిక రోగాలు తగ్గిపోతున్నాయట.. ఎంత గొప్పది మన గంగమ్మ తల్లి.  నదిలో మునిగితే ఏం వస్తుంది అనేవారికి ఇది సమాధానం కూడా.

2003 లో పవిత్ర గోదావరి నదికి నాసిక్ లో జరిగిన అర్ధ కుంభమేళ లో 6 కోట్లమంది స్నానం చేశారని అంచనా. అప్పుడు అక్కడి నీటిని పరిక్షిస్తే అందులో కూడా 8, 9 రకాల బ్యాక్టీరియోఫేజులను పరిశోధకులు గుర్తించారు. అటువంటి శక్తి గోదావరికి కూడా ఉంది. అందుకే పంచ గంగలో గోదావరి నది ఒకటైంది.

గంగకే పరిమితమైన జీవరసాయనిక ప్రకృతి(special chemical and biological properties), అత్యధిక స్థాయి re-oxygenation ప్రక్రియ దాని ప్రత్యేకతలు. వాటి కారణంగానే, గంగ సహజవ్యర్ధాలను అతిత్వరగా తనలో కలిపేసుకుంటుంది. జంతువులు వ్యర్ధాలను గంగనీటితో నింపిన ఒక ట్యాంకులో వేస్తే అవి కేవలం 3 రోజుల్లోనే కరిగిపోయాయి.

వివాహ ప్రయత్నాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు

      వివాహ ప్రయత్నాలలో వున్న వారికి ఒక సూచన. జాతకాలు చూపించి వివాహం చేద్దాం అనుకున్నా! లేక జాతకాలు చూపించకుండా వివాహం చేద్దాం అనుకున్నా! భగవంతుడు రాసిన వధూవరులను జ్యోతిశ్శాస్తవ్రేత్తలు మార్చలేరు. ఇది తథ్యం. మరి జ్యోతిషం చూపించడం ద్వారా దోష పరిహారాలు చేసుకోవడం, అనవసర సంబంధాల కోసం వెంటపడకుండా మనకు తగిన స్థాయి అన్వేషణ కోసం మాత్రమే ఈ సిద్ధాంతం ఏర్పరిచారు అని గ్రహించండి. జాతకాలు చూపించకుండా వివాహం చేశాము కావున పిచ్చి సంబంధం వచ్చింది. జాతకం చూపించి చేశాము కావున మంచి సంబంధం వచ్చింది అనేది ఒక తప్పు మాట.

మరొక సూచన. మా అబ్బాయి నక్షత్రానికి కుదిరే నక్షత్రాల లిస్ట్ ఇవ్వండి అని కొత్తగా అడుగుతున్నారు ఈ మధ్యన. ఈ విధమైన అధ్యయనం చాలా తప్పు. మీరు జాతకాలు చూపించ దలచుకుంటే మంచి సిద్ధాంతిని అనుసరించండి. కేవలం జన్మ నక్షత్రాలతోనూ, పాయింట్ల పట్టికతోనూ ఏమీ ఉపయోగం లేదు. పూర్తి జాతకం శోధింపచేయండి. లేదా పూర్తిగా త్యజించండి. మధ్యస్థంగా నక్షత్రాలు మీరు చూడడం, జాతకాలు సిద్ధాంతి చూడడం వంటివి చేసి శాస్త్రాన్ని అపహాస్యం చేయకండి.

సాధారణంగా వివాహ ప్రయత్నాలు, పిల్లలకు యుక్త వయసు రాగానే ప్రారంభిస్తాం . అప్పుడు ఒక మంచి రోజు చూసుకొని వినాయకుడికి పూజ చేయించి ప్రారంభించడం శ్రేయస్కరం. మంచి రోజు అంటే మంగళవారం కాకుండా... పౌర్ణిమ, బహుళ పాడ్యమి, రెండు పక్షాలలోనూ విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి మరియు శుక్ల పక్షంలో ఏకాదశి, త్రయోదశి, రోజులలో మరియు అశ్విని, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రములు వున్న సమయంలో తారాబలం కుదిరిన రోజున వర్జ్య దుర్ముహూర్తము లేని సమయంలో మరియు మూఢమి, అధిక మాసం, గ్రహణం వంటి దోషములు లేని రోజులలో పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాలి. పైన చెప్పిన తిథి, వార నక్షత్ర వివరములు పెళ్లిచూపులకు కూడా వర్తిస్తాయి.

సోమవారం సపత్ని దోష కారణంగా పెళ్లి పనుల విషయమై నిషేధము అనే ఆచారము ఉన్నది.కాని కొన్ని గ్రంథంలోనూ శుభ గ్రహ వారములు వివాహానికి విశేషం అని చెప్పారు. అంటే సోమవారం చంద్రాధిపత్యం వున్న వారం కావున సోమవారం శాస్తత్రః గ్రాహ్యమే. క్షీణ చంద్ర వారంగా చెప్పబడే అమావాస్య ముందు వచ్చే సోమవారం మాత్రమే నిషేధం. పూర్ణ చంద్రుడు వున్న సోమవారం వివాహం శాస్తత్రః నిషేధం లేదు.

పెళ్లిచూపులు.. సదా మూఢమి, అధిక మాసాలలో పెళ్లిచూపులు పనికిరాదు. వధూవరులు మూఢమిలో ప్రథమతః కలుసుకున్న దోషం ఇక జీవితాంతం ఉంటుంది. అందువలన తప్పనిసరిగా ప్రతి పెళ్లిచూపులు కూడా మంచి రోజులలోనే చేయడం మంచిది. అలా కాని యెడల ఏదేని దేవాలయంలో ప్రథమతః పెళ్లిచూపులు కార్యక్రమం పూర్తి చేసుకోండి. అన్నింటికీ దైవ సన్నిధి చాలా గొప్పది కదా. శాస్త్ర విషయంగా వచ్చే ప్రత్యవాయువులను దైవ సన్నిధి దూరం చేయగలదు.

నిశ్చయ తాంబూలాలు.. ఇది పెద్దల మధ్యన జరిగే వేడుక ‘అగ్రిమెంట్’ అనవచ్చు. ‘వాచాదత్తా మయా కన్యా వరార్థం స్వీకృతాత్వయం’ విషయమై వధూవరులను కూర్చుండబెట్టి గణపతి పూజ చేయిస్తాం కావున పగలు 12లోపు నిశ్చితార్థం శాస్తస్రమ్మతం. ఆ తరువాత చేయు నిశ్చితార్థం శ్రేష్ఠం కాదు. పనులు ప్రారంభానికి, నిశ్చితార్థానికి కూడా గణపతిపూజ చేయడం చాలా అవసరం. పెళ్లికి, నిశ్చితార్థానికి, పెళ్లిచూపులకు, పసుపు కొట్టుటకు వచ్చే ముత్తైదువులు తప్పనిసరిగా శుభ లక్షణాలు సూచించే పసుపు, కుంకుమ, పూలు, అంచు వున్న చీర ధరించిన వారయి ఉండాలి. పెళ్లికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ఇంటికి వచ్చిన ముత్తైదువు కాళ్లకు పసుపు రాసి ముఖాన బొట్టు పెట్టడం సంప్రదాయం.

నిశ్చితార్థం తరువాత శుభలేఖలు పంపిణీ మొదలు దేవుడికి ఇచ్చి తరువాత చేయాలి. మరియు మంగళ సూత్రం కొనుగోలు, మధుపర్కముల కొనుగోలు, పెళ్లికి బయల్దేరుట, మగ పెళ్లివారిని పెళ్లికి ఆహ్వానించుట అనేవి ముఖ్యాంశాలు. వీటికి కూడా పైన చెప్పిన తిథి వార నక్షత్రములు గ్రాహ్యము. పెళ్లికుమారుని చేయుట, పెళ్లికుమార్తెను చేయుట, పెళ్లిపందిరి వేయుట అనే అంశాలకు కూడా పైన చెప్పిన తిథి వార నక్షత్రములు గ్రాహ్యం. శనివారంనాడు ఉప్పు, నూనె, చెప్పులు, వస్త్రం కొనరాదు. కావున పెళ్లికి ఈ నియమం వర్తిస్తుంది.

కన్యాదాతల వివరం.. తండ్రి కన్యాదానానికి అర్హుడు. తండ్రి లేని ఎడల పితామహుడు, తండ్రి సోదరులు, వధువు యొక్క అన్నగారు, పితృ వంశస్థులు, మాతామహుడు, మేనమామ, సగ్రోతీకులు అనువారు వరుసగా అధికారులు అగుదురు. కన్యాదానం యోగమే.

ఏకోదర వివాహం.. పుత్రీ పాణీని పీడనాచ్చ పరతస్సూనోర్వివాహ శ్శుభో నాస్యత్పుత్ర కరగ్రహత్తునకమప్యు ద్వాహ ఏవ వ్రతాత్’ అనే కాలామృత శ్లోకాధారంగా ఏకకాలమందు పుత్ర పుత్రికా వివాహముల విషయమై పుత్రికా వివాహానంతరం పుత్ర వివాహం విశేషం. పుత్ర వివాహానంతరం పుత్రికా వివాహం మరొక పుత్రుని ఉపనయనం చేయరాదు. అలాగే పుత్ర ఉపనయనానంతరం పుత్రికా వివాహం చేయవచ్చు. పుత్ర వివాహం చేసిన సంవత్సరమందు ఆరు నెలలు పర్యంతము ఏకోదరులకు ఉపనయనాదులు నిషేధము. చిన్నవాడికి ఉపనయనం చేసి వెంటనే పెద్దవాడికి వివాహం చేయవచ్చు. ఫాల్గుణ చైత్ర మాసేతు పుత్రో ద్వాహోపనాయనే అబ్ద భేదాత్ప్రకుర్వీత ఋతుత్రయ విడంబన - అనగా ఫాల్గుణ మాసం ముందు ఒకరికి చైత్రమాసం తరువాత మరొకరికి వివాహం ఉపనయనం వంటివి చేయు విషయంలో సంవత్సర భేదం వున్నది కావున దోషం వుండదు.                             🙏🏻🙏🏻🙏🏻

మృత్యుంజయ మంత్రం..!!


మనకు ఆయురారోగ్యాన్ని,
సౌభాగ్యాన్ని,దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని,
ఇచ్చేదిమహామృత్యుంజయ మంత్రం.

ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవు లు పాచరాత్రదీక్షలో హోమ భస్మ ధారన మంత్రంగా చెప్పుకుంటారు.

ఇది అందరికీ, అంటే శైవులకు,  వైష్ణవులకు,
మాధ్వులకు ప్రామాణిక మయిన మంత్రం.

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనం.!
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల,
దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులనుతరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంత మైన రక్షణ కవచం ఏర్పడు తుంది.

ప్రమాదాల బారిన పడకుం డా ఉండేందుకు,దురదృష్టా ల నుంచి బయటపడేం దుకు,మహా మృత్యుం జయ మంత్రాన్ని పఠిస్తుం టారు.

ఈ మంత్రానికి సర్వరోగాల ను తగ్గించే శక్తి ఉంది.

ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది.

మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి,
మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి.
ఇంకా పరమశివుని రుద్ర స్వభావాన్ని సూచిస్తూ..
ఈ మంత్రం రుద్రమంత్ర మని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ..
మృతసంజీవనీ మంత్ర మని పిలువబడుతోంది.

ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. 
శివతత్వంలో “మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది.
ఆ స్వామి త్రినేత్రుడు,
త్రిగుణాకారుడు,
త్రి ఆయుధుడు,
త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు,
మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు,
త్రిజన్మ పాప సంహారుడు,
త్రిశూలధారుడు,
త్రికాలధిపతి,
త్రిలోకరక్షకుడు,
మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా?
అందులోసందేహమేముంది.

ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువం టి రోగాలు దరిచేరవు.
ఈ మంత్రంయొక్కగూఢార్థా న్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.

ఓం:
భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది.
ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే
ఓంకారం.
ఋగ్వేదం నుండి  ‘ అ ‘ కారం.
యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం,
సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడిం టి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది.

ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూ పం.

ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం.

కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి,
ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్నిచేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధార ణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.

త్ర్యంబకం:
భూత, భవిష్యత్, వర్తమా నాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు.
త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్నసూక్ష్మ రూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు.
శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి.
ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని  కీర్తిస్తున్నాం.

యజామహే:
అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి.
సర్వవేళలా మనకు రక్షగా ఉన్నస్వామినిమనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పు డు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలా హలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపో యాయి. సర్వత్రాఆర్తనాదా లు…హాహాకారాలు.  సమస్త లోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి కరిగిపోయిన స్వామి, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడైసమస్తలోకాలను కాపాడాడు.
ఆ స్వామిని ప్రార్థిద్దాం.

సుగంధిం:
సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం.
ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమ ళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు.
ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే,
ఆ స్వామిని పూజించడా నికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టు మీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయన కు నైవేద్యం కూడా అవసరం లేదు.
ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తా డు.

పుష్టివర్థనం :
మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు.
సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడు తాడు.

ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించ సాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయి నా ఆ పులి అతడిని వదల్లేదు. 
చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయ సాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు.
ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు.
ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి.
ఆరోజు శివరాత్రి కూడా.
పులిభయంతో వేటగాడు,
వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలాకాపాడుతుంటాడు.

ఉర్వారుకం – ఇవ – బంధనం :దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.

మృతోర్ముక్షీయ:
అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని,
మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటు న్నాం.

మృత్యువు అంటే భౌతిక పరమైన మరణం మాత్రమే కాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. 
భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.ప్రకృతి లో అందాన్ని ఆస్వాదించలేక అంతావికారంగాఉందనుకు నేవారికి, అంతా వికారం  గానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సందేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే.
ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తు లను చేసి, మన జీవితా లను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.

అమృతాత్ :
స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు.
అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.

శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసరమల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు

శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ,
ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది.
కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.

మనకున్న చిరంజీవులలో  ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు.
అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే.

ఆ కథ ప్రకారం..
రావణ వథానంతరం అయోధ్యకు చేరుకున్న రామ చంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్యమహర్షి తదితరులు శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకుని హనుమంతు ని ప్రశంసించ సాగారు.

అప్పుడు శ్రీరాముడు, మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక, ఎందుకు హనుమంతుని పొగుడుతు న్నారనిఅడిగాడు.అప్పుడు అగస్త్యాది మునులు, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతు నితో సరితూగగల బలపరాక్రమ వంతులు ఎవరూ లేరని,
అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడువాలినిసంహరించలే కపోయాడని చెప్పారు.
అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం,
అతి చిన్న రూపాన్ని ధరిం చడం, సీతమ్మవారిని దర్శించడం, లంకాదహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు.
అదేవిధంగా బాలహనుమ, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి, ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పెడతాడు. అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి, శివుని కరుణతో బాల ఆంజనేయు డు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటి కీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవ త్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం.

ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి, ఆయురా రోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు.

ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు,
ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.

ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల,
దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండాకాపాడబడతాయి.

మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నా యి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం.

మృత్యువును జయించాల నుకునే వ్యక్తులు పరమ శివుని రక్షణకోరితే సరిపో తుందని ఋగ్వేదం అంటు న్నది.

తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అనికూడపిలువబడుతున్నాడు.

ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో,
వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు.
అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం.ఓం నమః శివాయ..!!

లోకా సమస్తా సుఖినోభవంతు..!!

 ఓం నమశ్శివాయ.🌹

ఎవరితో ఎలా మాట్లాడాలి ?

ఇప్పుడు మనం కొన్ని వేల రూపయలు ధారపోసి కమ్యునికేషన్ స్కిల్స్ అని నేర్చుకుంటున్నాం. పురాణ గ్రంధాలలో వీటి గురించి చక్కగా వివరించారు. ఈ స్కిల్స్ అనేవి మనం హనుమంతుడిని నుండి నేర్చుకోవచ్చు.

మాట్లాడే విద్యకి ఉన్న గొప్పదనం ఆదికావ్యం వాల్మీకి రామాయణంలోనే కనబడుతుంది. హనుమంతుడు అంటే రామభజన చేసేవాడని సామాన్యుల భావన. కాని వాల్మీకి రామాయణంలో హనుమంతుడు కేవలం భజన పరుడుకాదు. వేదత్రయాన్ని అధ్యయనం చేసినవాడు. కార్యదీక్షా పరుడు, ఉత్తమ మంత్రి, దూత, నేత, అనుచరుడు, సేవకుడు. ఏ స్థానంలో ఉంటే ఆ ధర్మాన్ని సక్రమంగా, ఆదర్శవంతముగా నిర్వహించిన వాడు.

ఎలా మాట్లాడాలి??

👉 శాస్త్రానుసారం ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతాడు పవనకుమారుడు. అది ఎలాగన్నది కిష్కింధ కాండలో మొదటిసారి హనుమంతుడు, రాముడిని కలిసినపుడు, రాముని నోట పలికించాడు వాల్మికీ మహర్షి.

ఎలా మాట్లాడాలంటే..

👉 విషయం స్పష్టముగా ఉండాలి
👉 వాక్యంలో దోషాలు ఉండకూడదు.
👉 ముఖము, కన్నులు, నుదురు, కనుబొమ్మలు..ఏ అవయవంలోనూ వికార చేష్టలు ఉండకూడదు.
👉 విషయంతో సంబంధంలేని మాటలు మాట్లాడకూడదు.
👉 సందిగ్ధంగా ఉంచకూడదు.
👉 మాటలను ఆపి ఆపి మాట్లాడకూడదు
👉 మాట మనసులోనుండి రావాలి
👉 మధ్యమ స్వరంతో మాట్లాడాలి

ఇలా హనుమ మాట్లాడినట్లు అభ్యాసం చేయగలిగితే, ఎవరైన, ఏ రంగంలోనైనా, ఎక్కడైన రాణించగలరు.

ఎవరితో ఎంత మట్లాడాలి ??

ఎవరితో ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడొచ్చు, ఏం మాట్లాడకూడదు అనేది ప్రతీరోజు మనం చూసే ప్రధాన అంశం. నీతులు, నియమాలు ఒక వాక్యంలో చెప్పి వదిలేస్తే హృదయానికి హత్తుకోవు. విషయం అర్ధం అయ్యేలా స్పష్టముగా చెప్పాలి.

దూతగా...

మధ్యవర్తిగా వెళ్ళినపుడు ఎలా మట్లాడాలి అనేది హనుమంతుడు రామదూతగా అశోకవనంలో సీతమ్మ తల్లితో మాట్లాడిన తీరు గమనించాలి.

అశోకవనంలో ప్రాణత్యాగానికి పాల్పడుతున్న సీతను చూసాడు హనుమ. ముందుగా ఆమె చేత ఆ ప్రయత్నాన్ని విరమింపచేయాలి, రాముడు రాబోతున్న వార్త తెలపాలి, అంతకుమించి తాను రామ దూత అని నమ్మించాలి. ఏ విధముగా సంభాషించాలి అని అలోచించి “ దశరధుడు అనే మహారాజు అయోధ్యకు రాజు....అని విషయాన్ని చెప్పడం మొదలు పెట్టాడు చెట్టు మీద కూర్చునే, రాముడి పేరు తప్ప మరొకరి పేరు తెలియని లంకలో దశరధమహారజు పేరు వినబడిందంటే, తన ఆత్మీయులు ఎవరో వచ్చారని అర్ధమై ఆత్మహత్యా ప్రయత్నం మానేసింది సీత. అప్పుడు పవనకుమారుడు సీత ఎదురుగా వచ్చి, రాముడు వానర సైన్యంతో సీతను విడిపించడానికి వస్తున్నడనే విషయాని సీతమ్మకి తెలియచేస్తాడు. తాను చేసిన సాహసాలు ఒక్కటి కూడ చెప్పడు.

రాముడు వచ్చేవరకు సీత జీవించి ఉండేలా చేయాలి, అందుకు ఏం చేయాలి? రాముడు రాబోతున్న వార్త చెబితే చాలు, తన సాహసాల గురించిన ప్రస్తావన అవసరంలేదు. అందుకే హనుమ అవసరం మేరకు మాత్రమే మాట్లాడాడు.

స్నేహితులతో...

సీతను చూసి, రావణుడిని హెచ్చరించి, లంకా దహనం చేసి తిరిగి తన కోసం ఎదురు చూస్తున్న వానరసేనను కలుస్తాడు హనుమ. సీతను చూసాను అనే మాట మాత్రమే చెప్పి వారి మనసులను కుదుట పరుస్తాడు. ప్రాణాలు కుదుటపడ్డ వానరులు, అసలు ఎలా సముద్రాన్ని దాటగలిగావు, సీతమ్మను ఎలా కనిపెట్టావు అని అడిగారు.

ప్రభువుతో...

సీతమ్మ చెప్పిన, చిత్రకూటంలో జరిగిన ఒక సంఘటనను హనుమ రాముడితో చెప్పాడు. (తాను సీతను చూసాననే దానికి ఆనవాలుగా). తరువాత అసలక్కడ సీతమ్మ ఎలా ఉంది, రావణుడి గురించి వివరంగా తెలిపాడు.

ముఖ్యమైన విషయం ముందే చెప్పేయాలి. అంతేగాని టి.వి సీరియల్ లా సాగదీయకూడదు. అవసరమైన విషయం ముందు చెప్పేసి, తరువాత విషయాలు నెమ్మదిగ చెప్పాలి.

ఇలా ప్రత్తి ఒక్క పురాణం నుండి మనం నేర్చుకోవలసింది, నేర్చుకుని ఆచరించవలసిన అంశాలు చాల ఉంటాయి. కనీసం మనం ఒక్కదాని ఆచారణలో పెడితే, దాని ఫలితాలకు తిరుగుండదు.

ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?

1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
2. ఎంత అవసరమైన  కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
4. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి.
5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి .
6. అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.
7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నాం కదా ... కొన్ని నిజాలు చూద్దాం ...
అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని
అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి
అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు.

అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు.
తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాష్టాత్ లక్ష్మీ దేవి కటాక్షo కలుగుతుంది.
బాదాం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.
టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.

జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు.
1) ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి .... అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి... ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ.
2) దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే ... తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ.
పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది
ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది
దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది
కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు

అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టట,దుర్భాష లాడుట చేయరాదు.
ఏడుస్తూ తింటూ ,గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు.
ఎట్టిపరిస్థితిలో నైనా ఒడిలో కంచెం పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును.
భోజనసమయంలో నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం
భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు.

 నీవు చేసే నీ పనుల వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి. ... ఆనందమే విజయానికి సోపానం. అనంతవచనం

Nava Grahas with Wives

ఇప్పటి వరకు మీకు నవగ్రహాలు వారి పేర్లు మాత్రమే తెలుసు, అయితే కొందరికి అదికూడా తెలియని వారు ఉన్నారు, అయితే ఇప్పుడు మనం నవగ్రహాలు మరియు వారి భార్యలు, వారి పేర్లు కలిపి ఇక్కడ అందిస్తున్నాను ...













స్మరణతో..అన్నీ పొందవచ్చు..!!

💐శ్రీ💐
నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి..మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము ...

1. గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!

2.శివాష్టకం - శివ అనుగ్రహం !!

3. ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!

4.శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!

5.అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!

6.కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!

7.దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!

8.విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!

9.సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!

10. హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!

11.విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!

12.శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!

13. భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!

14.శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!

15.లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !!

16.కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!

17.ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !!

18. శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!

19.లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!

20.శ్యామల దండకం - వాక్శుద్ధి !!

21.త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!

22.శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!

23.శని స్తోత్రం - శని పీడ నివారణ !!

24. మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!

25.అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!

26.కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!

27.కనకధార స్తోత్రం - కనకధారయే !!

28.శ్రీ సూక్తం - ధన లాభం !!

29.సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!

30. సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!

31.విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !!

32.రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!

33.దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!

34.భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !!

35. వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

36.దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

37.లలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !!

సర్వే జనా సుఖినోభవంతు..!!💐
                           💐శ్రీ మాత్రే నమః💐

Tuesday, September 25, 2018

Ancient Arts

I am not advertising anything here, but was interested to see that our ancient arts are still prevailing and someone is actually promoting them. I would also like to promote them. Below are the details

Any one interesting to learn our ancient arts. ....those arts are....

*AYURVEDA
*PANCHAKARMA
*SIDDHA
*MARMA ART - VARMAKKALAI
(all types of systems include saadhana)
*DOWSING
*PSYCHOLOGY - SEXOLOGY
*YOGA
(Include saadhana)
*SUJOK
*SHIATSU
*ACUPUNCTURE
*BACHFLOWER
*JANYA KALA
(traditional martial arts )
*NATUROPATHY
*NUMEROLOGY
*PRANIK
(Include saadhana )
*REIKI
(Include saadhana )

MAC&SK  ( traditional GURUKULA-VAIDYASALA-SAADHANASTAAN )
Agastya marmani group
( ancient arts study - develop - re search centre )
( ancient GURU - SHISYA parampara )
Visit - ancientkalas.blogspot.in 

దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు చేసే ప్రార్ధన

మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ .
అది ఏమిటంటే ..!

💠"అనాయాసేన మరణం
వినా దైన్యేన జీవితం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం ."

💠మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి .

💠దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి .

💠"అనాయాసేన మరణం" :

నాకు నొప్పి, బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు/ఆయాసము(ఇక్కడ ఆయాసము అంటే ఎటువంటి కష్టము లేని) లేని మరణాన్ని ప్రసాదించు.... .

💠"వినా దైన్యేన జీవితం" :

నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు ....

💠"దేహాంతే తవ సాన్నిధ్యం" :

మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు .... 

💠"దేహిమే పరమేశ్వరం" :

ఓ ప్రభూ ! నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను .

💠1)అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు .నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు .
2)ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను. కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు .
3) నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా
ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు .
ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు  చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి .
💠" లోకా సమస్తా సుఖినో భవంతు ..!!

30 రకాల శివలింగాలు - ఫలితాలు

సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం. రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి...

01. 🕉 గంధలింగం: రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

 02. 🕉 పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

03. 🕉 నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.     

04. 🕉 రజోమయలింగం: పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.

05. 🕉 ధాన్యలింగం: యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.

06. 🕉 తిలిపిస్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.

07. 🕉 లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.

08. 🕉 కర్పూరాజ లింగం: ముక్తిప్రదమైనది.

09. 🕉 భస్మమయలింగం: భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.
                 
10. 🕉 శర్కరామయలింగం: సుఖప్రదం

11. 🕉 సద్భోత్థలింగం: ప్రీతిని కలిగిస్తుంది.

12. 🕉 పాలరాతి లింగం: ఆరోగ్యదాయకం

13. 🕉 వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.

14. 🕉 కేశాస్థిలింగం: వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.
       
15. 🕉 పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16. 🕉 దధిదుగ్థలింగం: కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది

17.🕉 ఫలోత్థలింగం: ఫలప్రదమైనది

18. 🕉 రాత్రిఫలజాతలింగం: ముక్తిప్రదం.

19. 🕉 గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.

20.🕉 దూర్వాకాండజలింగం: గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.

21.🕉 వైడూర్యలింగం: శత్రునాశనం, దృష్టిదోషహరం

22.🕉 ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.

23. 🕉 సువర్ణనిర్మితలింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.

24.🕉 రజతలింగం: సంపదలను కలిగిస్తుంది.

25.🕉 ఇత్తడి - కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.

26. 🕉 ఇనుము - సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది.   

27.🕉 అష్టథాతులింగం: చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.

28. 🕉 తుష్ణోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.

29. 🕉 స్పటిక లింగం: సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.

30. 🕉 సీతాఖండలింగం: పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.

పితృదేవతా స్తుతి

శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహాపురాణం’లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.

నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!
దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేషు స్వధోత్తరైః!!
నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!
శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!
నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!
తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!
నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!
శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!
నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!
వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!
నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!
యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!
కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!
నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!
స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!
సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!
సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!
తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!
పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!
తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!
పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!
యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!
పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!
ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!
తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!
సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!
సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!
తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!
యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!
యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!
యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!
కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!
కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!
తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!
దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!
యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!
పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|
తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!
తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!
తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!
యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!
తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!
రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!
ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!
అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!
వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!
అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!
తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!
ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!
రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!
సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!
విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!
భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!
కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!
కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!
వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!
విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!
మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!
సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!
పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!
ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!
త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!
మార్కండేయ ఉవాచ
ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిర్రుచ్ఛ్రి తః!
ప్రాదుర్బభూవ సహసా గగనవ్యాప్తి కారకః!!
తద్ దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్!
జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదం జగౌ!!
రుచిరువాచ
అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్!
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!
ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా!
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్!!
మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా!
తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి!!
నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా!
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!!
ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!
నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!
స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే!!
సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా!
నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!
అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్!
అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః!!
యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!

తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!
నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః!!
మార్కండేయ వువాచ
ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః!
నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!
నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!
తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్!!
ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!
నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!
స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!
తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!
ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!
వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!!
శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్!
పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!
స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే!
అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్!!
యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!
సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి!!
తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః!
శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్!!

(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు)

Thursday, September 20, 2018

108 ప్రాముఖ్యత ఏమిటి ?

🌎మనం ఏదైనా మంత్రం జపించడానికి 108 సంఖ్య ముఖ్యం. అష్తోత్తరాలలో 108 సంఖ్య నామాలతో దేవతలను ఆరాధిస్తాము. ఇందుకు ప్రముఖమైన కారణం 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 x 4 = 108 అని, ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటాడు కావున ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత అని తెలుసు. కానీ వీటికన్నా మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాము.

🌍🌍ఖగోళ పరంగా
సూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6million kms. ఈ దూరాన్ని  సూర్యుని చుట్టుకొలత 1391000kms  తో భాగిస్తే వచ్చే సంఖ్యా రమారమి 108

🌏🌏🌏అలాగే చంద్రునికి, భూమికి ఉన్న దూరం 38లక్షల కిలోమీటర్లను చంద్రుని చుట్టుకొలత అయిన 3474 kms తో భాగిస్తే వచ్చే సంఖ్య 108
27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 x 4 = 108
12 రాశులు , 9 నక్షత్ర పాదాలు = 12 x 9 = 108

🌎హైందవం ప్రకారం
ముఖ్య శివలింగాలు – 108, అందుకే శైవ మతాలు కూడా 108.
గౌడియ వైష్ణవంలో బృందావనలో 108 గోపికలను పూజిస్తారు.
108 వైష్ణవ దివ్య క్షేత్రాలు
కంబోడియాలో ఆంగ్కోర్ వాట్ గుడిలో 108 మంది (అసురులు, దేవతలు) కలిసి సాగరమధనం చేసినట్టు చిత్రింపబడివుంది.
హైందవ భావాలనుండి ప్రేరణ పొందిన బౌద్ధం ప్రకారం పంచేంద్రియాలతో స్పృహ ను కలిపి ఆరు భావాలను, వాటివల్ల కలిగే అంతర్భావాలైన సుఖము, దుఃఖము, స్తిరత్వబుద్ధిని, గుణించి, అవి బాహ్యంగానైనా, ఆంతరంగానైనా భూత భవిష్యద్ వర్తమానాలలో కలిగిన భావనలను గుణిస్తే 6x3x2x3 = 108

🌍🌍ఒక జీవుని ప్రయాణం “పూర్ణమదః పూర్ణమిదం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పుర్ణాత్పూర్ణముదచ్యతే | పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” ద్వారా ఇన్ఫినిటీ (8) కు చేరుకునే విధానం 108 symbolism.

🌳🌴🌱🌿🌵ఆయుర్వేదం ప్రకారం 108 మర్మ స్థానాలు, శక్తి కేంద్రాలు

🤜🤜🤛👊☠కలారిపయట్టు ప్రకారం ( తరువాత కరాటే గా మారింది) 108 pressure పాయింట్స్

😡😡108 డిగ్రీల జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ఉన్న అన్ని అవయవాలు చచ్చుబడిపోతాయి.

⭐⭐108 జపం మనస్సును నిర్మలం చేస్తుంది, లోపలున్న భావాలను అణగదోక్కుతుంది.
సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వాటికి శివ, శక్తి తత్త్వాలైన స్త్రీ, పురుష రూపాలుంటాయి. 54x2 = 108
12000 దివ్య సంవత్సరాలు = 43,20,000 మానవ సంవత్సరాలు = బ్రహ్మకు ఒక పగలు = 4000 x 108
108 లో 1 జీవుడిని తెలియచేస్తుంది. 8 జీవుని తత్త్వాలను తెలియ చేస్తుంది. 0 – పరిపూర్ణ భగవత్తత్త్వము. ఈ శరీరాన్ని, జీవుడిని కలిపి నియమించేది పరిపూర్ణ భగవత్తత్త్వము -108.
1+0+8 = 9, చాలా ముఖ్యమైన సంఖ్య. 9 తో ఏది కలిపినా వచ్చిన సంఖ్యలో numberలను కలిపితే చివరకు అదే సంఖ్య వస్తుంది

🔢➗✖➕➖🔢గణిత పరంగా
108 ఒక abundant number. అంటే వాటి divisors 1+2+3+4+6+12+18+27+36+54 = 163 > 108
Tetranacci number ( ముందటి నాలుగు fibonacci నమ్బెర్లను కలిపితే వచ్చేది) 0,0,1,1,2,4,8,15,29,56,108
హైపర్factorial 1*1 + 2*2 + 3 **3 = 108
ఒక పెంటగాన్ కోణాలు అన్నీ కలిపితే 108
ఒక refactorable number ( వాటి divisors ఎన్నున్నాయో వాటితో భాగింపపడగలిగేది )
ఇంకా మరెన్నో విశిష్టతలను తనలో ఇముడ్చుకున్న సంఖ్యా

ఇటువంటి వైశిష్ట్యం ఉన్నది కనుకనే మన ఋషులు, ద్రష్టలు ఎప్పుడో 108 సంఖ్య ప్రాముఖ్యతను మనకు నామాలలో, ప్రదక్షిణలలో, జపాలలో విధిగా విధించారు. వారి దార్శనికతకు జోహార్లు అర్పిస్తూ.

మీ పొట్ట పోయి సిక్స్ ప్యాక్స్ రావాలంటే సూర్య నమస్కారాలు చేయాలి

ప్రతి నిత్యం చేసే వాళ్ళకు హర్ట్ ప్రాబ్లంలు రావు...

బరువు పెరిగిపోతున్నామని బెంగ పడుతున్నారు  పెరిగిన శరీరాన్ని తగ్గించుకోవడానికి ఫిట్‌నెస్‌ కేంద్రాల్లో నానా పాట్లు పడుతున్నారు. అయినా ‘భారం’గా ఫీలవుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి అన్ని కాలాల కంటే వేసవి ప్రకృతి ఇచ్చిన వరం లాంటిది. మారుతున్న జీవన విధానంలో నోటిని అదుపులో ఉంటుంచుకోలేకపోతున్నారు. కొత్తకొత్త వంటకాలు, సరికొత్త రుచులకు అలవాటు పడి శరీరాన్ని పెంచేసుకుంటున్నారు. ఆ తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో కుస్తీలు పడుతున్నారు. ఇలా అధిక బరువుతో బాధపడే వాళ్లంతా సమ్మర్‌ చిట్కాలతో దాన్ని తగ్గించుకోవచ్చు.

 చన్నీటి స్నానం తర్వాత వ్యాయామం

తక్కువ బరువు ఉండి, చెమటను త్వరగా పీల్చే దుస్తులతో వ్యాయామం చేయడం మంచిది. వేసవిలో వర్క్‌ అవుట్స్‌, కష్టతరమైన యోగాసనాలు, సూర్య నమస్కా రాలు తక్కువ చేయడం ఉత్తమం. బరువు తగ్గాలనుకున్న వారికి స్విమ్మింగ్‌ మంచి వ్యాయామం. ఈత రాని వారికోసం ఆక్వా జుంబా, ఆక్వా యోగ అందుబాటులోకి వచ్చాయి. వర్క్‌అవుట్స్‌ చేయడానికి ముందే చన్నీటి స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగదు. వాకింగ్‌, జాగింగ్‌ వంటివి మినహాయిస్తే, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సూచనలతో వర్క్‌అవుట్లు చేయడం మంచిది.

ఆహారంతోపాటు శీతలి ప్రాణాయామం

వేసవిలో భానుడి ప్రతాపం ఉదయం ఏడు గంటల నుంచే మొదలవుతుంది. కత్తెర్లు మొదలైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎండల తీవ్రతను తట్టుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువ తాగాలి. వీటితోపాటు శీతలి ప్రాణాయామం చేస్తే కొంత వరకు ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందుతుంది. బరువు తగ్గడానికీ ఉపయోగపడుతుంది. నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి, ముక్కు ద్వారా వదిలే ప్రక్రియే శీతలి ప్రాణాయామం. ఉదయం ఏడు గంటలలోపు ఐదు నిమిషాలపాటు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగాసనాల్లో ప్రావీణ్యం ఉన్న వారు సూచిస్తున్నారు.

 మట్టి కుండ నీళ్లతో గొంతు తడుపుకుంటే...

మామూలు రోజుల కంటే, వేసవిలో మనిషి ఆకలిలో ఎక్కువ వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఎంతటి భోజన ప్రియులైనా వేసవి కాలంలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు. వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. దాహం ఎక్కువ, ఆకలి తక్కువగా ఉంటుంది. 15 నుంచి 20 నిమిషాలకు ఒకసారి చొప్పున రోజుకు కనీసం ఏడు లీటర్లు తాగితే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం.

చిరాకును వదలండిలా..

వేసవిలో ప్రతి మనిషిలోనూ చిరాకు ఎక్కువగా కనిపిస్తుంది. చెమటకు, ఉక్కబోతకు చిన్న విషయానికే చిర్రుబుర్రులాడుతుంటారు. ఒక్కోసారి ఆ ప్రభావం ఎదుటి వారిపై చూపిస్తుంటారు. దీన్ని దూరం చేసుకోవడానికి చంద్రభేదన యోగాసనం ఉత్తమ మార్గమని యోగా నిపుణులు చెబుతున్నారు. కుడినాసికా రంధ్రాన్ని పూర్తిగా మూసేసి, ఎడమ నాసికా రంధ్రాన్ని సగం మూసి గాలి పీల్చి, రెండు నాసికా రంధ్రాల నుంచి వదలాలి.

ఈ ఆహారం తీసుకుంటే
 నీటి శాతం ఎక్కువగా ఉంటే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్బూజ, తాటిముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు, లవణాలు అందుతాయి.  నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కడుపు నిండినట్టుంటుంది. డైట్‌ కంట్రోల్‌ అవుతుంది.  శీతల పానియాలు, చక్కర వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే మాత్రం బరువుతగ్గకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆకలి తక్కువ.. దాహమెక్కువ వేసవిలో ఆకలి తక్కువగాను, దాహం ఎక్కువగాను ఉంటుంది. జీర్ణక్రియలోనూ తేడాలు వస్తుంటాయి. డైట్‌ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. బరువు తగ్గించుకోవాలనుకునే వారికి వేసవి... ప్రకృతి ఇచ్చిన అవకాశం.మి నవీన్ నడిమింటి
   9703706660

ఇంకా బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి
అవన్నీ తెలుసుకోవాలనుకుంటే వెబ్ సైట్ ను చూడగల

 యోగ సూర్య నమస్కారాలు: ఇలా చేయాలి, ఫలితాలు ఎన్నో
*Encourage your parents and senior citizens to practise  this ""Chair Suryanamaskara""  12 times daily. This will improve their overall health, reduce joint stiffness,  improve lung capacity, strengthen the knees and muscles, reduce age related issues such as acidity and gas etc. It's very mild but effective in a long run and very much sustainable. It's also practicable and beneficial for people with knee problems and those who find difficult to walk.

యోగాసనములు,ప్రాణాయనము కలిపి చేసేదే సూర్యనమస్కారం అంటారు.అసనాలు వేయడానికి ముందు సూర్యనమస్కారము చేయడం వలన శరీరానికి ఉత్తేజము కలిగి ఇతర అసనాలు వేయడానికి శరీరాన్ని తయారుచేస్తుంది.ఈ ఆసన సమయంలో ప్రాణ వాయువు కూడా ఎక్కువగా అందుతుంది.ఇవి మొత్తం "12" ఆసనాలతో కూడిన ఆవృత్తి. సూర్య నమస్కారాలలో ఒకదాని తర్వత ఒకటి వరుస క్రమంలో చేస్తాము.వీటిని 3 నుండి 12 సార్లు చేయవచ్చును.
యోగాసనాలు ఇలా చేయాలి
1) నమస్కార ముద్ర :-మొదట తూర్పు దిశ వైపు చాపమీద నిలబడి చేతులు రెందు చాతీకెదురుగా నమస్కార ముద్రలో ఉండవలెను.కాళ్ళు రెండు దగ్గరకు చేర్చి ఉంచవలెను.శ్వాస సాధరణంగా ఉంచవలెను.
2) హస్త ఉత్ధనాసనము :- శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకెత్తి కాళ్ళు వంచకుండా వెనకకు వంగవలెను.
3) పాదహస్తాసనము :- శ్వాస వదులుతూ,కాళ్లు వంచకుండా ముందుకు వంగి,చేతులు కాళ్ళు పక్కన నేలకు అనించవలెను.తలను మోకాళ్ళకు ఆనించవలెను.4) అశ్వసంచాలసనము :- శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని వెనకకు చాచవలెను.కుడికాలుకు రెండు పక్కల చేతులు అనించి తలను నేరుగా ఉంచవలెను.
5 ) అశ్వ సంచలనాసనము :-
కుడి కాలు వెనకకు చాచుతూ రెండు కాళ్ళు ఒకచొటకిచేర్చి ఉంచవలెను.శరీరం భూమి మీద అనకుండా తల నుండి కాలు వరకు నిటారుగా ఉండవలెను.శ్వాస పొట్టలోనే అపుకోవాలి.
6) అష్టాంగ నమస్కారం :- శ్వాసను వదులుతూ చేతులు కదపకుండా నెమ్మదిగా శరీరాన్ని చాప మీదకు తీసుకుని వచ్చేటపుడు తల,ఛాతి,మోకాళ్ళు చాపకు తగిలేట్టుగా ఉందవలెను.పిరుదులు పైకెత్తి ఉంచవలెను.అష్టాంగములు (రెండు అరచేతులు,రెండు పాదములు,రెండు మోకాళ్ళు, ఛాతీ,నుదురు) మాత్రమే చాపను తాకవలెను.
7 ) భుజంగాసనము :-శ్వాస తీసుకుంటూ తల,ఛాతిని చాపమీద నుండి పైకి లేపవలెను.పొత్తి కడుపు చాప మీద ఉండవలెను.
8) అర్ధముక్తాసనము

:- శ్వాస నెమ్మదిగా వదులుతూ కాళ్ళు,చేతులు కదిలించకుండా నడుమును పైకెత్తి తలను నేల వైపుగా తీసుకు రావాలి.పాదాలు మాత్రం నేలకు తాకి స్థిరంగా ఉంచవలెను.శరీరాన్ని ఇంగ్లీష్ అక్షరం 'A' ఆకారంలో ఉంచవలెను.

9) అశ్వసంచాలసనము :-
శ్వాసను తీసుకుంటూ చేతులు కదపకుండా కుడి కాలును ముందుకు తీసుకునివచ్చి రెండు చేతుల మధ్యలో నుండి తల పైకెత్తవలెను.
10 పాదహస్తాసనము
:- శ్వాస వదులుతూ ఎడమకాలును కుడి కాలి పక్కన రెండు చేతుల మధ్యన చేర్చవలెను.నుదురు మోకాళ్ళకు తాకించాలి.రెండు చేతులు,రెండుకాళ్ళు నిటారుగా ఉండవలెను.
11) హస్తతానాసనము :- శ్వాస తీసుకుంటూ చేతులు తల పైకెత్తి నిటారుగా నిలబడి వెనుకకు శరీరం సహకరించింత వరకు వంగవలెను.
12) ప్రణామాసనము (నమస్కారముద్ర) :- నిటారుగా నిలబడి రెండు చేతులు ఛాతీకెదురుగా నమస్కారముద్రలో ఉంచవలెను.రెండవ సారి సూర్యనమస్కారం చేసేటప్పుడు కాళ్ళు భంగిమలో ఎడమ కాలుకు బదులు కుడి కాలును ఉపయోగించవలెను. మి నవీన్ నడిమింటి సూర్యనమస్కారాల వలన లాభాలు

* ఈ సంపూర్ణమైన వ్యాయామం వలన శరీర భాగములన్నింటిని పుష్టిగా ఉంచి అనారోగ్యం పోగోట్టును.* కడుపు,జీర్ణాశయము,హృదయము,చిన్నప్రేగులు,కాలేయంములను ధృడపరచును.* వెన్నుపాము,నడుములోని ఎముకలను సడలించును.రక్తప్రసరణను సరిదిద్దుట వలన రక్తములోని మలినములను పోగోట్టును.చర్మవ్యాధులను నయం చేయును.* చేతులు,భుజములు,కాళ్ళు,తోడల కండరములు,మెడ ఎముకలను గట్టిపరచును.* మనశ్శాంతి,మనాసిక ధృడత్వం ఏర్పడును.* డయోబెటిస్ ను నియంత్రించును.* పరిపూర్ణమైన ఆరోగ్యమును సమకూర్చును.
12 ఆసనాలు వేయడం వల్ల
శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి . హార్మోనుల అసమతుల్యాన్ని సవరించడం వీటి వల్ల వచ్చే అదనపు ప్రయోజనం.పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు కావడం, కీళ్ళు వదులవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది.

దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి.అంతే కాక వ్యాధి నిరోధక శక్తి హెచ్చి శరీరం తేలికగాను, తేజోవంతంగాను, శక్తివంతంగాను తయారవుతుంది.దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలినరహితమై శక్తివంతమవుతాయి

రక్త హీనత అంటే ఏమిటి?

మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఇది తయారవడానికి మాంసకృత్తులతో పాటు ఇనుము అనే పోషక పదార్థం ముఖ్యంగా అవసరం. మన శరీరంలో హీమోగ్లోబిన్ పరిమాణం ఒక మోతాదులో (16 mg%) ఉంటుంది. ఉదాహరణకు మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 నుండి 12 సం.ల లోపు పిల్లలో్ల 12 గ్రాములు ఉండాలి. ఒక వేళ హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్త హీనతతో వారు బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. రక్తహీనతకు (అనీమియా) గురైన వ్యక్తి శరీ రంలో ఎర్ర రక్త కణాలు (రెడ్‌బ్లడ్‌సెల్స్‌- ఆర్‌ బిసి- లేదా ఎరిత్రోసైట్స్‌) సంఖ్య తగ్గిపోతుంది. రక్త పరీక్షలో ఆర్‌బిసి కౌంట్‌ ద్వారా రోగి రక్తంలో ఎన్ని ఎర్రరక్తకణాలున్నాయనే విష యాన్ని తెలుసుకోవచ్చు. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య 38 శాతం నుంచి 48 శాతం వరకూ ఉంటుంది. ఆర్‌బిసి లో ఆక్సిజన్‌ను తీసుకునివెళ్లే కణాలను హీమో గ్లోబిన్‌ అంటారు.

ఆరోగ్యవంతుల్లో హీమోగ్లోబిన్‌ ఒక డెసి లీటర్‌కు 12 గ్రాములుంచి 16 గ్రాముల మధ్య ఉంటుంది. ఆర్‌బిసి కౌంట్‌ ఒక మైక్రోలీటర్‌కు 4.4నుంచి 5.8 మిలియన్ల వరకూ ఉంటుంది. ఆర్‌బిసిలోని హీమోగ్లోబిన్‌ ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళుతుంది. ఆక్సిజన్‌ రవాణా వ్యవస్థగా ఎర్ర కణాలు ఉపకరిస్తాయి. ఆక్సిజన్‌ శరీరానికి ఇంధనంగా ఉపయోగపడుతుంది.

రక్తహీనతకు గురైన వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్త కణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ అందదు. రోగి ఎంతో అలసట పొందడం, చివరకు శ్వాస తీసు కోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు తమలో శక్తి పూర్తిగా నశించిపోయినట్లు భావిస్తారు . ఆర్‌బిసి లలో ఉన్న హీమోగ్లోబిన్‌ కణాల నుంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌ అనే వ్యర్థ పదార్థాన్ని సేకరించి, ఊపిరితిత్తులకు అందజేస్తుంది. ఊపిరితిత్తులు ఈ వ్యర్థపదార్థాన్ని విసర్జిస్తాయి.

శరీరంలో ఉండే ఎరిత్రోప్రోటీన్‌ అనే హార్మోన్‌ బోన్‌ మారోను ఉత్తేజపరిచి, ఎర్ర రక్తకణాల సంఖ్యను నియంత్రించేలా చేస్తుంది. శరీరంలో ఉండే దాదాపు మొత్తం ఎరిత్రోప్రోటీన్‌ను మూత్రపిండాలు ఉత్పత్తి చేస్తాయి. అక్కడినుంచి ఎరిత్రోప్రోటీన్‌ బోన్‌మారోకు చేరుతుంది. ఇక్కడే ఎర్ర రక్తకణాలు తయారవుతాయి. ఒక వ్యక్తి మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు మూత్రపిండాలు అవసరమైన స్థాయిలో ఎరిత్రోప్రోటీన్‌ను ఉత్పత్తి చేయలేవు. ఎరిత్రోప్రోటీన్‌ లేకుండా, బోన్‌మారో తగి నంత సంఖ్యలో ఎర్ర రక్తకణాలను తయారు చేయలేవు. ఫలితంగా శరీరావసరాలకు సరిపో యేంత ఆక్సిజన్‌ అందదు.మూత్రపిండాలు విషపదార్థాలను, ద్రవాలను శరీరంనుంచి తొలగిస్తాయి. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారిలో ఈ పని డయాలిసిస్‌ ద్వారా కొంత జరుగుతుంది.కాని, ఎరిత్రోప్రోటీన్‌ను తయారు చేయడం మాత్రం మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు సంభవం కాదు.

కారణాలు : స్త్రీలలో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనత – రక్తం తక్కువగా ఉండడం ఇది ముఖ్యంగా మూడు కారణాల వలన వచ్చును.
1.పౌష్టికాహార లోపం – ఐరన్ (ఇనుము ధాతువు) కలిగిన ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోను ఎక్కువ నిలువలుండును. ఇవి గలిగిన ఆహారం సమతుల్యంతో తీసుకోకపోవడం.
2.రక్తం నష్టపోవడం – స్త్రీలు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో పొట్టపురుగులు ద్వారా, క్రమేపి రక్తాన్ని కోల్పోయి, రక్తహీనతకి గురి అవుతారు.
3.రక్తం తయారీలో అవరోధం – జబ్బుల వలన ఉదా. మలేరియా, రక్తంలోని ఎర్ర కణాలు ధ్వంసం అయి మరల పెరగవు...దీంతో రక్తం తయారవక రక్తహీనత కనపడుతుంది.

లక్షణాలు :
బలహీనం, నిరాశక్తత, సాధారణ పనులకే ఆయాసం రావడం.
1) నాలుక, కనురెప్పలలోపలి భాగాలు పాలిపోవడం,
2) అలసట,
3) చికాకు,
4) ఆకలి లేకపోవడం,
5) మైకం, కళ్ళు తిరగడం,
6) అరచేతుల్లో చెమట,
7) చేతుల గోళ్ళు వంగి గుంటలు పడడం
8) పాదాలలో నీరు చేరడం,
9) చిన్న పిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం.

రక్త హీనత ఎవరిలో ఎక్కువగా కనబడుతుంద?

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 15-45 సం.వయస్సు గల స్త్రీలు, 11 సం.ల లోపు పిల్లలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. అయితే మగవారిలో కూడా రక్తహీనత చోటుచేసుకోవడం అసాధారణం కాదు.

రక్త హీనత వల్ల కలిగే దుష్పరిణామాలు
బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గుదల, రోగాలు తేలికగా వెంటవెంటనే రావడం, చదువులో వెనుకపడడం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం మైదలైనవి.

రక్త హీనతను నివారించడం ఎలా

చికిత్సా విధానం : చిన్న పిల్లలకి పొట్టపురుగుల మందు ఇవ్వాలి. మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో తోముకునేలా అలవాటు చేయించాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం (ఆకుకూరలు, పొట్టుతోటి ధాన్యాలు, మాంసాహారం) తీసుకునేట్లు చేయాలి. యుక్త వయస్సు నుండి సంతానం పొందు వయసు మధ్యలో గల స్త్రీలందరికి ఎ.ఎన్.ఎం. సహాయంతో ఉచితంగా లభ్యం అయ్యే ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి.

రక్త హీనతను నివారించడానికి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒక ప్రజారోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. రక్త హీనతకు తేలికగా గురికాగల గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఉపకేంద్రం ద్వారా ఇనుమున్న ఎర్రగోలీలు (ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు) ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఈ గోలీలను గర్భిణీ స్త్రీలయితే 6వ నెల మొదటి నుండి 100 రోజుల పాటు, బాలింతలు చనుబాలు యిస్తున్నంత కాలం లేదా 100 రోజుల పాటు, 11 సం. వయస్సులోపున్న రక్త హీనతగల పిల్లలు సంవత్సరంలో కనీసం 100 రోజులపాటు క్రమం తప్పకుండా రోజుకొక్కగోలీ చొప్పున తీసుకోవడం వల్ల వారి శరీరానికి పూర్తి రక్తపుష్టి చేకూరుతుంది.
ఈ మాత్రలు తీసుకొనేవారి మలం నల్లబడడం, వికారం కల్గడం సహజం. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు.

ఆకుకూరలు రక్త హీనత నివారణకు సులభమైన ఉపాయం --- ఇనుము ఎక్కువగా వుండి, సులభంగా లభించి, చవకగా అందరికీ అందుబాటులో ఉండే అన్ని రకాల తాజా ఆకుకూరలు అంటే తోటకూర, పుంటికూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర, గంగబాయిల కూర రోజు తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. ఇవేగాక ఖరీదైన ఎండినపండ్లు, అంటే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూర్, మాంసం, కాలేయం వంటి పదార్థాల్లో కూడా యినుము పుష్కలంగా లభిస్తుంది. వీటితోపాటు, రోజూ తీసుకొనే ఆహారంలో మొలకెత్తిన పప్పుధాన్యాలు విటమిన్ సి ఎక్కువగా వుండి నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం ద్వారా రక్త హీనత రాకుండా చూసుకోవచ్చు.

రక్త హీనత నివారణకు నూతన పద్ధతి:
దేశ ప్రజలలో అధికశాతం రక్తహీనతకు గురి అవుతున్నారు. కాబట్టి రక్తహీనత నివారణకు మనం మామూలుగా తీసుకొనే ఉప్పులో ఇనుమును కలిపే శాస్త్రీయ పద్ధతిని జాతీయ పోషకాహార సంస్థ వారు కనుగొన్నారు. మామూలు ఉప్పు బదులుగా క్రొత్తగా తయారుచేసిన ఇనుము కలిపిన ఉప్పును రోజూ వంటలో వాడడం ద్వారా ఇనుము లోపం వలన వచ్చే రక్త హీనతను నివారించవచ్చును. ఈ ఇనుము కలిపిన ఉప్పు ప్రస్తుతం కొన్ని పట్టణ ప్రాంతాల్లో లభ్యం అవుతోంది.

రక్త హీనతను అశ్రద్ధ చేయకండి. అది నీరసానికి బలహీనతకు మాత్రమే దారితీయదు. ప్రాణాహానిని కూడా కల్గించవచ్చు. రక్తహీనతను దరిచేరనీయకండి. ఇనుము పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు రోజూ తీసుకోండి. రక్తహీనత ఉన్నవారు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వందరోజులు తీసుకోండి. మీ గ్రామ ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందిని గాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాని, ప్రభుత్వ ఆసుపత్రిలోగాని సంప్రదించి దీనిని నివారించే పద్ధతుల వివరాలను విపులంగా తెలుసుకొని పాటించండి.

మంచి ఆహారంతో ఎనీమియాకు దూరం...
--ప్రస్తుతం మహిళలను వేధిస్తోన్న సమస్య ఎనీమియా (రక్తహీనత). లేచింది మొదలు గొడ్డు చాకిరీ చేసే మహిళలకు రోజంతా... పనితోనే సరిపోతుంటే ఇక తినేందుకు సమయమెక్కడ ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా ఆ... ఏం తింటాలే... అని ఊరుకునే మహిళలు ఎంతమందో..! దీని ఫలితమే రక్తహీనత.

విటమిన్ బి12 తప్పనిసరి..!

తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ.... ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది...

అంతేగాకుండా వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోవడం వల్ల, రుతుసమయంలో అధిక రక్తస్రావం వల్ల, ఫైల్స్ సమస్య వల్ల కూడా రక్తహీనత వస్తుంది. దీనివల్ల రక్తంలో ఎర్రకణాల సంఖ్య తగ్గిపోయి శారీరక బలహీనత ఏర్పడుతుంది. దీని కారణంగా ఒంట్లో నీరసంగా ఉండటం, కళ్ళు తిరగటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తలనొప్పి తదితర సమస్యలు కలుగుతాయి.

మరి దీనికి పరిష్కారమే లేదా..? అంటే ఉందని చెప్పాలి. అదేంటంటే... మందులకన్నా... ప్రతిరోజూ వీరు తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా లభించే వాటినే తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా కాయగూరలు, పండ్లలో ఉంటుంది.

రక్తహీనత బారినపడొద్దు-ముందే జాగ్రత్త పడటం :
--మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్న స్త్రీలు, పిల్లలు ఎంతోమంది. దీని బారినపడ్డవారి రక్తంలో ఎర్రకణాలు తగ్గిపోతాయి. దీంతో శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్‌ సరిగా అందదు. రక్తహీనత తీవ్రతను బట్టి.. నిస్సత్తువ, పనులు చేస్తున్నప్పుడు శ్వాస కష్టంగా ఉండటం, మగతగా అనిపించటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి తగ్గటం, గుండె సరిగా కొట్టుకోకపోవటం వంటివీ ఉండొచ్చు. కాబట్టి రక్తహీనత బారిన పడకుండా ముందే జాగ్రత్త పడటం ఎంతో ఉత్తమం. అందుకు ఆహరంలో తగు మార్పులు చేసుకుంటే సరి.

* ఇనుముతో నిండిన యాపిళ్లు, అరటిపండ్లు, ఆకుకూరల వంటివి ఎక్కువగా తినాలి. మాంసం, ముడిధాన్యాలు కూడా మంచివే.

* సి విటమిన్‌ ఇనుమును ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. అందువల్ల బత్తాయి, నిమ్మ, ఉసిరి వంటి సి విటమిన్‌ గల పదార్థాలు, పానీయాలు కూడా అధికంగా తీసుకోవాలి.

* భోజనం చేసిన వెంటనే కాఫీ, టీలు తాగటం మానెయ్యాలి. ఇవి ఇనుమును గ్రహించుకోకుండా అడ్డుకుంటాయి. ఫోలిక్‌యాసిడ్‌, విటమిన్‌ బి12తో నిండిన పాలకూర వంటి ఆకుకూరలు, కాలేయం, ముడిధాన్యాలు తగినంత మోతాదులో ఉండేలా చూసుకోవాలి. కిస్‌మిస్‌ వంటి ఎండు ఫలాల్లోనూ ఇనుము ఎక్కువగా ఉంటుంది. 

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...