Friday, July 30, 2021

ఐదు ప్రాణములు

 శ్వాస రూపంలో మనం తీసుకున్న  వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి--

1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.


1.ప్రాణము:-  అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.

2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయువు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.

3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు.  ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.

4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.

5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

అంతర్నేత్రం

అన్ని పనులూ అయిపోయాక, కొన్ని క్షణాలు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవటం సాధారణంగా మనలో చాలామందికి అలవాటు ఉండదు. చక్కగా కళ్లు మూసుకుని కూర్చోవడం ఒక కళ. ఆ కళను అభ్యసించాలి.

ఈ గందరగోళ జీవితంలో ప్రశాంతంగా కూర్చోవడం సాధ్యపడటంలేదు. నిర్మలమైన ఆకాశాన్ని చూడటం మరిచిపోయాం. నిశ్చలమైన మనసును అనుభూతి చెందటం మనకు తెలియటం లేదు.


కళ్లు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం మనల్ని వదలిపోదు. బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి అంతరంగ ప్రపంచంలోకి ప్రవేశిస్తాం. లోపల ఎన్నో అద్భుతాలు. ఓ చిన్న కనురెప్ప రెండు ప్రపంచాలను వేరుచేస్తూ, కలుపుతూ ఉంటుంది.


కళ్లు మూసుకుని లోపలికి వెళుతున్న కొలది, కళ్లు తెరుచుకుని చూస్తున్నప్పుడు కనిపించేదంతా ఓ కలగా, మాయగా చివరికి శూన్యంగా మారిపోతుంది. అక్కడ గొప్ప ప్రశాంతత ఉంటుంది.


ఒక గురువు కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నాడు. అతణ్ని ఓ వ్యక్తి సమీపించి 'మీరు చేస్తున్నది ఏమిటి?' అని అడిగాడు.


'లోపల చూస్తున్నాను' అని ఆ గురువు చెప్పాడు. ఆ వ్యక్తి గందరగోళంలో పడిపోయాడు.


'కళ్లు మూసుకుని చూస్తున్నారా?' ఆశ్చర్యపోతూ అడిగాడు.


'అవును... అదే నిజమైన చూపు'


కళ్లు తెరుచుకున్నప్పుడు అవి అనంతంలోకి చేరుకోగలవు. కాని అవే కళ్లు మూసుకుని లోపలికి చూసినప్పుడు అనంతత్వపు ద్వారాలు తెరుచుకుంటాయి. అక్కడ మన స్వస్వరూపం కనిపిస్తుంది. అప్పుడే విశ్వరూపం బయటపడుతుంది.


కనిపిస్తున్న దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని అనుకుంటారు. ఆ దృశ్యాన్ని ప్రదర్శిస్తున్నవాణ్ని చూడాలని అనుకోరు. ఈ అందాలకు, ఆనందాలకు, అనుభూతులకు కారణం... లోపల ఉంది.


రబియా అనే ఒక యోగిని ఉండేది. ఓ సుందరమైన ప్రభాతవేళలో ఎవరో 'రబియా! కుటీరంలో ఏం చేస్తున్నావు? బయటికి రా, ఇక్కడికొచ్చి చూడు. ఎంత అందమైన ఉదయాన్ని సృష్టించాడో దేవుడు!' అన్నారు.


కుటీరం లోపలి నుంచి రబియా ఇలా అంది. 'నీకు బయట కనిపిస్తున్న ఆ సుందర ఉదయాన్ని సృష్టించిన వాణ్ని నేను ఇక్కడినుంచే చూస్తున్నాను. ఓ మిత్రుడా! నువ్వే లోపలికొస్తే మంచిది. బయట ఉన్న ఏ అందమూ అందం అనిపించుకోదు- ఇక్కడున్న అందం ముందు!'


దర్శింపజేస్తున్నవాణ్ని దర్శించాలి!


కాని, కళ్లు మూసుకునే ఉంటాం. లోపల ఉండం. ఎప్పుడూ బయటే ఉంటాం. మూసుకున్నంత మాత్రాన కళ్లు మూతపడతాయా? కళ్లు మూసుకున్నా బయట దృశ్యాలు వేదిక మీద ప్రదర్శించే దృశ్యాల్లా అలా వెంటాడుతూనే ఉంటాయి...


కనురెప్పలు మూతపడటం- కళ్లు మూసుకోవడం కాదు. కళ్లు మూసుకోవడం అంటే లోపలికి దిగి వస్తున్న కలల నుంచి, ఆలోచనల నుంచి స్వేచ్ఛను పొందడం.


కళ్లు మూసుకోవడం అంటే- దృశ్యాలన్నీ మాయమైపోయి అంతరంగంలో నిశ్చలంగా ఉండిపోవడం. కళ్లు మూసుకోవడం అంటే, నిశ్చలానందాన్ని అనుభవించడం. కళ్లు మూసుకోవడం అంటే, దివ్య చైతన్యాన్ని నీ ముందర సాక్షాత్కరింపజేసుకోవడం. అదే సత్యం. అదే బ్రహ్మానంద పారవశ్యం. అదే జగత్తును ఆడిస్తున్న క్రీడ. అదే శివం. అదే సుందరం.

Wednesday, July 28, 2021

గాయత్రీ మంత్రం

 గాయత్రీమంత్రంచాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. 


కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.


నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.


గాయత్రీ మంత్రము అంటే…


“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, 

భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”


ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…


ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్


ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.


ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.


గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.


1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.


2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.


3. పురాణ కధనం ప్రకారం 24మంది  

మహా ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. అశోకునిధర్మచక్రం లో వున్న 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.


4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.


5. 24 కేశవ నామాలు


6. 24 తత్వాలు : 

*ఐదు జ్ఞానేన్ద్రియాలు, 

*5 కర్మేంద్రియాలు, 

*పంచ తన్మాత్రలు, 

*5 మహాద్భుతాలు, 

*బుద్ధి, *ప్రకృతి, *అహంకారం, *మనస్సు


7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”


8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.


9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు.


10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.


11. మన వెన్నుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.


“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతాః పర దైవతం” అన్నారు పెద్దలు . 


24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. 


సకల దేవతా స్వరూపం గాయత్రీ. 

రామాయణ సారం గాయత్రీ . 

కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ.

సకలకోర్కెలు ఈడేర్చే మహామంత్రం గాయత్రీ 

24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. 


అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.

పూజా నియమాలను

1. పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.

2. నేతిదీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.

3. ఎడమచేతితో ఉద్ధరణె నీళ్ళు తీసుకుని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి.

4. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మిసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.

5. గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. అయితే గంటను, శంఖాన్ని, తమలపాకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచరాదు.

6. పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు.

7. పూజులో వీలైనంతవరకు ఎడమచేతిని ఉపయోగించకపోవడం మంచిది.

8. తూర్పు - ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది.

9. పూజలకు, జపానికి వినియోగించే ఆసనం - అనుష్ఠాన అనంతరం ఎవరికి వారే తీయాలి - ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు.

10. జపం చేసేటప్పుడు మాలమధ్యలో ఆపకూడదు. మాట్లాడడం, సైగలు చేయడం కూడనివి.

11. నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపుల కొనలకు పసుపుపెట్టి ఇవ్వాలి.

12. అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నేలపై నీటితో తుడిచి, ముగ్గుపెట్టి అన్న పాత్రను ఉంచాలి.

13. వట్టి నేలపై కూర్చొని జపించరాదు, పూజించరాదు, భుజించరాదు.

14. ''పూజ'' అంటే ''భోగములను ప్రసాదించునది (కలిగించునది)'' అని అర్ధం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతాశక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు.

15. మనం పలికే స్తోత్రశబ్దాలు, దీప ధూపాలు, కుసుమాలు దేవతలకు ప్రీతికరాలు. శుచిప్రియులు దేవతలు. అందుకే శుచి, శుభ్రత పూజాజప ప్రాంతాలలో ఉండాలి.

16. బహిష్టులు స్త్రీలు మసలేచోట వారి దృష్టి పడేచోట దేవతాపూజ, అనుష్ఠానం, దీపారాధన జరుగరాదు. మనకు తెలియని సూక్ష్మజగత్తులో, ఆ స్థితిలో చాలా దుష్ప్రకంపనలు జరుగుతాయి. ఈ నియమాలు వేదాలలో కూడా చెప్పబడ్డాయి.

మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు

పెద్దల అనుభవాల తో ఆచరించి చెప్పిన సామెతలు మీకోసం, మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు:

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక  

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రము

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు

తుకారాం ... పాండురంగడి భక్తుడు

 తుకారాం ... పాండురంగడి భక్తుడు ... మహారాష్ట్రలోని దేహో గ్రామ నివాసి. 


 పాండురంగడిని సేవించడమే తన జీవితానికి పరమార్థంగా భావించాడు. పాండురంగడి ఆదేశం మేరకు అనేక 'అభంగాలు' రచించి వాటిని ఆ స్వామికే అంకితం చేసిన పరమభక్త శిఖామణి. తనకున్న కొద్దిపాటి ఆస్తి పాస్తులను పాండురంగడి సేవకే ధారపోసిన తుకారాం, మానవసేవే మాధవ సేవగా భావించి భక్తి మార్గాన రాగ పరిమళాలు వెదజల్లాడు.


ఒక వైపున భార్యా బిడ్డలు ఆకలితో అలమటించి పోతున్నా, పాండురంగడి గురించి మాత్రమే ఆలోచించిన అనితర సాధ్యమైన భక్తి ప్రపత్తులు ఆయనలో కనిపిస్తాయి.


 పాండురంగడు ప్రసాదించినది మినహా వేరెవరు ఏది ఇచ్చినా స్వీకరించనంటూ, శివాజీ మహారాజు పంపిన కానుకలను సైతం తిప్పి పంపిన మహనీయుడు ఆయన.


 తనను అన్ని విధాలుగా పరీక్షించిన పాండురంగడిని, ఒకానొక సమయంలో తుకారాం నిరసించాడు. అలాంటి పరిస్థితుల్లోనే తుకారాంకి పాండురంగడు దర్శనమిచ్చాడు.


తుకారాం జీవితంలో దైవ లీలలకు సంబంధించిన ఎన్నో అపూర్వమైన ఘట్టాలు చోటుచేసుకున్నాయి



తుకారాంకి పాండురంగడి ధ్యాస తప్ప మరో ఆలోచన వుండేది కాదు. ఆ స్వామిపై అనేక అభంగాలను రచిస్తూ వాటిని పాడుకుంటూ పరవశించిపోయేవాడు. తనకి మంచి జరిగినా ... చెడు జరిగినా ఆ పాండురంగడి అనుగ్రహంగానే భావిస్తూ నిరంతరం ఆయన సేవలోనే కాలం గడిపేవాడు. అలాంటి తుకారాంకి ఒకసారి ఒక పరీక్ష ఎదురైంది.


తుకారాం పాండురంగడిపై అభంగాలను రాసి పాడుతుండటం ... అవి వింటూ ప్రజలు మైమరచి పోతుండటం, అగ్రవర్ణానికి చెందిన రామేశ్వరభట్టుకి అసూయ కలిగించింది. గ్రామ ప్రజలు తన కంటే తుకారాంనే ఎక్కువగా గౌరవించడాన్ని ఆయన సహించలేకపోయాడు. గ్రామస్తుల సమక్షంలో తుకారాంని దోషిగా నిలబెట్టి, తక్కువ కులంలో పుట్టిన ఆయనకి భగవంతునిపై భజనలు ... కీర్తనలు రాసే అర్హత లేదని చెప్పాడు. ఇక నుంచి ఆ అలవాటు మానుకోవడమే కాకుండా, అంతవరకూ రాసినవి ఇంద్రాణి నదిలో పారేయ్యాలని ఆదేశించాడు.


అది పాండురంగడు తన భక్తికి పెట్టిన పరీక్షగా భావించిన తుకారాం, తాను అభంగాలను రాసిన తాళపత్రాలపై నాపరాతి పలకలు పేర్చి వాటిని గుడ్డలో మూటగట్టి ఇంద్రాణి నదిలో ముంచేశాడు. తనకి ఎంతో ఇష్టమైన అభంగాలను వదిలేసినందుకు బాధతో ... భారమైన మనసుతో ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు నుంచి ఆయన నిద్రాహారాలను మానేశాడు. అలా ఓ 13 రోజులు గడిచిపోయాక తుకారాం ఇంద్రాణి నదిలో ఎక్కడైతే ఆ అభంగాలను ముంచాడో అక్కడే అవి పైకి తేలి గ్రామస్తులకు కనిపించాయి. అవి ప్రవాహానికి కొట్టుకుపోకుండా వుండటం చూసి అంతా ఆశ్చర్య పోయారు.


ఈ విషయం తుకారాంకి తెలియగానే ఆయన నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ తాళ పత్రాలు ఆయనున్న దిశగా కొట్టుకువచ్చి ఆగాయి. ఆ పాండురంగడికి తనపై దయ కలిగిందంటూ ఓ బిడ్డను దగ్గరికి తీసుకున్నట్టుగా ఆయన ఆ తాళపత్రాల మూటను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ దైవలీలను చూసిన వారంతా ఆశ్చర్య చకితులయ్యారు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం రామేశ్వర భట్టుకి తెలిసింది. అంతే ఆయన పరుగు పరుగునా వచ్చి తుకారాం పాదాలపై పడ్డాడు. అతని పట్ల అహంకారంతో వ్యవహరించినందుకు మన్నించమంటూ ప్రాధేయపడ్డాడు

ఈ సంఘటన తరువాత తుకారాం విషయంలో గ్రామస్తుల ప్రవర్తనలో ఎంతో మార్పువచ్చింది. తుకారాం మాత్రం సాధారణమైన వ్యక్తిగా అతి సాధారణమైన జీవితాన్నే గడిపాడు ... ఆ పాండురంగడి సేవలోనే తరించాడు.


విఠలా విఠలా..పాండురంగ విఠలా..జయ  పాండురంగ విఠలా.

Tuesday, July 27, 2021

100 నిత్య సత్యాలు - ధర్మఆచారములు

0.  స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. 


2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 


3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 


4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి


5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.


6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు. 


7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు. 


8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 


9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. 


10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.


11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. 


13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.

 

14. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.

 

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. 


16. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు . 


17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. 


18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. 


19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. 


20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.


21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. 


22. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా, తడి కాళ్ళతో భోజనం చేయరాదు.

 

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. 


24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. 


25. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు


26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. 


27. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. 


28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. 


29. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు. 


30. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.


31. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. 


32. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా మనం స్వర్గానికి పోతాము. 


33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. 


34. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. 


35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.


36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.


37. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.


38. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. 


39. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు. 


40. వికలాంగులను వేళాకోళం చేయరాదు.


41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. 


42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 


43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

 

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.


45. ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి. 


46. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు. 


47. పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామ గారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి. 


48. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.

 

49. ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు. 


50. అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.


51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

 

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు. 


54. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం. 


55. ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక, వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు

56. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు. 


57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. 


58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. 


59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

 

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.


61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు

.

62. ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు. 


63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. 


64. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.


65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు. 


66. పాడయిపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని, చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను. 


67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు. 


68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. 


69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి. 


70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


71. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లైతే తండ్రితో పాటు అందరూ కట్టు బట్టలతో స్నానం చేయాలి. 


72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాక్ భంగం చాలా దోషం.


73. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. 


74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.


75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.


76. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు. 


77. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి. 


78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. 


79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.


80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


81. నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం, కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని వారికి ఆహారం పెట్టాలి. 


82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది. 


83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. 


84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు. 


85. రేపు చేయవలసిన పనిని ఈ రోజు, ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు. 


86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.


87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు. 


88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. 


89. పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే. 


90. ప్రదక్షిణలు చేసేటపుడు, మంత్ర పుష్పం ఇచ్చేటపుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహా పాపాలు.


91. గణపతి గరికపూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు(వినాయక చతుర్థినాడు కుడా తులసిని సమర్పించరాదు.


92. మనుష్యుని పాపం వాడి అన్నం లోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.


93. జపమాల మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు. 


94. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని, లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి. 


95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. 


96. భోజనసమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు. 


97. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు. 


98. శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు. 


99. విశిష్ట వ్యక్తులను, మహాత్ములను అగౌరవపరచి, నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు


100. దేవాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు


చదవండి. పిల్లలతో చదివించండి ఇంతకు మంచిన గొప్ప సంపద పిల్లలికి ఇవ్వలేమేమో

Friday, July 23, 2021

శుక్ర కవచం

 శుక్రః

హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం ।

సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ॥


 శుక్ర కవచం

ధ్యానం

మృణాలకుందేందుపయోజసుప్రభం

పీతాంబరం ప్రసృతమక్షమాలినం ।

సమస్తశాస్త్రార్థవిధిం మహాంతం

ధ్యాయేత్కవిం వాంఛితమర్థసిద్ధయే ॥ 1 ॥


అథ శుక్రకవచం

శిరో మే భార్గవః పాతు భాలం పాతు గ్రహాధిపః ।

నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే మే చందనద్యుతిః ॥ 2 ॥


పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవందితః ।

వచనం చోశనాః పాతు కంఠం శ్రీకంఠభక్తిమాన్ ॥ 3 ॥


భుజౌ తేజోనిధిః పాతు కుక్షిం పాతు మనోవ్రజః ।

నాభిం భృగుసుతః పాతు మధ్యం పాతు మహీప్రియః ॥ 4 ॥


కటిం మే పాతు విశ్వాత్మా ఉరూ మే సురపూజితః ।

జానుం జాడ్యహరః పాతు జంఘే జ్ఞానవతాం వరః ॥ 5 ॥


గుల్ఫౌ గుణనిధిః పాతు పాతు పాదౌ వరాంబరః ।

సర్వాణ్యంగాని మే పాతు స్వర్ణమాలాపరిష్కృతః ॥ 6 ॥


ఫలశ్రుతిః

య ఇదం కవచం దివ్యం పఠతి శ్రద్ధయాన్వితః ।

న తస్య జాయతే పీడా భార్గవస్య ప్రసాదతః ॥ 7 ॥


॥ ఇతి శ్రీబ్రహ్మాండపురాణే శుక్రకవచం సంపూర్ణం ॥

Thursday, July 22, 2021

బృహస్పతి కవచం (గురు కవచం)

 గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 🙏


 గురుః

దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం ।

బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ॥

 

బృహస్పతి కవచం (గురు కవచం)

అస్య శ్రీబృహస్పతి కవచమహా మంత్రస్య, ఈశ్వర ఋషిః,

అనుష్టుప్ ఛందః, బృహస్పతిర్దేవతా,

గం బీజం, శ్రీం శక్తిః, క్లీం కీలకం,

బృహస్పతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ॥


ధ్యానం

అభీష్టఫలదం వందే సర్వజ్ఞం సురపూజితం ।

అక్షమాలాధరం శాంతం ప్రణమామి బృహస్పతిం ॥


అథ బృహస్పతి కవచం

బృహస్పతిః శిరః పాతు లలాటం పాతు మే గురుః ।

కర్ణౌ సురగురుః పాతు నేత్రే మేభీష్టదాయకః ॥ 1 ॥


జిహ్వాం పాతు సురాచార్యః నాసం మే వేదపారగః ।

ముఖం మే పాతు సర్వజ్ఞః కంఠం మే దేవతాగురుః ॥ 2 ॥


భుజా వంగీరసః పాతు కరౌ పాతు శుభప్రదః ।

స్తనౌ మే పాతు వాగీశః కుక్షిం మే శుభలక్షణః ॥ 3 ॥


నాభిం దేవగురుః పాతు మధ్యం పాతు సుఖప్రదః ।

కటిం పాతు జగద్వంద్యః ఊరూ మే పాతు వాక్పతిః ॥ 4 ॥


జానుజంఘే సురాచార్యః పాదౌ విశ్వాత్మకః సదా ।

అన్యాని యాని చాంగాని రక్షేన్మే సర్వతో గురుః ॥ 5 ॥


ఫలశృతిః

ఇత్యేతత్కవచం దివ్యం త్రిసంధ్యం యః పఠేన్నరః ।

సర్వాన్ కామానవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ ॥


॥ ఇతి శ్రీ బృహస్పతి కవచం ॥

నాటి పాతాళ లోకమే నేటి అమెరికా!

 పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారు.


👉 సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు.


👉 ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.)


👉 కాలిఫోర్నియాకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) మరియు 


👉 హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి. 


👉 వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే దీని పురాతన నామం మహాబలి భూమి, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందింది.


👉 ఈ మలిపునగరంకు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం.


👉 బలిచక్రవర్తిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి అధిపతి గా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగు తోంది. 


👉 పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనా లు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము.


👉 రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజింతారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని Lost City of the Monkey God‘ గా వ్యవహరిస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు (Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు 1939 లో వెళ్ళడించారు.)


👉 “సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ" అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురుల కు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు.


👉 భూమినుండి 70000 యోజనాల  దూరంలో పాతాళం ఉన్నది. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పు కున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది.


👉 అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregon లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.


👉  మూల అమెరికాయులు (రెడ్ ఇండియన్లు) విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడు తుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం The light of India లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఉన్నది.


👉 వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలు అవుతుంది. ఇంచు మించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరి పోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు. వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్య వలసిన అవసరం ఉన్నది.


ఒకసారి నడిచే దేవుడు కంచి పరమాచార్య వారు మూల అమెరికా వాసుల మంత్రాలకు, మన మంత్రాల కు ఉన్న సంబంధం వివరిస్తారు. ఒకప్పుడు ఈ లోకాలన్నింటిలో ఒకే ధర్మం విలసిల్లేది. (Sanathana Dharma - World wide Existence)


అక్కడివారి వద్ద తాళం కనబడుతోంది. కేవలం హిందూ ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళంచెవి కూడా ఉన్నాయి అని పరమాచార్యులు అన్నారు.

Wednesday, July 21, 2021

కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? ఫలమేమిటి?

ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి.

 చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. 

*ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో  ఉండిపోవలసిందేనా?* 

లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే  గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు. 

*అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు*

అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది. 

*మొదటిది కర్తృత్వ త్యాగం.* ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము.

*రెండోది ఫలత్యాగం.* ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే. అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.

*మూడోది సంగత్యాగం.* ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. 

*ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలి?* 

ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెప్పు, చాలు. 

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

 పై త్రివిధ త్యాగాలను త్రికరణశుద్ధిగా అవలంబించాలి

*కృష్ణార్పణం*

లలితా సహస్రనామ స్తోత్రం

లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ పఠించే స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. *శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం.

ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉంది. *లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మేధిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది.* స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, విశ్వసిస్తారు. లలిత (క్రీడించునది) ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి అనేక పూజావిధానాలలో ఈ సహస్రనామస్తోత్రం పఠించడం జరుగుతుంది.

స్తోత్ర పరిచయం

బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం *"లలితోపాఖ్యానం"* లో లలితా సహస్రనామ స్తోత్రం ఉంది. ఇందులో *లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను* వర్ణించారు. శ్రీమహావిష్ణువు అవతారమైన *హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడు.* లలితా పురాణంలో భండాసురుని సంహరించడానికి దేవి అవతరించినట్లుగా వర్ణించారు. ఈ గ్రంథాలలో శ్రీపురమును సూచించే శ్రీచక్రం నిర్మాణం వర్ణించబడింది. *ఆదిశంకరులు, భాస్కరాచార్యుడు త్రిశతి, సహస్రనామములకు వ్యాఖ్యానాలు అందించారు.

అగస్త్యమహర్షికి ఉపదేశంలో హయగ్రీవుడు శ్రీలలితాదేవి ఆవాసమైన శ్రీపురాన్ని, పంచదశాక్షరి మంత్రాన్ని, శ్రీయంత్రము, శ్రీవిద్య, శ్రీలలితాంబిక, శ్రీగురుదేవుల ఐక్యతను వివరించాడు. అగస్త్యుడు లలితాసహస్రనామమును ఉపదేశింపమని కోరగా అది గుహ్యమని, అర్హత లేనివారికి ఉపదేశించడం నిషిద్ధమని హయగ్రీవుడు తెలిపాడు. కాని అగస్త్యుడు అర్హత కలిగిన ఋషి గనుక హయగ్రీవుడు అతనికి లలితాసహస్రనామాన్ని ఉపదేశించాడు.

స్తోత్రం ముఖ్య విభాగాలు

అన్ని పెద్ద స్తోత్రాలలాగానే లలితా సహస్రనామస్తోత్రంలో కొన్ని విభాగాలున్నాయి. పూజ, అర్చన లేదా పారాయణ చేసే సందర్భాన్ని బట్టి కొన్ని విధి విధానాలను పాటిస్తారు. సాధారణంగా భక్తులు ముందు శుచిగా స్నానాది కార్యములు ముగించుకొని నిత్య పూజా కార్యక్రమం చేసుకొని లలితా సహస్రనామస్తోత్రమును చదవడం జరుగుతుంటుంది.

పూర్వ పీఠిక

పూర్వ పీఠికలో స్తోత్ర ఆవిర్భావాన్ని గురించి, ఆస్తోత్రం గోప్యనీయత గురించి హయగ్రీవుడు అగస్త్యునికి చెప్పిన వివరణ ఉంది. స్తోత్ర పారాయణ మహాత్మ్యము, అది చదవడంలో పాటించవలసిన నియమాలు వివరింపబడ్డాయి. పూర్వ పీఠికలో తెలుపబడిన కొన్ని ముఖ్యాంశాలు -

ముందుగా హయగ్రీవుడు అగస్త్యునికి శ్రీ లలితాదేవి చరిత్రను, భండాసురుని సంహారము, శ్రీపుర వర్ణన, శ్రీ విద్యా పంచాక్షరీ మంత్ర మహిమలను తెలిపాడు. హోమ విధానాలను చెప్పాడు. *శ్రీచక్రానికి, శ్రీవిద్యకు, శ్రీదేవికి, గురుశిష్యులకు ఉండే అన్యోన్య తాదాత్మ్యాన్ని బోధించాడు.* మంత్రిణి శ్యామలాంబ, దండిని వారాహిదేవి సహస్రనామాలను ఉపదేశించాడు. తనకు లలితా సహస్రనామాలను కూడా ఉపదేశించమని అగస్త్యుడు ప్రార్థించాడు.

లలితాదేవి సహస్రనామాలు రహస్యమయాలనీ, శ్రీదేవియందు శ్రద్ధాభక్తులు కలిగి గురుముఖతః పఞ్చదశాక్షరీ మంత్రోపదేశాన్ని పొందిన శిష్యునకు మాత్రమే గురువు ఈ రహస్యనామాలను ఉపదేశించాలనీ హయగ్రీవుడు తెలిపాడు. *లలితా తంత్రాలలో ఈ సహస్రనామాలే సర్వశ్రేష్టం.* వీనివలన శ్రీలలితాదేవి సులభంగా ప్రసన్న అవుతుంది. *ముందుగా శ్రీచక్రార్చన, పంచదశాక్షరీ జపం చేసి, అనంతరం సహస్రనామ పారాయణ చేయాలి.* జపపూజాదులకు అసమర్ధులైనవారు నామసహస్రపారాయణం మాత్రం చేయవచ్చును. *దేవి ఆజ్ఞానుసారం వశిన్యాది దేవతలు రచించిన ఈ స్తోత్రం పారాయణం చేసేవారికి లలితాదేవి అనుగ్రహం, సకలాభీష్ఠ సిద్ధి కలుగుతాయి.* శ్రీదేవి ఆజ్ఞానుసారం బ్రహ్మవిష్ణుమహేశ్వరాది దేవతలు, మంత్రిణి శ్యామలాంబవంటి శక్తులు కూడా ఈ లలితాసహస్రనామస్తోత్రాన్ని భక్తితో పఠిస్తున్నారు.

పారాయణ భాగం

పూర్వ పీఠిక, ఉత్తర పీఠికలను కొందరు పారాయణంలో భాగంగా చదువవచ్చును కాని సాధారణంగా వాటిని మినహాయించి *"న్యాసం" నుండి "సహస్రనామము"* వరకు పారాయణలో చదువుతారు.

న్యాసం

పారాయణ క్రమంలో ముందుగా న్యాసము చేస్తారు. చేయబోయే జపం ఏమిటి? ఎవరు దీనిని ముందు చెప్పారు? దాని ప్రాశస్త్యత ఏమిటి? అందుకు రక్షణ ఏమిటి? ఎందుకు ఈ జపం చేయబడుతున్నది వంటి విషయాలు న్యాసంలో చెబుతారు.

_అస్య శ్రీలలితాసహస్ర నామస్తోత్రమాలా మంత్రస్య వశిన్యాది వాగ్దేవతావతా_ _ఋషయ:_

_అనుష్టుప్ ఛంద:_

_శ్రీలలితా పరాభట్టారికా మహాత్రిపురసుందరీ దేవతా_

_ఐం - బీజం, క్లీం - శక్తిః, సౌః - కీలకం_

_(శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ మధ్యకూటేతి శక్తి: శక్తికూటేతి కీలకమ్ )_

*_సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్ధే శ్రీలలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్రనామ జపే వినియోగ:_

తరువాత *"అంగన్యాసము",* *"కరన్యాసము"* చెబుతారు.

ధ్యానము, పూజ

న్యాసం తరువాత ధ్యానం పఠిస్తారు. ఏ దేవతనుద్దేశించి ఈ స్తోత్రం పారాయణం చేయబడుతున్నదో ఆ దేవతను ముందుగా ధ్యానించడం సంప్రదాయం - ఈ స్తోత్ర ధ్యానంలో మూడు శ్లోకాలున్నాయి. *"అరుణాం కరుణాంతరంగీమ్ ... ", "ధ్యాయేత్ పద్మాసనస్థాం...", "సకుంకుమ విలేపనామ్..."* అనేవి ఆ మూడు ధ్యాన శ్లోకాలు. వాటిలో మొదటిది క్రింద వ్రాయబడింది.

తరువాత దేవికి *"లమిత్యాది పంచపూజ"* చేస్తారు. గురుధ్యానం కూడా చేస్తారు.

వేయి నామాలు

ఇది శ్రీదేవి వేయి నామములను స్తుతించే ప్రధాన భాగం.

ఉత్తర పీఠిక (ఫలశృతి)

మూడవ అధ్యాయం అయిన *"ఉత్తర పీఠిక"* లో ఫలశృతి చెప్పబడింది. అందులో హయగ్రీవుడు అగస్త్యునికి తెలిపిన కొన్ని విషయాలు:

శ్రీలలితాసహస్రనామములు రహస్యమయములు. అపమృత్యువులను, కాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి. సకల సంపదలనూ కలిగిస్తాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం పఠించాలి. *అన్ని పాపాలను హరించడానికి లలితాదేవియొక్క ఒక్కనామం చాలును.* భక్తుడైనవాడు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ నామపారాయణ చేయాలి. *విద్యలలో శ్రీవిద్య, దేవతలలో శ్రీలలితాదేవి, స్తోత్రాలలో శ్రీలలితా సహస్రనామ స్తోత్రము అసమానములు.* శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన, రహస్యనామపారాయణ అనే భాగ్యాలు అల్పతపస్వులకు లభించవు. భక్తిహీనులకు దీనిని ఉపదేశింపరాదు. ఈ లలితాసహస్రనామస్తోత్రమును తప్పక పఠిస్తే శ్రీదేవి సంతసించి సర్వభోగములను ప్రసాదించును.

అర్ధాలు, రహస్యార్ధాలు

ఉత్తరపీఠికలోను, పూర్వపీఠికలోను చెప్పబడిన విధంగా లలితాసహస్రనామస్తోత్రంలోని వివిధనామాలు రహస్యమయాలు, అనేక నిగూఢార్ధ సంహితములు అని అనేకులు భావిస్తారు. నామాలలో అనేక మంత్రాలు, బీజాక్షరాలు నిక్షిప్తమై యున్నాయని కూడా వారి విశ్వాసం. ముఖ్యంగా శాక్తేయులకు ఇవి చాలా విశిష్ఠమైనవి. ఈ శ్లోకంలోని నామాల అర్ధాలను, భావాలను అనేకులు వ్యాఖ్యానించారు. అంతేగాక వాటిని విషయపరంగా కొన్ని విభాగాలుగా చేసి, ఒక్కొక్క విభాగం ఒక్కొక్క తాత్విక లేదా తాంత్రిక ఆంశానికి చెందినట్లుగా భావిస్తున్నారు.

*సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము* - అనే పంచకృత్యాలకు అనుగుణంగా ఈ శ్లోకాలలోని నామములు కూర్చబడినాయని ఒక వివరణ. అందుకే దేవి *"పంచకృత్యపరాయణ"* అని వర్ణింపబడింది.

*సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ -- 63*

*సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణా -- 64*

అనగా దేవి బ్రహ్మరూపిణియై సృష్టిని, విష్ణు (గోవింద) రూపిణియై స్థితికార్యమును, రుద్రరూపిణియై సంహారమును, ఈశ్వరియై తిరోధానమును, సదాశివమూర్తియై అనుగ్రహమును నిర్వహించుచున్నది. మొదటి శ్లోకంలోని మొదటి మూడునామములు - శ్రీమాత, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి - కూడా సృష్టి, స్థితి, సంహారములను సూచించుచున్నవి. ఆలాగే తరువాతి రెండు నామములు - చిదగ్నికుండ సమ్భూతా, దేవకార్యసముద్యతా - అనునవి తిరోధానమును, అనుగ్రహమును సూచించునని అంటారు.

*"ఉద్యద్భానుసహస్రాభా"* నుండి *"శింజాన మణిమంజీరమండిత శ్రీపదాంబుజా"* వరకు శ్రీదేవి కేశాదిపాద సౌందర్యవర్ణన ఉంది. తరువాత దేవి ఆవాసమైన చింతామణిగృహవర్ణన, ఆపై భండాసురసంహారము, కుండలినీశక్తికి సంబంధించిన నామాలు ఉన్నాయి. ఆ తరువాత అనేక విద్యలు, పూజలు, మంత్రములు నిక్షిప్తమై ఉన్నాయంటారు.

మరికొందరు విశ్లేషకులు *ఈ వెయ్యి నామాలను వందేసి నామములున్న పది విభాగాలుగా చెబుతారు*. ఆ పది విభాగాలలోని మొదటి నామముల క్రమం ఇలా ఉన్నది -

*శ్రీమాతా* - లలితా సహస్ర నామములు- 1-100

*మణిపూరాంతరూఢితా* -  లలితా సహస్ర నామములు- 101-200

*సద్గతిప్రదా* - లలితా సహస్ర నామములు- 201-300

*హ్రీంకారీ* - చూడండి: లలితా సహస్ర నామములు- 301-400

*వివిధాకారా* - చూడండి: లలితా సహస్ర నామములు- 401-500

*గుడాన్నప్రీతమనసా* - చూడండి: లలితా సహస్ర నామములు- 501-600

*దరాందోళిత దీర్ఘాక్షీ* - చూడండి: లలితా సహస్ర నామములు- 601-700

*దేశకాలపరిచ్ఛిన్నా* - చూడండి: లలితా సహస్ర నామములు- 701-800

*పుష్టా* - చూడండి: లలితా సహస్ర నామములు- 801-900

*నాదరూపిణీ* - చూడండి: లలితా సహస్ర నామములు- 901-1000

*శ్రీవిద్య, లలితాసహస్రనామం*

*లలితాసహస్రనామ పారాయణ (మంత్రము), శ్రీచక్ర పూజ (యంత్రము), కుండలినీయోగ సాధన (తంత్రము)*, - అనేవి శ్రీవిద్యోపాసనలో ముఖ్యమైన అంశాలు. *సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మోపాసన* అనే రెండు విధానాలు ఈ విద్యాసాధనలో నిక్షిప్తమై ఉన్నాయి. యోగసాధనలో చెప్పబడే *షట్చక్రాలు (మూలాధార చక్రము, స్వాధిష్ఠాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము) లలితాసహస్రనామంలో* చెప్పబడినాయి. *ఈ చక్రాలను అధిగమించి సహస్రారంలో కొలువైయున్న జగన్మాతృకా స్వరూపాన్ని చేరుకోవడమే కుండలినీయోగసాధనలోని లక్ష్యం.*

వ్యాఖ్యానాలు

లలితా సహస్ర నామానికి అనేకులు వ్యాఖ్యలు వ్రాశారు. వీటిలో భాస్కరాచార్యుడు వ్రాసిన *"సౌభాగ్య భాస్కరము"* మనకు తెలిసినవాటిలో మొదటిది, అనేక ఇతర వ్యాఖ్యానాలకు మాతృక వంటిది. భాస్కరాచార్యుడు కృష్ణాతీరవాసి, ఆంధ్రుడు. కర్ణాటకలో బీజాపూర్ నవాబుకు మంత్రి గంభీరరాయ దీక్షితులు మహాపండితుడు. మహాభారతాన్ని పార్శీ భాషలోనికి అనువదించి "భారతి" అనే బిరుదు పొందాడు. ఇతని భార్య కోనమాంబ. రాచ కార్యంపై ఈ దంపతులు హైదరాబాదుకు వచ్చినపుడు వారికి జన్మించిన బిడ్డ భాస్కరరాయలు. ఇతడు నారాయణపేట వద్ద లోకాపల్లిలో నృసింహయాజి వద్ద విద్యాభ్యాసం చేశాడు. సూరత్‌లోని ప్రకాశానంది శివదత్తశుక్ల వద్ద దీక్షోపదేశం పొందాడు. దేశాటనం చేస్తూ 1750 ప్రాంతంలో కాశీ నగరాన్ని సందర్శించాడు. అక్కడ *"సౌభాగ్య భాస్కరము"* అనబడే లలితాసహస్రనామస్తోత్ర వ్యాఖ్యానం రచించాడు. ఇంకా సేతుబంధము, చండాభాస్కరము, తృచ భాస్కరము, పరివస్యా రహస్యము మొదలైన 43 గ్రంథాలను రచించాడు. ఇతని సిద్ధి శక్తులను గూర్చి, పాండిత్యాన్ని గూర్చి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి.

లలితా సహస్రనామ విశేషాలు

కొన్ని సహస్రనామ స్తోత్రాలలో కొన్ని నామాల పునరుక్తి కనిపిస్తుంది. అలాంటి చోట్ల వ్యాఖ్యాతలు ఆ నామాలకు వేరు వేరు అర్ధాలను తెలిపి పునరుక్తి దోషం లేదని నిరూపించారు. కాని లలితా సహస్రనామ స్తోత్రంలో ఏ నామము పునరుక్తింపబడలేదు.

సంస్కృత శ్లోకాలలో కొన్ని చోట్ల ఛందస్సు సరిపోవడానికి "తు, చ, అపి, హి" వంటి అక్షరాలు, పదాలు వాడడం జరుగుతుంది. కాని లలితా సహస్రనామస్తోత్రంలో అలా ఎక్కడా వాడలేదు.

Old Names of India


 

Thursday, July 15, 2021

వివిధ శరీరాలు - కలలు

మనము, ఈ భౌతిక శరీరంతో పాటు మొత్తం ఏడు శరీరాల సముదాయం.  ఇవి ఒకదాని లోపల మరొకటి ఒదిగి ఉంటాయి.  నిద్రావస్థలో సమగ్ర జ్ఞాన సముపార్జన కోసం వివిధ శరీరాలు చేసే క్రియలే  'కలలు'.  మన దేహంలోని ఏడు శరీరాలు నిద్రావస్థలో కలలు కంటాయి. ఒక శరీరం యొక్క కల ముగిసిన తర్వాతే మరియొక శరీరం కల కంటుంది.


1. స్థూల శరీరం (Physical Body - అన్నమయ కోశం):-  

భౌతిక శరీరము కనే కలలకి చైతన్య స్పృహ ఉంటుంది.  ఇది మనకు సంబంధించింది అని స్పష్టంగా తెలుస్తుంది.

ఉదా:- భౌతిక ప్రపంచానికి సంబంధించిన స్నేహితులు,  సంఘటనలు,  ప్రదేశాలు మొదలైనవి కలలుగా గోచరించడం.


2. కాంతిమయ శరీరం (Etheric Body -  ప్రాణమయ కోశం):-

కాంతిమయ శరీరంతో కనే కలలు సుప్త చైతన్యంలో ఉంటాయి కనుక వెంటనే మర్చిపోతాము. ఇవి మనం బలవంతంగా అణచుకున్న కోరికలకు సంబంధించి ఉంటాయి.  ఈ శరీరంతో మనం ఆ అనుభూతులను ఆస్వాదించవచ్చు.

ఉదా:- పెద్ద ఇళ్లల్లో జీవించడం, నగలు ధరించడం, అందమైన అమ్మాయిలతో రమించడం మొదలైనవి.


3. సూక్ష్మ శరీరం (Astral Body - మనోమయ కోశం):-

ఈ శరీరంతో కనే కలలు ఎంతో గుర్తుపెట్టుకుంటే కానీ గుర్తుండవు. ఈ శరీరం దూరాన్ని అధిగమించగలదు.

ఉదా:- ఏ ప్రదేశానికి కంటే ఆ ప్రదేశానికి అనుకున్న వెంటనే చేరగలగడం.


4. భావన శరీరం (Causal Body -  విజ్ఞానమయ కోశం):-

ఈ శరీరం కనే కలలు పూర్వ జన్మలకు సంబంధించిన సంఘటనలు.  

ఉదాహరణకు ఏదైనా ప్రదేశాన్ని సందర్శించినచో అది అంతకు ముందే చూచినట్లు అనిపించడం.


5. కారణ శరీరం (Spiritual Body - ఆనందమయ కోశం):-

భవిష్యత్తులో జరిగే సంఘటనలు అన్నీ ఈ శరీరం ద్వారా కలలుగా గోచరించును.

ఉదా:- బంధు, మిత్రులలో ఎవరైనా చనిపోబోవుచున్నచో ముందే కలలుగా రావడం.


6. మహాకారణ శరీరం (Cosmic Body -  విశ్వమయ కోశం):-

ఇచ్చట ప్రజ్ఞ ఒక్కటే పని చేస్తుంది.  ఈ శరీరం విశ్వ విరాట్ మూర్తితో తాదాత్మ్యం చెందుతుంది. యావత్ సృష్టిని ఈ శరీరం దర్శిస్తుంది. యోగులు మాత్రమే ఈ దశను గుర్తించగలరు.


7. నిర్వాణమయ శరీరం (Nirvanic Body):-

ఈ దశలో కలలు, కల్పనలు ఉండవు. ఈ సమయం మొత్తం మహా శూన్యమే గోచరించును. శూన్యం అయినా ఈ దశలోనే విశ్వప్రాణశక్తి పూర్ణంగా లభించును.  దీనినే మనం గాఢ నిద్ర అని పిలవవచ్చు.

మనం నిద్రకు ఉపక్రమించినప్పుడు మొదటిగా భౌతికశరీరం యొక్క కలతో మొదలై వరుసగా నిర్వాణ శరీరం వరకు వెళ్ళి, తిరిగి నిర్వాణ శరీరం నుండి చివరగా భౌతిక శరీరం యొక్క కలతోనే నిద్ర ముగియును.

అందువలనే నిద్రను 'మహామాయ' అని పిలుస్తారు.

పంచ గయలు

మన దేశంలో మొత్తం 5 గయలు ఉన్నాయని చెబుతారు. 

1. శిరోగయ : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో “శిరోగయ” గా వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.

2. నాభిగయ : జాజాపూర్, ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను “నాభిగయ” అని అంటారు.

3. పాదగయ : పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని “పాదగయ” అంటారు.

4. మాతృగయ : గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని “మాతృగయ” అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.

5. పితృగయ : బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల “బ్రహ్మకపాలం” అనే ప్రదేశాన్ని “పితృగయ” అంటారు.

Wednesday, July 14, 2021

ఆషాఢమాసం - శ్రీ వారాహి నవరాత్రి

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు. 

అమ్మవారి వైభవం

మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ , గజ , తురగ , సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి.  అందుకే ఆవిడను దండనాథ అన్నారు.

లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహీ దేవి.  లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు.  ఆమెకు ప్రత్యేక రథం ఉంది  దానిపేరు కిరి చక్రం.  ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి , రథసారథి పేరు స్థంభిని దేవి.  ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ , మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు. 


కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||


భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||


భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |


అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ , అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు.  విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.  ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు , శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి , వాడిని సంహరించి , భూదేవిని రక్షిస్తాడు.  స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని , అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది , లేదా పరిష్కరిస్తుంది. 

అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో , అష్ట భుజాలతో , శంఖ , చక్ర , హల(నాగలి), ముసల(రోకలి), పాశ , అంకుశ , వరద , అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది.   ఇది మహావారాహి (బృహద్వారాహి) యొక్క స్వరూపం.  ఇంకా లఘువారాహి , స్వప్నవారాహి , ధూమ్రవారాహి , కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే , ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే , రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.  అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి , సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత. 

పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే , ఉగ్రం వారాహి.   శ్రీ విద్యా గద్యంలో "అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే"  అని లలితను కీర్తిస్తారు.   దేవీ కవచంలో "ఆయూ రక్షతు వారాహి" అన్నట్టు.   ఈ తల్లి ప్రాణ సంరక్షిణి.   ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం.

ప్రకృతి పరంగా చూసినట్లైతే   ఈ సమయంలో వర్షం కురుస్తుంది    రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు.  దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది.

వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు.  కానీ వారాహీ చాలా శాంతస్వరూపిణి.  వెంటనే అనుగ్రహిస్తుంది , కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది , అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం , క్రోధం , లోభం , మోహం , మదం , మాత్సర్యం , అహంకారం , అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు , అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.


1. ఓం శ్రీం హ్రీం క్లీం వరాహై మమ వాక్మే ప్రవేశయా వాకు పాలితాయ ||

మమ మాతా వరాహి మమ దారిద్ర్యం నాశాయ నాశాయ హుం భట ||


2. ఓం శత్రు శంకరి సంకటహరణీ మమ మాత్రే హ్రీం దుం వం సర్వారిష్టం నివారాయ నివారాయ హుం భట్ ||


3. ఓం క్లీం వారాహి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షాయా వర్షాయా స్వాహా ||


4. ఓం శ్రీం పంచమి సర్వసిద్ధి మాతా మమ గృహామి ధనం ధన్యాం సమృద్ధిం దేహి దేహి నమః ||


5. ఓం హ్రీం భయానకరీ అతి భయంకరి ఆశ్చర్యా భయంకరీ సర్వ జన భయంకరీ ||

సర్వ భూత ప్రేత పిశాచ భయంకరీ సర్వ భయం నివారాయ శాంతిర్ పావతు మే సదా ||

సర్వ భూత ప్రేత పిశాచ భయంకరీ సర్వ భయం నివారాయ శాంతిర్ పాదుమే సదా ||


అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి  బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ముఖ్య ప్రాణ రక్షిణి.

హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామములు


☘  పంచమి                   

☘  దండనాథా                                                     

☘  సంకేతా

☘  సమయేశ్వరి

☘  సమయ సంకేతా

☘  వారాహి

☘  పోత్రిణి

☘  వార్తాళి

☘  శివా

☘  ఆజ్ఞా చక్రేశ్వరి

☘  అరిఘ్ని


దేశం సుభిక్షంగా ఉండాలని...మనమంతా చల్లగా ఉండాలని...ధర్మం వైపు మనం నడవాలని...అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం


ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా 

ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ

సర్వం శ్రీవారాహి(దండిని) చారణారవిందార్పణమస్తు ||

గోమాత గొప్పదనం........

ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం. ఫిట్సుకు కూడ ఇది ఉపయోగపడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం.

పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా నెల రోజులలో పుండు నయమైనది. ఆ పుండు ఎముక కనిపించేంత లోతైనది

ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్థులకు దెబ్బలు, పుండ్లు కూడ ఆవు పేడ బూడిద వ్రాసిన త్వరగా తగ్గుతాయి.

ఏవైనా విష క్రిములు కుట్టినప్పుడు, (తేనెటీగ, కందిరీగ మొదలగునవి) ఈ బూడిద వేసిన 1 నిమిషంలో తగ్గుతుంది.

వరదలు, తుఫానులు వచ్చినప్పుడు, ఇతర సమయాలలో నీరు బురదగా వున్నప్పుడు, నీరు కాచి త్రాగుతారు. ఒక బిందెడు నీటిలో ఆవు పిడకల బూడిద 1 స్పూను కలిపిన ఆ నీటిని కాయవలసిన పనిలేదు. ఆ నీరు త్రాగిన వారికి కలరా, తలనొప్పి, జ్వరము, విరేచనములు రావు. కావున వరద సమయాలలో ఆ బూడిదను పంచిన రోగాలు రావు.

ప్రయాణాలు చేసే వారు ఆవు కచ్చికల బూడిదను వెంట తీసుకువెళ్ళి బయట నీరు త్రాగవల్సి వచ్చిన బాటిలు నీటిలో 1 చిటికెడు బూడిద కలిపి వాడిన ఎలాంటి రోగాలు రావు. (అగర వత్తుల భస్మం) సేకరించి వుంచుకోండి. ఆవు పేడతో చేసినవి మాత్రమే.

. ఆవు పేడతో చేసిన అగరు వత్తులు వాడిన ఆ ధూపము ఇల్లంతా వ్యాపించి, ఆ ఇంటి దారిద్య్రము తొలగిపోతుంది.

. ఆవు పిడకల పొడితో పళ్ళపొడి తయారు చేసిన, పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పంటినొప్పి, కదులుట తగ్గుతుంది. పళ్ళు గట్టిపడతాయి.

. ఆవు పేడతో చేసిన పండ్లపొడిని నోటిలో ఉంచి 5 నిమిషముల తర్వాత పండ్లు వేలితో రుద్దాలి. చిగుళ్ళను వేలితో మర్ధన చేయాలి. బ్రష్‌ను వాడవల్సిన పనిలేదు. వ్రేలితో తోమినప్పుడే పళ్ళు బాగా గట్టిపడతాయి.

. ఈ ఆవు పిడకల పొడి క్రిమిసంహారిణి. అందువలన దీనితో చేసిన పండ్లపొడి ప్రపంచంలోనే ఉన్నతమైన శాస్త్రీయమైన పండ్లపొడి. 

. నాలుకను టంగ్‌క్లీనర్‌ను వుపయోగించి శుభ్రం చేస్తాము. అలా కాకుండా రెండు వేళ్ళతో బాగా రుద్దిన, గొంతులోని ప్రాతం కూడా శుభ్రపడుతుంది.

. ఆవు పేడతో చేసిన సబ్బులు వుపయోగించిన చర్మవ్యాధులు రాకుండా, ఒకవేళ వున్నచో తగ్గుటకు, చెమటలు పట్టుట తగ్గుటకు తోడ్పడుతుంది. ఇతర సబ్బులలో కెమికల్స్‌ కలియుటచే చర్మానికి మంచిది కాదు.

. ఆవు పేడ విషనాశకము. విష పదార్థములు తీసుకున్నప్పుడు, ఆవు పేడతో చేసిన బూడిద నీళ్ళలో కలిపి త్రాగిన విషం విరుగుతుంది. నీటిలో బూడిద కలిపి స్నానం చేయించిన విష ప్రభావము తగ్గుతుంది. 

. పాముకాటుకు గురైన వ్యక్తి చనిపోయినట్లు డాక్టరు చెప్పగా, ఒక యోగి అతని శరీరానికి పలుమార్లు పూర్తిగా ఆవు పేడ పట్టించగా, లోనవున్న విషమంతా విరిగి రెండోరోజుకు అతను శ్వాస పీల్చుకోవడం జరిగింది. అందువలన ఆవుపేడ అద్భుతమైన విష నాశని.

. ఆవు పిడకల పొడిని నీళ్ళలో కలిపి స్నానం చేయాలి. ఒంటికి నలుగు పెట్టవచ్చు. పుల్లటి మజ్జిగలో కలిపి తలకు పట్టించండి. పొడిబారిన చర్మం గల వారు పాలలో కలిపి ఫేస్‌ప్యాక్‌గా వాడవచ్చు. చర్మము స్వచ్ఛమై మృదువుగా తయారవుతుంది. 

దెబ్బతగిలి నొప్పి వున్న చోట, ఇతర నొప్పులకు నీటిలో కలిపి పట్టీ వేయించండి. బాగా అలసినచో, లలాట భాగంలో మందముగా ఆ లేపనాన్ని పూసిన 30 నిమిషాల్లో అది ఆరిపోయి తాజాగా తయారవుతారు.

ఆవు మలం కాదు. దానిని గోమయం అంటారు. దానిని పూజల్లో, యజ్ఞాల్లో, వాకిట్లో కళ్ళాపిగాను, పవిత్ర కార్యాలలోను ఉపయోగిస్తాము. అందువలన అది విశిష్టమైనది.

పొలాల్లో ఆవు పేడను ఎరువుగా ఉపయోగించిన ఆహారపదార్థాలు అద్భుతమైన రుచిని కలిగిస్తాయి. పండ్లు మంచి వాసన కలిగి వుంటాయి. పంజాబ్‌లో రసాయనిక ఎరువులు వాడుట వలన అచట ఎక్కువ మంది క్యాన్సర్‌ వ్యాధికి గురైనారు.

ఇవన్ని మీరు నమ్మకపోవచ్చు ఎందుకంటే ఇది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన గోమాతకు సంబంధించినవి కాబట్టి. అదే ఇంగ్లీషు మందులు తగ్గుతాయో లేదో అనే ఆలోచన కూడా మనకి రాదు. మనల్ని ఈ విధంగా మార్చేసింది మన విద్యావిధానం... 

చెప్పడం మాత్రమే మా బాధ్యత. నమ్మడం నమ్మకపోవడం అది మీ వ్యక్తిగతం... 


సర్వేజన సుఖినోభవంతు... 


శ్రీకృష్ణదేవరాయలు గారు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల చరిత్ర!

శ్రీకృష్ణదేవరాయలు మొత్తం ఎనిమిది సార్లు తిరుమల దర్శించుకున్నారు . శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల వివరాలు ఇలా ఉన్నాయి. 

తొలి సందర్శన: శ్రీకృష్ణదేవరాయలు తొలిసారి క్రీ.శ. 1513 ఫిబ్రవరి 10న తిరుమలదేవీ, చిన్నాజీదేవీలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయన నవరత్నకిరీటం, నగలు, ఇతర విలువైన రాళ్లను శ్రీవారికి సమర్పించారు. రాణులు బంగారు పాలగిన్నెలు, వెండి హారతి పళ్లెరాలు  బహూకరించారు.

1513 మే 2: రాయలు ఈ పర్యటన సమయంలో ఎంతో ఉదారంగా కత్తులు, విలువైన రాళ్లతో పొదిగిన ఇతర ఆభరణాలు, వజ్రాలు, ముత్యాలతో కూడిన మూడు కిరీటాలు, కెంపులను ఉత్సవర్లకు సమర్పించారు.

1513 జూన్ 13: తొమ్మిది రకాల విలువైన రాళ్లతో కూడిన తొమ్మిది సెట్ల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం గొడగరనాడు ఉప జిల్లాలోని మూడు గ్రామాలైన చత్రవాది, తూరూరు, కరి కంబుడులను సమర్పించారు.

1514 జూలై 6: ఒడిషా పర్యటన నుంచి వెనక్కి వెళుతూ  రాణులతో కలిసి శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడాయన శ్రీవారి సన్నిధిలో 30 బంగారు వరహాలతో కనకాభిషేకం నిర్వహించారు. విలువైన రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాలను కూడా సమర్పించారు. తలపాకం గ్రామాన్ని శ్రీవారికి అప్పగించారు. తొమ్మిది రకాల వజ్రాలు పొదిగిన నవరత్న ప్రభావళి సెట్‌ను కూడా శ్రీవారికి బహూకరించారు.

1517 జనవరి 2: ఆలయ ప్రాంగణంలో కృష్ణదేవరాయ, తిరుమలదేవి, చిన్నాదేవిల రాగి విగ్రహాలను ప్రతిష్టించారు. 30 వే ల వరహాలను అభయారణ్యం వద్ద ఏ ర్పాట్లకే కేటాయించా రు. తిరుపతిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు 500 వరహాలు ఇచ్చారు.

1518 అక్టోబర్ 16: పెద్ద రాణి తిరుమలదేవితో ఈ దఫా రాయలవారు శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడే పుట్టిన తమ బిడ్డకు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు ఆయన తిరుమల వచ్చారు. ఆ బిడ్డకు 'తిరుమల' అనే నామకరణం చేశారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఎలాంటి లిఖితపూర్వక ఆధారాలు లేవు.

1521 ఫిబ్రవరి 17: శ్రీకృష్ణదేవరాయులు తిరుమలలో జరిపిన  పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన తొమ్మిది రకాల విలువైన రాళ్లతో పొదిగిన పీతాంబరం సెట్‌ను శ్రీవారికి బహూకరించారు. దీంతోపాటు ముత్యాలతో పొదిగిన టోపీ, కెంపులు, 1000 వరహాలు సమర్పించారు. రాణి తిరుమలదేవి నవరత్న హారాన్ని బహూకరించారు. ఇవేగాక శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి బంగారు కిరీటంతో పాటు తొమ్మిది రకాల విలువైన రాళ్లను స్వామివారికి ఇచ్చారు. పలు రకాల విలువైన ఆభరణాలు, వజ్రాలు పొదిగిన వస్తువులనూ సమర్పించారు. అంతే కాకుండా ఎంతో బరువైన బంగారు ఆభరణాలు , 2822 శుద్ధి చేసిన కెంపులు, 160 వైడూర్యాలు, 423 పాత వజ్రాలూ ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి సమర్పించిన వాటిలో పలు కిరీటాలు, నెక్లెస్‌లు, మాణిక్యాలు కూడా ఉన్నాయి.

1524 జనవరి 12: రాయలు చివరి సారిగా తిరుమల సందర్శించారు. ఈ సందర్భంగా రెండు గృహాలను, భూమిని స్వామివారికి సమర్పించారు.

Tuesday, July 13, 2021

దైవదర్శనం తరువాత

మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.

అది ఏమిటంటే..!

"అనాయాసేన మరణం

వినా ధైన్యేన జీవనం

దేహాంతే తవ సాన్నిధ్యం

దేహిమే పరమేశ్వరం."


మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.


దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.


"అనాయాసేన మరణం"

నాకు నొప్పి లేక బాధ కానీ లేని

మరణాన్ని ప్రసాదించు.


"వినా ధైన్యేన జీవనం"

నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,

నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.


"దేహాంతే తవ సాన్నిధ్యం"

మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను

నిన్ను దర్శించుకునే విధంగా దీవించు. 


"దేహిమే పరమేశ్వరం"

ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.


1. అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.


2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.


3.  నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా

ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.


ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.


దీనినే దర్పణ దర్శనం అంటారు, మనస్సనే దర్పణం లో దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ


లోకా సమస్తా  సుఖినో భవంతు..!!


శ్రీ జగన్నాధుడి 56 రకాల మహాప్రసాదాలు

పదాల ఉచ్చారణ అర్థం చేసుకొని చదవగలరు.....

1. సాధ అన్నా(తెలుపు అన్నం) సాధారణ బియ్యం నీరు

 2. కనికా - బియ్యం, నెయ్యి మరియు చక్కెర(పొంగలి లాగా)

 3. దహి పాఖల్ - పెరుగు బియ్యం మరియు నీరు(దద్ధోజనం లాగా)

 4. అడా పాఖల్ - బియ్యం, అల్లం మరియు నీరు

 5. తాలి ఖేచెడి - పప్పు, చక్కెర మరియు నెయ్యితో బియ్యం 

 6.ఆజ్య అన్నం - నెయ్యితో కలిపి వండిన బియ్యం

 7. ఖేచెడి - లెంటిల్‌తో కలిపిన వండిన బియ్యం

 8. మిథా పాఖల్ - బియ్యం, చక్కెర మరియు నీరు

 9. ఒరియా పఖల్ - బియ్యం, నెయ్యి, నిమ్మ మరియు ఉప్పు

 స్వీట్స్

 10. ఖాజా - గోధుమలతో తయారవుతుంది

 11. గజా - గోధుమ, చక్కెర మరియు నెయ్యితో తయారు చేస్తారు

 12. లాడు - గోధుమ, చక్కెర మరియు నెయ్యితో తయారు చేస్తారు

 13. మగజ లాడు

 14. జీరా లాడు

 15. జగన్నాథ్ బల్లవ్ - గోధుమ, చక్కెర మరియు నెయ్యి

 16. ఖురుమా - గోధుమ, చక్కెర మరియు ఉప్పుతో తయారు చేస్తారు

 17. మాతాపులి - నెయ్యి, అల్లం మరియు ఒక రకమైన బీన్స్ ను మందపాటి పేస్ట్ లోకి తయారు చేస్తారు

 18. కాకర - నెయ్యి మరియు గోధుమలతో తయారు చేస్తారు

 19. మారిచి లాడు - గోధుమ మరియు చక్కెరతో తయారవుతుంది

 20. లుని ఖురుమా - గోధుమ, నెయ్యి మరియు ఉప్పుతో తయారు చేస్తారు

 (సునా వేశ సమయంలో బాహుద యాత్రకు తిరిగి రావడం, రసగోల్లను భోగాస్ గా అర్పిస్తారు, కానీ మరే రోజున భోగో కోసం రసగోల్లలను అనుమతించరు)

 కేకులు, పాన్కేక్లు మరియు పట్టీలు

 21. సువార్ పితా - గోధుమ మరియు నెయ్యితో తయారు చేస్తారు

 22. చాడై లాడా - గోధుమ, నెయ్యి మరియు చక్కెరతో తయారు చేస్తారు

 23. జిల్లి - బియ్యం పిండి, నెయ్యి మరియు చక్కెర

 24. కాంతి - బియ్యం పిండి మరియు నెయ్యి

 25. మాండా - గోధుమ మరియు నెయ్యితో తయారు చేస్తారు

 26. అమాలు - గోధుమ, నెయ్యి మరియు చక్కెరతో తయారు చేస్తారు

 27. పూరి - గోధుమ మరియు నెయ్యితో తయారు చేసి, చిన్న సన్నని పాన్ కేక్ లాగా లోతుగా వేయించాలి

 28. లూచి - బియ్యం, పిండి మరియు నెయ్యితో తయారు చేస్తారు

 29. బారా - పెరుగు, నెయ్యి మరియు ఒక రకమైన బీన్స్

 30. దహి బారా - ఒక రకమైన బీన్స్ మరియు పెరుగుతో చేసిన కేక్

 31. అరిసా - బియ్యం పిండి మరియు నెయ్యితో చేసిన ఫ్లాట్ కేక్

 32. త్రిపురి - బియ్యం, పిండి మరియు నెయ్యితో చేసిన మరో ఫ్లాట్ కేక్

 33. రోసపాక్ - గోధుమలతో చేసిన కేక్ మరియు

 పాల సన్నాహాలు

 34. ఖిరి - పాలు, బియ్యంతో చక్కెర

 35. పాపుడి - పాలు క్రీమ్ నుండి మాత్రమే తయారుచేస్తారు

 36. ఖువా - స్వచ్ఛమైన పాలు నుండి తయారుచేయడం చాలా గంటలు నెమ్మదిగా ఉడకబెట్టడం వంటి మృదువైన కస్టర్డ్‌కు

 37. రసబాలి - పాలు, చక్కెర మరియు గోధుమలతో తయారవుతుంది

 38. టాడియా - తాజా జున్ను, చక్కెర మరియు నెయ్యితో తయారు చేస్తారు

 39. ఖేనా ఖాయ్ - తాజా జున్ను, పాలు మరియు చక్కెరతో తయారు చేస్తారు

 40. బాపూడి ఖాజా - పాలు, చక్కెర మరియు నెయ్యి క్రీమ్

 41. ఖువా మండా - పాలు, గోధుమ మరియు నెయ్యితో తయారు చేస్తారు

 42. సరపుల్లి - ఇది తయారుచేయడానికి అత్యంత ప్రసిద్ధ మరియు కష్టతరమైన పాల వంటకం.  ఇది స్వచ్ఛమైన పాలతో గంటలు నెమ్మదిగా ఉడకబెట్టి పెద్ద పిజ్జా ఆకారపు పాన్లో వ్యాపిస్తుంది.

 కూరగాయలతో కూర

 43. డాలీ

 44. బిరి డాలీ

 45. ఉరిడ్ దళ్

 46. ​​ముగదళ్

 47. దలామా - ఒరియా హోమ్‌లో విలక్షణమైన వంటకాల్లో ఇది ఒకటి.  ఇది దహ్ల్ మరియు వెజిటబుల్ కలయిక.  సాధారణంగా వంకాయ, బీన్స్, చిలగడదుంప మరియు టమోటాలు, టమోటాలు ఆలయ సన్నాహాలలో ఉపయోగించబడవు.  కొబ్బరికాయలు మరియు ఎండిన కూరగాయల బోధి అని పిలుస్తారు, ఇది ఒక ముష్ గదిలాగా కనిపిస్తుంది మరియు ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

 48. మౌర్

 49. బేసర్

 50. సాగ్ - ఒక చిటికెడు వంటకం

 51. పొటాల రాస

 52. గోతి బైగనా

 53. ఖాటా

 54. రైతా - పెరుగు మరియు ముల్లంగితో కూడిన వంటకం వంటి పెరుగు.

 55. పిటా

 56. బైగిల్ని

మహాప్రసాదం మానవ బంధాన్ని పటిష్టం చేస్తుంది, కర్మలను పవిత్రం చేస్తుంది.

Monday, July 12, 2021

స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు, జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు?

ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు.

✔️ రెండు జడలు వేసుకోవడం (రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని, పెళ్లికాలేదని అర్ధం. అంటే ఆ అమ్మాయిలో జీవ + ఈశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్ధము).

✔️ ఒక జడ వేసుకోవడం (పెళ్లి అయ్యిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె తన జీవేశ్వరుడినిచేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం).

✔️ ముడి పెట్టుకోవడం (జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానంకూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం).

✔️ అయితే ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టుని మూడు పాయలుగా విడతీసి త్రివేణీసంగమంలాగ కలుపుతూ అల్లీవారు. ఈ మూడు పాయలకు అర్ధాలు:

1. తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం.

2. సత్వ, రజ, తమో గుణాలు,

3. జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అని అర్ధములు.

అమ్మాయిలు వేసుకున్న జడనిబట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది. ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడుచేసుకుంటున్నాం.

జుత్తు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం. ..

బ్రహ్మకమలం


కేదార్‌నాధ్ దేవాలయం సమీపంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన 'బ్రహ్మకమల్ వాటిక'లో మొదటి సీజన్ లో పుష్కలంగా వికసిస్తున్న "బ్రహ్మ కమలం" పుష్పాలు..

ఈ పువ్వు రామాయణంతో పాటు ఇతర గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. 

సంజీవని అందుకున్న తరువాత లక్ష్మణుడు ఈ బ్రహ్మ కమలంతోనే వర్షం కురిపించాడు. 

సీతా మాతకు అమ్మవారిని పూజించను లవకుశలు తెచ్చింది ఈ బ్రహ్మకమలాలనే అని అంటారు.

మన సనాతన హిందూ పురాణాల ప్రకారం మహావిష్ణువు నాభి నుండి వెలువడిన బ్రహ్మ కమలంపై బ్రహ్మదేవుడు ఉద్భవించి అక్కడే కూర్చుని ఉంటాడు. మనం చాలా చిత్రాల్లో ఇది కనపడుతుంది.

సూర్యాస్తమయం తరువాత వికసించే మరియు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వికసించే ఏకైక పువ్వు బ్రహ్మ కమలం.  మరియు దీనిని బద్రీనాథ్ & కేదార్నాథ్ దేవాలయాలలో అందిస్తారు. 

బ్రహ్మ కమలము అనగా శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమల పుష్పము. దీని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని, బ్రహ్మ ఉద్భవించినదే బ్రహ్మకమలము. ఈ బ్రహ్మకమలము ఒక  చిత్రమైన పుష్ప రాజము. ఈ పుష్పములతో భగవతుని పూజించిన ఐహికాముష్మిక  ఫలములన్నీ లభ్యమవుతాయని పెద్దల వాక్కు.

లక్ష్మీ, సరస్వతీ మాతలు ఆశీనులయ్యేది ఈ బ్రహ్మ కమలముమీదే. దేవతలు సాధారణ కమలాలమీద ఆశీనులు కారు కదా!

దేవ లోకాల్లోని బ్రహ్మ కమలాలకు ప్రతీకగా ఈ భూమి మీద హిమాలయాల్లో ఈ బ్రహ్మకమలాలు ఉంటున్నాయట.. 

సుమారు 12 వేల అడుగుల ఎత్తులో వున్న హిమాలయాల్లో సంవత్సరానికి ఒకే ఒక్కమారు ఈ బ్రహ్మకమలం పూస్తుంది. ఈ బ్రహ్మకమలం రాత్రి సమయంలోనే వికశిస్తుంది. ఇది వికసించేప్పుడు చాలా మంచి సువాసన వస్తుంది. హిమాలలయాల్లో సాధకులు, ఋషులు, మహాత్ములు ఈ బ్రహ్మకమలం వికసించటాన్ని చూడటంకోసం ఎంతో ముందుగా అక్కడికి చేరుకుంటారు. అత్యంత అద్భుతమైన ఈ కమలం వికసించటాన్ని చూడాలని రోజుల తరబడి, నెలల తరబడి అక్కడ ఉండి నిరీక్షిస్తారు.

శరదృతువు నుండి వసంత ఋతువు వరకు ఈ మొక్క హిమాలయాల్లోని మంచులో కూరుకుపోయి ఉంటుంది.. చైత్ర మాసం అనగా ఇంచుమించు వేసవి ప్రారంభంకాగానే మంచుకాస్త కాస్త ద్రవీభవిస్తుండగా ఈ మొక్క బయటికి వచ్చి శక్తిని కూడగట్టుకుని పెరుగుతూ శ్రావణ శుద్ధ పూర్ణిమ అర్థరాత్రిన పూర్తిగా వికసిస్తుంది. సాధకులు, మహాఋషులు, సిద్ధ పురుషులైన మహానుభావులు మాత్రామే దీన్ని దర్శించగలరని పెద్దలు చెబుతారు. వారి కోసం మాత్రమే హిమాలయల్లో ఈ అద్భుత మైన బ్రహ్మ కమలం ఇప్పటికీ పుష్పిస్తుంటుందని, ఈ కమల వీక్షణంతో సమస్త పాపములు నశిస్తాయని, ఈ కమలం సూర్యోదయానికి ముందే తిరిగి ముకుళిస్తుంది. కేవలం పూర్ణిమ రోజున అర్ధరాత్రి వికసించి ఉదయానికల్లా ముడుచుకుపోవడం నిజంగా చిత్రమే.

బ్రహ్మ కమలము శాస్త్రీయ నామం Saussurea obvallata. ఇది సన్ ఫ్లవర్ అంటే సూర్యకాంతం [పొద్దుతిరుగుడు] జాతికి చెందిన పూల మొక్క. ఇది హిమాలయ పర్వతాలు మరియూ ఉత్తర ప్రదేశ్, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్, దక్షిణ చైనా దేశాలలో కనబడుతుంది. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పము. ఈ మొక్కను 'కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్’ అంటారు. ఈ మొక్కపై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి. ఇది ఈ మొక్కలోని చిత్రాతి చిత్రమైన విషయం. మందంగా ఉండే ఈ తీగలాంటిమొక్క ఆకు బాగా వృద్ధి చెంది ఆకు బలంగా, మందంగా వచ్చాక ఆకు అడుగుభాగం నుంచి చిన్న మొగ్గ వచ్చి పెరిగి బాగా పెద్దయ్యాక అది రాత్రిపూట వెన్నెల రోజుల్లోనే వికసించి, తెల్లవారేసరికి ముకుళించుకు పోతుంది. ఈ ప్రక్రియను వీక్షించాలంటే మనం రాత్రిపూట ఆ మొక్క వద్ద వేచి చూడాల్సిందే. వికసించేప్పుడు ఈ బ్రహ్మకమలంనుండి వచ్చే సువాసన అంతా ఇంతా కాదు. మన నాశికారంధ్రాలు ఆ వాసనను పీల్చినపుడు మన మనస్సులు ఎంతో ఆనందంగా ఉంటాయి. చాలా మంచి వాసన. ఏ ఇతర పూలకు ఈ వాసన ఉండదనడంలో అతియశయోక్తిలేదు.

ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను కాలు,చేతి వ్రేళ్ళ పక్షవాతానికి, మెదడు సంబంధిత వ్యాధులనివారణకూ వాడతారు. 

మధ్య హిమాలయాల్లో భోటియా తెగవారు తలనొప్పి, మానసిక సమస్యలకు బ్రహ్మకమల విత్తనాల నుండి తీసిన నూనెను తలకు రాచుకుంటారు. మూత్ర సంబంధిత సమస్యలకు బ్రహ్మకమల పువ్వులను మందుగా సేవిస్తారుట. దీనితో కొన్ని రకాల నేత్రసంబంధమైన వ్యాధుల నివారణకూడా ఉందని ఆయుర్వేద వైద్యులు చెప్తారు.

ఈ పుష్పాలుకొన్ని ఊదారంగులో కూడా పూస్తాయంటారు. బద్రీనాథ్ వంటి కొండశిఖరాల్లో ఉండే ఆలయాల్లో ఈ పుష్పాలను నైవేద్యంగా భగవంతునికి నివేదిస్తారు. ఈ పుష్పానికి గుర్తుగా భారత తపాలా శాఖ ఒక పోస్టల్ స్టాంపును కూడా జారీ చేసింది.

సాధారణంగా నేడు మన ఇళ్ళలో లభ్యమయ్యే బ్రహ్మకమలాలు తెల్లని వర్ణంలో మాత్రమే ఉంటాయి. జాగ్రత్తగా పోషించుకుంటే ఇవి ఒక్కో మారు పది పన్నెండు వరకూ పూస్తుంటాయి

Friday, July 9, 2021

వారాహి దేవి

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు. దశమితో గుప్తనవరాత్రులు ముగుస్తాయి. ఈ సందర్భంగా వారాహి అమ్మవారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాము.

వారాహిదేవి సప్తమాతృకలయిన బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండిలలో ఒకరు. ఆమె సప్తమాతృకలలో ఐదవ స్థానంలో వుంది. అందుకని ఆమెను ‘పంచమి’ అని కూడా పిలుస్తారు. ‘మహావారాహి’ అమ్మవారు శ్రీ చక్రం యొక్క పదహారవ(16) ప్రాకారంలో నివాసం ఉంటుంది.

దేవీభాగవతం ప్రకారం రక్తబీజుని సంహరించింది. మార్కండేయపురాణం, వరాహపురాణాలలో కూడా ఈమె ప్రసక్తి కనిపిస్తుంది.

బ్రహ్మాండపురాణం లలితోపాఖ్యానంలో దండనాధ అని పిలవబడే వారాహిదేవి లలితాదేవికి సైన్యాధిపతి (మంత్రిణి శ్యామలాదేవి). వారాహి లలితాదేవి తరఫున పోరాడి, భండాసురిని సోదరుడైన విశుక్రుని వధించింది. వారాహిదేవికి పన్నెండు నామాలున్నాయి. ఆమె యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆకాశమున వున్న దేవతులు విమానములపై వుండి వీక్షిస్తూ ఆమెను పన్నెండు నామాలతో కీర్తిస్తూ నమస్కరిస్తారు. హయగ్రీవుడు దేవియొక్క పన్నెండు నామాలను తెలియజేస్తూ వానిని వినినంతమాత్రాన ఆదేవి ప్రసన్నురాలగునని అగస్త్యునితో అన్నాడు. ఆ పన్నెండు నామాలు 1.పంచమి, 2.దండనాధ, 3. సంకేత, 4. సమయేశ్వరి, 5. సమయసంకేత, 6. వారాహి, 7. పోత్రిణి, 8. వార్తాలీ, 9. మహాసేన, 10. ఆజ్ఞా, 11. చక్రేశ్వరీ, 12. అరిఘ్నీ.

వారాహిమాత శంఖం, చక్రం, నాగలి, రోకలి అభయ వరద హస్తాలతో దర్శనమిస్తుంది. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలిగిపోతాయి, శత్రుభయం వుండదు, జ్ఞానం సిద్ధిస్తుంది. వారాహిదేవి మూల మంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి.

లలిత సహస్రనామాలలో రెండు నామాలకు అర్ధం:

‘కిరిచక్ర రథారూఢ డండనాథా పురస్కృతాయైనమః’- కిరి అంటే వరాహం. వరాహాలు వాహనాలుగా కట్టిన రథానికి కిరిచక్రమని పేరు. అట్టి రథాన్ని అధిరోహించిన దండనాయికయైన వారాహిచే సేవించబడుతూన్న లలితాంబికా నమస్కారములు అని అర్ధము.

‘విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితాయైనమః’- విశుక్రుడు అనే రాక్షసుడుని అంతంచేసిన వారాహిశక్తిని తిలకించి ఆనందిస్తున్న శ్రీమాతకు వందనాలు అని అర్ధం.

ఆషాఢ మాసంలో శుభకార్యాలను ఎందుకు ఆపేస్తారో తెలుసా...

ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇది నాలుగో నెల. హిందువులకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది.

ఈ ఆషాడంలో ఎన్నో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. కానీ శుభకార్యాలు మాత్రం వాయిదా వేస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడం వంటివి మంచిది కాదని భావిస్తారు. అంతేకాదు ఈ కాలంలో అత్తా కోడలు, భార్య భర్తలు, అత్తా అల్లుళ్లను దూరంగా ఉండాలంటారు.

మరికొందరు ఆషాఢ మాసాన్ని అపవిత్ర మాసంగా భావిస్తారు. ఈ సందర్భంగా ఆషాఢ మాసంలో ఎందుకని శుభకార్యాలు, పెళ్లిళ్లను నిషేధించారు.. వాటి వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పవిత్రమైన మాసం..

ఆషాఢ మాసంలో మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెలంగాణలో బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. ఒడిశాలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇతరచోట్ల కూడా రథయాత్రలు, పల్లకి సేవలకు ఈ మాసాన్ని శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ నెలలో దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి.

తీరిక లేని పూజారులు.. 

ఈ మాసంలో పండితులు, పూజాలు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిమగ్నమైపోతారు. దీంతో వారికి తీరిక అనేది ఉండదు. ఈ కారణంగా వారికి వివాహ తంతు నిర్వహించడానికి సమయం దొరకదు. ఈ కారణం వల్ల కూడా ఆషాఢ మాసంలో పెళ్లిళ్లను నిర్వహించరు.

విష్ణువు నిద్రలోకి.. 

ఉత్తరాయణ, దక్షిణాయన కథల ప్రకారం.. ఆషాఢ మాసంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని, దీని వల్ల ఈ సమయంలో పెళ్లి చేసుకున్న కొత్త దంపతులకు ఆ దేవుని ఆశీర్వాదం లభించందని నమ్ముతారు.

వర్ష రుతువు.. 

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం జూన్, జులై మధ్యలో వస్తుంది. ఈ సమయంలోనే వర్ష రుతువు ప్రారంభమవుతుంది. రుతుపవనాలు చురుగ్గా కదలడం వల్ల ఈ కాలంలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఈదురుగాలులు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో పెళ్లిళ్లు పెట్టుకుంటే పందిళ్లు ఆ గాలికి ఎగిరిపోతాయని,  పెళ్లికొచ్చిన వారు ఇబ్బంది పడతారనే కారణంతో ఈ సమయంలో శుభకార్యాలు, శంకుస్థాపన వంటి వాటిని వాయిదా వేస్తారు.

ఆదాయం తక్కువ.. 

మన దక్షిణ భారతదేశంలో ఆషాఢ మాసం సమయంలో ఎలాంటి పంట చేతికి రావడం అనేది జరగదు. అందుకే ఈ టైమ్ లో పెళ్లి చేయడానికి సరైన ఆదాయం ఉండదని.. అందుకే సంప్రదాయం పేరిట ఈ సమయంలో పెళ్లిళ్లు చేయకూడదనే నిబంధనలు తీసుకొచ్చారని పెద్దలు చెబుతుంటారు.

గోరింటాకు ప్రత్యేకత.. 

ఆషాఢ మాసంలో మరో ప్రత్యేకత ఏంటంటే.. గోరింటాకు పెట్టుకోవడం.. ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆనాది కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో వాతావరణం మారుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు.

Wednesday, July 7, 2021

How did Gurukul end ?

The first school in England opened in 1811 . At that time India had 732000 Gurukuls. Find out how our Gurukul got closed.

First tell you what were studied in Gurukul of our Sanatan culture tradition! It is necessary to know what was studied in Rishikul after Aryavarta's Gurukul. Change your thoughts with this education and remove the popular delusions!

01 Agni Vidya (Metallurgy)

02 Vayu Vidya (Flight)

03 Water Education (Navigation)

04 Space Science (Space Science)

05 Prithvi Vidya (Environment)

06 Surya Vidya (Solar Study)

07 Chandra and Lok Vidya (Lunar Study)

08 Megh Vidya (Weather Forecast)

09 Substance Electric Education (Battery)

10 Solar Energy Vidya (Solar Energy)

11 Day/ night vidya

12 Srishti Vidya (Space Research)

13 Astronomy

14 Geography knowledge (Geography)

15 Kal Vidya (Time)

16 Geology Education (Geology Mining)

17 Gemstones and Metals (Gems & Metals)

18 Attraction Vidya (Gravity)

19 Prakash Vidya (Solar Energy)

20 Vidya (Communication)

21 Aircraft Vidya (Plane)

22 Jalayan Vidya (Water Vessels)

23 Agneya Astra Vidya (Arms & Ammunition)

24 Biology Sciences (Zoology Botany)

25 Yagna Vidya (Material Sic)

* This is the talk of scientific education. Now let's talk about professional and technical education!*

26 Commerce (Commerce)

27 Agriculture (Agriculture)

28 Animal husbandry (Animal Husbandry)

29 Bird Keeping (Bird Keeping)

30 Animal Training (Animal Training)

31 Yan Machine (Mechanics)

32 Chariot (Vehicle Designing)

33 Ratankar (Gems)

34 Gold Car (Jewellery Designing)

35 Clothing Man (Textile)

36 Pottery (Pottery)

37 Blacksmith (Metallurgy)

38 Takkas

39 Dying (Dying)

40 Khatwakar

41 Rajjukar (Logistics)

42 Architect (Architect)

43 Cuisine (Cooking)

44 Chariot (Driving)

45 River Manager (Water Management)

46 Indicators (Data Entry)

47 Cowshala Manager (Animal Husbandry)

48 Garden Tents (Horticulture)

49 Forest Pal (Horticulture)

50 Measured (Paramedical)

All this education was taught in Gurukul, but with time, when Gurukul disappeared, this knowledge also disappeared! Today, the future of the youth of our country is being destroyed by the Macaulay method, then in such a time, the redemption of Gurukul is needed.

How did Gurukul end in India? Convent schools ruined. Indian Education Act was formed in 1858 It was drafted by 'Lord Macaulay'. Even before he had conducted a survey of education system here (India), many Britishers had given their reports about India's education system. One of the British officer was G.W. Luther and the other was Thomas Munro! Both of them had surveyed different areas at different times. Luther, who surveyed North India, wrote that there is 97 % literacy here and Munro, who surveyed South India, wrote that here there is 100% literacy.

Macaulay had clearly said that if India is to be slaves forever, its ′′ indigenous and cultural education system ′′ must be completely demolished and replaced with ′′ English education system ′′ and only then only in body Indians but English will be born from the brain and when they leave the university of this country, they will work in our interest.

Macaulay is using an idiom - ′′ Just as a farm is thoroughly plowed before a crop is planted, so must it be plowed and brought in the English education system. ′′ That's why he first declared Gurukuls illegal. Then he declared Sanskrit illegal and the Gurukul's of this country he finished it by roaming around setting them on fire, beat the teachers in it and put them in jail.

Till 1850 there were ' 7 lakh 32 thousand ' Gurukul in this country and at that time there were ' 7 lakhs 50 thousand ' villages in India. Meaning every village had an average Gurukul and all these Gurukuls used to be ' Higher Learning Institute ' in today's language. 18 subjects were taught in all of them and these people of Gurukul Samaj used to run these together, not by the king.

Education was given free in Gurukuls. This is how all Gurukuls were abolished and then English education was legalized and the first convent school opened in Calcutta. That time it was called 'free school'. Under this law, Calcutta University was created in India, Bombay University was created, Madras University was created, these three slavery-era universities are still in the country!

Macaulay had written a letter to his father. It is a very famous letter, in it he writes: ′′ These convent schools will bring out children who look like Indians but are English by brain and they don't know anything about their country. They won't know anything about their culture, they won't have any idea about their traditions, they will not know their idioms, when such children are there in this country, even if the British go away, English will not leave this country. ′′ The truth of the letter written at that time is clearly visible in this country now and see the misery of the act that we are ashamed to speak our own language. Speak in English to be called an educated. We feel inferior of ourselves who are ashamed to speak our own language.

People argue that English is the international language. There are 204 countries in the world and the English language is spoken, read and understood in only 11 countries, then how is this international language? Even in terms of words, English is not rich but poor language. The bible of these British was not in English and Jesus Christ did not speak English. The language of Jesus Christ and the language of the Bible were Armec. The script of Armek language was similar to our Bangla language. That language went extinct in the time cycle.

The language in the United Nations is not English, all the work there is in French. A society that is cut off from its mother tongue never gets good and this was Macaulay’s strategy! In which almost they have conquered because today's youth knows more about Europe than India. Considers Indian culture as dhakosla but imitates western countries. Supports the leftist despite not knowing the importance and characteristics of religion.

A pricking question to all the brothers, we all should know about religion. Because religion teaches us nationalism, religion teaches us socialism, religion motivates us to sacrifice our life for parents, teachers and nation. Tradition is a spiritual science, spirituality is the richer science than the science we all know today... 

Lets think.

May be time answers.

Tuesday, July 6, 2021

అమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలి ?

అమ్మవారి కుంకుమ పూజ ఎవ్వరైనా చేయచ్చు, పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది

మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది స్ట్రీలు చేస్తే ! వారిలో.. అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది

అవును ఆడవారు కుంకుమ పూజ చేస్తూ లలితా సహస్త్రనామం పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది..

ఏమిటి నిదర్శనం అంటారా,  వశిన్యాది దేవతలకు లలితా రహస్య సహస్త్రనామం చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో 'పలికేది మీరైన మీలో ఉండి పలికించేది నేనే" ని

చెప్పారు కదా.. అలాంటి లలితా పారాయణం చేస్తు కుంకుమ పూజ చేస్తున్న స్త్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది...

అంత కన్నా ఏమీ వరం కావాలి. అమ్మవారి రూపంగా నీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్ని నశించి పోతాయి నీ దేహం మనసు పవిత్రం అవుతుంది,

మళ్ళీ ఏదైనా పాప కర్మలు చేసి మురికిని అంటించుకుంటున్నారు కానీ..

సదా సత్ ప్రవర్తనతో ఉంటే దేవీ ఉపాస న చేసే ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపాలే...

ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపమే అయితే ప్రవర్తన కర్మను అనుసరించి, పాజిటివ్ ఎనర్జీ ,నెగటివ్ ఎనర్జీ develop అవుతుంది, అంటే దేవతగా ఉండాలన్నా, దయ్యంగా ఉండాలి అన్నా వారి వారి ప్రవర్తన వల్ల ఆ రూపం వారిలో మేలుకుంటుంది...

ఎంత ఖర్చు పెట్టి ఎన్ని పూజలు చేయించినా నలుగురు ఆడవారి చేత కుంకుమ పూజ చేయించనిదే అక్కడ జరిగిన అమ్మవారి పూజకు ఫలితం ఉండదు. ఎంత మందిని ఒక్క చోట చేర్చి కుంకుమ పూజ చేయిస్తే ఆ కార్యానికి అంత శుభం కలుగుతుంది....

 భక్తితో " ఓం శ్రీ మాత్రే నమః " అని వ్రాసి అమ్మ వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తుంది ఆ జగన్మాత...

ఓం శ్రీ మాత్రే నమః

Monday, July 5, 2021

రామ నామ మహిమ!!

పార్వతీదేవి శివునితో సంభాషిస్తూ.. ‘తెలియక చేసినా తెలిసి చేసినా రామనామంతో ముక్తి లభిస్తుందన్నది వాస్తవమేనా నాథా’ అని సందేహం వెలిబుచ్చినప్పుడు సదాశివుడు కొందరు కిరాతకుల కథ చెప్పాడు. వాళ్లు తమ జీవన విధానం గురించి..

వనేచరామః వసుచాహరామః

నదీన్తరామః నభయం స్మరామః

ఇతీరయంతో విపినే కిరాతా

ముక్తింగతాః రామపదానుషంగాత్‌

అని చెప్పేవారట. ‘‘మనం వనంలో తిరిగే వాళ్లం. ధనాన్ని అపహరిస్తాం. నదీనదాలను దాటుతుంటాము. భయం అన్నది మనకు స్మరణకే రాదు’’ అని దీని అర్థం. వారికి తెలియకుండానే ఈ నాలుగు వాక్యాల్లో చివర ‘రామ’ శబ్దం ఉండడంతో రామనామాన్ని అనుసంగమం చేసుకొని వారి మరణానంతరం వారు ముక్తి పొందారట. అనాలోచితంగానే రామ శబ్దం ఇంతటి పుణ్యాన్నిస్తుంది. ఇక తెలిసి రామ చింతన చేస్తే.. ఇంకా చెప్పేదేముంది? ముక్తి లభించడంలో సంశయం అక్కరలేదు. పరమేశ్వరుడి మాటలకు  పార్వతి సంతృప్తి చెందింది. రామ శబ్దంలోని ర, మ అనునవి రెండు బీజాక్షరములు. శ్రీ మహావిష్ణువు అష్టాక్షరీ మంత్రంలో ఐదో అక్షరం ‘రా’, శివ పంచాక్షరీ మహామంత్రంలోని రెండో అక్షరం ‘మ’. అలా రామ శబ్దం నిర్మితమైంది. ఐదు, రెండులను గుణిస్తే పది అవుతుంది. పదిని మరో పదితో గుణిస్తే వంద. దాన్ని మరో పదితో గుణిస్తే వెయ్యి. అంటే.. మూడుసార్లు రామనామాన్ని ఉచ్చరిస్తే వెయ్యిసార్లు ఉచ్చరించినట్టే.

శ్రీ రామ రామ రామేతి రమేరామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.

ఏ నామానికైనా ముందుగా ఓం  వుచ్ఛరిస్తాం. కానీ రామ శబ్దానికి ముందు ఓం ఉచ్ఛరించవలసిన అవసరం లేదు. కారణం రామ శబ్దమే ఓంకారానికి ప్రతీక. రామ శబ్దం ఉచ్చరిస్తే చాలు ఏ జపాలు మంత్రాలూ, తంత్రాలు అక్కరలేదు. రామ శబ్ద పారాయణం.. విష్ణు సహస్రనామ పారాయణకు సర్వసమానం. అందుకే మనలో చాలామందికి.. ఉత్తరాల పైభాగంలో ‘శ్రీరామ’ అని రాసిన తరువాతనే తదుపరి సమాచారం రాయడం అలవాటు. మనం కూడా ఏదైనా రాసినపుడు శ్రీ రామ అనే ముందు రాస్తాం. రామ శబ్దం పలకడానికి శౌచం అశౌచం లేదు. వేళతో నిమిత్తం లేదు.

తెలుగు నెలలకి ఆ పేర్లెలా వచ్చాయి?

చిత్తా నక్షత్రములో పౌర్ణమి రావటం వల్ల చైత్ర మాసమనీ, విశాఖ నక్షత్రములో పౌర్ణమి రావటం వల్ల వైశాఖ మాసమనీ, జ్యేష్టా నక్షత్రంలో పున్నమి చంద్రుడు రావటం వల్ల జ్యేష్ట మాసమనీ, పూర్వాషాఢ నక్షత్రంలో పౌర్ణమి రావటంతో ఆషాఢమనీ, శ్రవణంలో పౌర్ణమి రావటం వల్ల భాద్రపద మాసమనీ, అలాగే అశ్వనీ, పుష్యమీ నక్షత్లాల్లో పౌర్ణమి రావటం వల్ల కార్తీక, పుష్యమాసములనీ మఖ నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల మాఘమాసమనీ, పూర్వఫల్గుణి నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల ఫాల్గుణ మాసమని మన పూర్వీకులైన మహాఋషులు నామధేయములేర్పరిచారు.

వసెక్కువ పోశారంటారు?

సంస్కృతంలో 'వచు'లేదా 'ఉగ్రగంధ' అంటారు. తేమగా ఉన్న ప్రదేశంలో పెరుగుతుంది. పసితనంలో తొందరగా మాటలు రావటానికి వసకొమ్మును అరగదీసి తేనెతో కలిపి పోస్తారు. అలా పోస్తే వాక్కు స్పష్టంగా చక్కగా త్వరగా వస్తుందని అలా పోస్తారు.

సమతూకంగి వసపొయ్యకుండా ఎక్కువ పోస్తే గలగలా మాట్లాడతారు. అలాంటి వాళ్ళని సంబోధించి వీడికి వసెక్కువ పోశారంటారు. ఆయుర్వేదంలో వాపును కూడా ఈ వస చెట్టు వేళ్ళ రసం తగ్గిస్తుందని ఉన్నది.

గృహారంభము ఎప్పుడు ప్రారంభించ కూడదు, ఎప్పుడు ప్రారంభించాలి?

వైశాఖమూ, ఫాల్గుణమూ,పుష్యమూ, శ్రావణమూ, ఈ మాసములందు ముగ్గుపోయాలని బాదరాయణుడు శెలవిచ్చాడు.

అదే నారదుడు ఫాల్గుణ, వైశాఖ, శ్రావణ, కార్తీకములందు గృహ నిర్మాణమునకు శ్రీకారం చుట్ఠమని చెప్పాడు. ఈ మాసములలో గృహారంభము చేస్తే ధన, కనక, పుత్ర, ఆరోగ్యములు వృద్ధి చెందుతాయని చెప్పాడు.

కారణ తంత్రంతో స్థిరమాసమూ, స్థిరరాశీ, స్థిర అంశమూ ఇందు గృహానికి శంఖుస్థాపన చేయుట మంచిదని చెప్పాడు. ప్రధాన గృహ నిర్మాణం పుష్య, ఆషాఢ మాసములలో వద్దని చెప్పాడు. దైవజ్ఞవల్లభుడు, చైత్రమాసంలో గృహిరంభము శోకమనీ, వైశాఖంలో శుభమనీ, జ్యేష్టంలో మహాభయంకర శోకమనీ, ఆషాఢంలో పశువుల క్షీణతనీ, శ్రావణము ధనకారనీ, భాద్రపదము దరిద్రమనీ, ఆశ్వీయుజము గొడవలనీ, కార్తీకము భృత్యనాశనమనీ, మార్గశిరము ధనప్రాప్తి అనీ, పుష్యం లక్ష్మీప్రాప్తి అనీ, మాఘమాసము అగ్ని భయమనీ ఫాల్గుణం సకల ఐశ్వర్యప్రాప్తి అని శెలవిచ్చాడు.

పంచ దంపతులు... అంటే తెలుసా..?

ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలుగానే ఉంటారు.

1. లక్ష్మీనారాయణులు

విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది.. వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి. అక్కడే లక్ష్మి ఉంటుంది.., అంటే ఏ భార్య భర్తల హృదయం ఒక్కటై...ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో.. ఆ జంట లక్ష్మీనారాయణుల జంట.

2. గౌరీశంకరులు

అర్థనారీశ్వర రూపం.. తల నుంచి కాలి బొటన వ్రేలి వరకు నిట్టనిలువునా చెరి సగంగా ఉంటారు. రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత.. ఆలోచనలకు తల, కార్యనిర్వహణానికి కాలు సంకేతం.., కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త,  భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య – ఇలా ఉన్నవారు గౌరీశంకరుల జంట.

3. బ్రహ్మ సరస్వతులు

బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు.., నాలుక అనేది మాటలకు సంకేతం.. దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని.. ఇలా ఏ మాట మాట్లాడినా, ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆ భర్త మాటే మాట్లాడే భార్య .. ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మ సరస్వతుల జంట.

4. ఛాయా సూర్యులు.

సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతుంటాడు, అతడి భార్య ఛాయాదేవి. అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది. తన భర్త లోకోపకారం కోసం పాటు పడేవాడు.., విపరీతమైన తీక్షణత కలవాడు... అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూ ఉంటుంది ఛాయాదేవి.. ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా, పట్టుదలతో ఉంటాడో... ఏ ఇంట అతని భార్య మాత్రం నెమ్మది గాను, శాంతం గాను, అణకువ గాను ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.

5. రోహిణీ చంద్రులు

రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత ఉంది. చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలుగజేసేవాడు, ఏ జంట భర్త లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను, కోపంతోను, పట్టుదలతోను ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.

కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.

1. అజీర్ణే భోజనమ్ విషమ్.


మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే, రాత్రి భోజనం చేయడం, విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు.


*2. అర్ధరోగహరి నిద్రా


సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, శారీరక శ్రమ వల్ల కాళ్ళు, చేతులు, గుండె, మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఉపకరిస్తుంది. అటువంటి వారికి రోగాలు దరిచేరవు. కనుక మంచి నిద్ర సగం రోగాలను హరించి వేస్తుంది అని ఈ సూక్తికి అర్థం.


*3. ముద్గధాలి గధవ్యాలి


అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ పెసలు (గ్రీన్‌గ్రామ్‌లు) ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ, ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.


*4. బాగ్నస్తి సంధనకరో రాసోనాహా


వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు, వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి.


*5. అతి సర్వత్రా వర్జయేత్


అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి.


*6. నాస్తిమూలం అనౌషాధం


శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు.


*7. నా వైద్యా ప్రభుయుయుషా


ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి.


*8. చింతా వ్యాధి ప్రకాషయ


చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.


*9. వ్యాయమాశ్చ సనైహి సనైహి


ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. నడక కూడా ఇందులోకి వస్తుంది.


*10. అజవత్ చార్వనం కుర్యాత్


మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది.


*11. స్నానమ్ నామా మనఃప్రసాధనకరం దుస్వప్న విధ్వంసకం*


స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది. ఇది బాడ్ డ్రీమ్స్ (చెడ్డ కలలను) ను దూరం చేస్తుంది.


*12. న స్నానం ఆచరేత్ భుక్త్వా.


ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.


*13. నాస్తి మేఘసమం తోయం.


స్వచ్ఛతలో వర్షపునీటికి, ఏ నీరు సాటి రాదు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ వర్షపు నీటిని పట్టి వడకట్టి త్రాగుతారు. కాని నేరుగా పడిన వర్షపు నీటినే పట్టాలి. ఇంటి చూరుల మీదనుంచి కారిన నీరుకాదు.


*14. అజీర్నే భేజాజం వారీ


మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు.


*15. సర్వత్ర నూతనం శాస్త్రం సేవకన్న పురాతనం.


తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, తొలగించవద్దు.)


*16. నిత్యామ్ సర్వ రసభ్యాసహా.


ఉప్పు, తీపి, చేదు, పులుపు, (ఆస్ట్రింజెంట్ మరియు పంజెంట్) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి.


*17. జఠరామ్ పూరైధార్ధమ్ అన్నాహి


మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి.


*18. భుక్త్వోపా విసస్థాంద్ర


ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం అరగంటైనా నడవండి.


*19. క్షుత్ సాధూతం జనయతి


ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)


*20. చింతా జరానామ్ మనుష్యానమ్


చింతించడం అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. కనుక అనవసరపు చింతలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.


*21. సతం విహయ భోక్తవ్యం


ఆహారం తీసుకొనే సమయం వచ్చినప్పుడు, ఎంతటి పనినైనా కూడా పక్కన పెట్టండి. నిదానంగా భోజనం చేయండి. వేగంగా తినడం, పని ఉందని అసలు భోజనమే మానివేయడం చాలా అనర్థదాయకం.


*22. సర్వ ధర్మేశు మధ్యమామ్.


ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు, నిత్య ఆరోగ్యం తప్పక లభిస్తాయి.

        శుభంభూయాత్

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...