Sunday, June 28, 2020

ఎంగిలి దోషం


మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి 'ఎంగిలి దోషం' అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు.

ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే.

ఇంతెందుకు ! స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది, అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం..

పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు.

పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు.

ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది.

పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు, వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు. ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి. వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది. ఇంకొన్ని ఇళ్ళలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్ధమైందా మనము పూజల్లో వెండి వస్తువులకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తామో ?!

వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం.

కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు.

ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధ చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో  నోటిద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు.

ఎంగిలి దోషం అంటని మూడు పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.

1. చిలక కొరికిన పండు,
2. తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె.
3 దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు.

వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కోసం పాటిద్దాం.  సర్వే జనాః సుఖినో భవంతు .

గుప్త నవరాత్రులు

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత.......

లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వరాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది, దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు.










కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||
భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ, అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు. విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.
ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు, శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి, వాడిని సంహరించి, భూమాదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె #వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ #మహాలక్ష్మీ. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.

అమ్మవారిని చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గోఆధారితం వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.

#వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు. కానీ వారాహీ చాలా శాంతస్వరూపిణి. వెంటనే అనుగ్రహిస్తుంది, కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది, అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు, అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.

Friday, June 12, 2020

శుకమహర్షి

పరాశర పుత్రుడైన వ్యాసమహర్షి ఒకనాడు సరస్వతీ నదీతీరంలో సంచరిస్తూ, తనకు సంతానం లేదని చింతాక్రాంతుడై ఉన్నాడు. అలా ఉండగా, సమీపంలోని ఒక చెట్టు కొమ్మపై రెండు చిలుకలు అతనికి కనిపించాయి. తల్లి చిలుక తన సంతానమైన చిన్ని చిలుకకు తన నోటితో ఆహారం అందిస్తూ, తన రెక్కలతో పిల్ల చిలుక శరీరం నిమురుతూ, పదేపదే ముద్దాడుతూ, తన వాత్సల్యాన్ని అందిస్తోంది. ఆదృశ్యాన్ని చూచిన వ్యాసునికి అంతరంగంలో దాగి ఉన్న పుత్ర ప్రేమ వెల్లువలా పెల్లుబికింది. "ఓహూ! ఈ చిలుక తన బిడ్డను లాలిస్తూ ఎంత మురిసిపోతోంది! పశు పక్ష్యాదులకే ఇంతటి ప్రేమ ఉంటే, ఇక మానవులకు తమ సంతతిపై ఎంతటి ప్రేమ ఉంటుందో కదా !పుత్రుని ముద్దుమోము చూచి ఆనందించే తండ్రి ఎంతటి అదృష్టవంతుడో !వివాహం కేవలం దాంపత్యసుఖం కోసమే కాదని, అది సంతాన ప్రాప్తికి సాధనమని శాస్త్రాలు చెప్తున్నాయి. పుత్రులు లేని వారికి వార్ధక్యంలో ఎవరు సేవలు చేస్తారు? వయస్సుమళ్ళి, శరీరబలం తగ్గి ఇతరుల సహకారంతో గడువలసిన శేషజీవితానికి పుత్రుడే ఆధారం కదా! తండ్రిమరణిస్తే, కుమారుడు శ్రాద్ధకర్మలు ఆచరించి, తండ్రికి ఉత్తమ గతులు కలిగిస్తాడు. అందువల్లనే

"అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ|

పుత్రాదన్యతరం నాస్తి పరలోకస్య సాధనమ్‌||"

అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. "నేను కూడా దైవానుగ్రహంతో పుత్ర సంతతిని పొందగలిగితే ఎంత తృప్తిగా ఉంటుందో కదా! " అని వ్యాసునిలో అంతర్మథనం ప్రారంభమైంది.
ఈ ఆలోచనతో అతడు తపస్సు చేయాలని సంకల్పించి , మేరు పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. సంతానం కోసం ఏ దైవాన్ని ఆరాధించాలో అతనికి తోచలేదు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, గణపతి, కుమారస్వాని, అగ్ని, వరుణుడు మొదలైన దేవతలలో తనకు అభీష్టసిద్ధిని ప్రసాదించగల వారెవ్వరో? అని తనలో తాను తర్కించు కుంటున్నాడు. ఇంతలో తన మహతీవీణపై మధురగానం ఆలపిస్తూ దేవర్షి అయిన నారదుడు వ్యాసునికి ఎదురు పడ్డాడు. వ్యాసుడు నారదునికి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించి, కుశల ప్రశ్నలు వేశాడు.

అపుడు నారదుడు, "వ్యాసమహర్షీ! వేల సంవత్సరాలు నిశ్చల తపోదీక్ష సాగించి అద్వైతామృతాన్ని ఆస్వాదించిన అదృష్టశాలివి కదా! పురాణ వాఙ్మయాన్ని సృష్టించి మానవాళికి అందించిన ధన్య చరితుడవు కదా! ఇలా దుఃఖంలో మునిగి ఉన్నావేమిటి? "అని ప్రశ్నించాడు. అందుకు వ్యాసుడు "నారదా! పుత్రులు లేని వారికి ఇహలోకంలో సుఖశాంతులు, పరలోకంలో సద్గతులు లేవని తెలుసుకున్నాను. సంతతిలేని నాకు సద్గతులు కలిగే అవకాశం లేదు కదా! కనుక, సంతతి పొందాలనే కోరిక కలిగింది. సంతతి పొందాలంటే దైవానుగ్రహం కావాలి. మీరు సర్వజ్ఞులు కదా! ఎవరిని ప్రార్థిస్తే

నా కోరిక నెరవేరుతుందో సెలవీయండి. " అని ప్రాధేయ పడ్డాడు.

నారదుడు, " వ్యాసమహర్షీ! ఇపుడు నీ వడిగిన ప్రశ్న వింటుంటే నా తండ్రి అయిన బ్రహ్మ తన తండ్రి అయిన శ్రీ మహావిష్ణువును ప్రార్థించిన సన్నివేశం నా తలపులలో మెదలుతోంది. ఆ వృత్తాంతం వివరిస్తాను. సావధాన చిత్తుడవై విను " అన్నాడు.

వ్యాసుడు శ్రద్ధాళువై వింటూండగా, నారదుడు వివరించ సాగాడు.

" ఒకసారి బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి అక్కడ శ్రీమహావిష్ణువు ధ్యానముద్రలో ఉండడం చూచి, ఆశ్చర్యపోయాడు.

" దేవాదేవా ! నీవే జగన్నాథుడవు కదా! నీవు ఇంకెవరిని ధ్యానిస్తున్నావో నాకు తెలియడంలేదు. నీ నాభి కమలం నుండి పుట్టిన నేను ఆ సృష్టికి కర్తను అనుకొంటున్నాను. సృష్టికర్తనైన నాకే జన్మనిచ్చిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడవు. నీ కంటే గొప్పవారు ఇంకెవరు ?సమస్త జగత్తునకూ నీవే మూలకారణం. ఈజగత్తునకు కర్తవు, భర్తవు, హర్తవు, కూడ నీవే కదా! నీ ఆజ్ఞచేతనే సూర్యుడు సంచరిస్తాడు. వాయువు ప్రసరిస్తాడు. అగ్ని ప్రజ్వలించినా, మేఘుడు వర్షించినా నీ కనుసన్నలకు లోబడే కదా! ఇలాంటి నీవు దైవాన్ని ఆరాధిస్తున్నాలో వివరించు" అని

విష్ణులును ప్రార్థించాడు.

అపుడు శ్రీహరి చిరునవ్వుతో "విరించీ! నీ సందేహం సమంజసమైనదే. లోకులందరూ నిన్ను సృష్టి కర్తగా, నన్ను స్థితికారకునిగా, రుద్రుణ్ణి సంహారశీలిగా భావిస్తూ ఉంటారు. కాని మనం సర్వస్వతంత్రులం కాము. మనం ముగ్గురమూ 'పరాశక్తి ' ప్రభావం చేతనే మన కర్తవ్యాలను నిర్వర్తించ గలుగుతున్నాము. నువ్వు భావిస్తున్నట్లుగా నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణ అయితే, చేపగా, తాబేలుగా, పందిగా జన్మిస్తానా? జంతువుగా జన్మించాలని ఎవరు కోరుకుంటారు? ఆ పరాశక్తి సంకల్పబలం చేతనే నేను వివిధ వేషాలు ధరించి. ఆ జగన్మాత ఆజ్ఞకు బద్ధుడనై సంచరిస్తూ ఉంటాను, నేను నిరంతరమూ ధ్యానించేది ఆ పరాశక్తినే.మనం అందరమూ ఆ జగన్మాతను ఆరాధింప వలసిన వారమే " అని సమాధానం చెప్పాడు.

కనుక, మహర్షీ ! సకల దేవతలకూ ఆరాధ్య అయిన ఆ పరాశక్తినే నీవూ ఆరాధించి కామితార్థాన్ని నెరవేర్చుకో! "

నారదుని ప్రేరణతో వ్యాసుడు దేవి పాదపద్మాలను సేవించటానికి తపస్సు ప్రారంభించాడు.

మేరుపర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్న వ్యాసుడు ఒకనాడు అగ్నిని రగిలించడానికి. 'అరణి' (ఒక కొయ్యను మరో కొయ్యముక్కతో) మథనం చేస్తుండగా , 'ఘృతాచి' అనే దేవకాంత చిలుక రూపంలో అతనికి కన్పించింది. ఆమెను చూడగానే వ్యాసుని మనస్సు క్షణకాలం పాటు చలించింది. మరుక్షణం లో అతని దేహం నుంచి ఒక తేజోకణం ఆరణిపై పడింది. ఆఅరణి నుండి ఒక దివ్య మూర్తి ఆవిర్భవించాడు. ఆడ చిలుక రూపాన్ని దాల్చిన ఘృతాచిని చూచి వ్యాసుని మనస్సు చలించగా జన్మించిన ఆ దివ్యమూర్తియే శుకమహర్షి.

వ్యాసుడు ఆ బాలుణ్ణి తన ఒడిలో కూర్చొనబెట్టుకొని, ముద్దాడి, పరమానంద భరితుడయ్యాడు. అపుడు దేవదుందుభులు మ్రోగాయి. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. అప్సరసలు నాట్యం చేశారు. గంధర్వులు గానం చేశారు. తుంబుర నారదాది మహర్షులు ఎంతో ఆనందించారు. అంతలో ఆకాశంనుండి %ా శుకమహర్షి కోసం కృష్ణాజినము, దండకమండలాలూ దిగి వచ్చాయి. రెప్పపాటు కాలంలో అందరూ చూస్తూండగానే శుకమహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. వ్యాసుడు శుకునికి ఉపనయనం చేసి వేదవిద్యలన్నీ నేర్పించాడు. శుకుడు గురువుల వద్ద వేదవేదాంగాది విద్యలనూ సమస్త శాస్త్రాలను సమగ్రంగా అధ్యయనం చేశాడు.

సమస్త విద్యా పారంగతుడై, తన వద్దకు తిరిగి వచ్చిన పుత్రుణ్ణి చూసి వ్యాసుడు ఆనందంతో పొంగిపోయాడు. శుకునికి వివాహం చేయాలని సంకల్పించాడు. నాయనా! యోగ్యురాలైన కన్యను వివాహమాడి, పవిత్రమైన గృహస్థ జీవితాన్ని ప్రారంభించు. గృహస్థాశ్రమంలో దేవ, పితృ, ఋషి ఋణాలను తీర్చుకొని సార్థక జీవితాన్ని సాగించు." అని కుమారునికి బోధించాడు.

జన్మతః జ్ఞాని, వైరాగ్య సంపన్నుడు అయిన శుకుడు" తండ్రీ! బంధ హేతువైన ఈ సంసార సాగరంలో నన్ను పడద్రోయాలని ఎందుకు భావిస్తున్నారు ?వైవాహిక జీవితం గొలుసులుతో కట్టబడిన బద్ధజీవితమే. లోహపాశమైన గొలుసులతో బంధింపబడినవాడు కొన్నాళ్ళకైనా బంధ విముక్తుడు కాగలిగే అవకాశం ఉంది. కాని, ఆలుబిడ్డలనే మోహపాశంతో బంధింపబడినవాడు ఎన్నటికీ మోక్షసామ్రాజ్యాన్ని పొందలేడు. అయోనిజుడ నైన నాకు సంసార వాంఛలేదు. రక్తమాంసాదులతో, మలమూత్రాదులతో కూడిన నికృష్ఠమైన ఈ సంసారిక జీవనాన్ని నేను అంగీకరించలేను. గృహ, దారా, పుత్రాది వ్యామోహమనే సాగరంలో మునిగిన మానవుడు ఎన్నటికీ ఒడ్డుకు చేరలేడు. వేద శాస్తరాలను అభ్యసించి కూడా జ్ఞాన వైరాగ్యాలను సంపాదించలేక, సంసారంలో పడి వ్యామోహంతో కాలం గడిపితే, అతని జీవితం , అతని విద్య అంతా నిరర్థకమే! కనుక, గృహస్థ జీవితం స్వీకరింప వలసినదిగా నన్ను నిర్బంధించకండి-" అని తండ్రి ప్రార్థించాడు.

శుకుని మాటలను వ్యాసుడు అంగీకరించలేకపోయాడు.

"కుమారా! మోక్షానికి గృహస్థాశ్రమం ప్రతిబంధకం కాదు నాయనా బంధమోక్షాలకు కారణం మనస్సే. గృహాస్థే అయినా, ధర్మాన్ని నిర్వర్తిస్తూ, పుణ్యకార్యాలు ఆచరించి, దైవానుగ్రహం పొంది, అభ్యాసబలంతో క్రమంగా ఇంద్రియాలను జయించి, చివరకు మోక్షాన్ని పొందవచ్చు. నాలుగు ఆశ్రమాలలోనూ గృహస్థాశ్రమమే శ్రేష్ఠమైనది. బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు గృహస్థ జీవితమే ఆధారం.

అంతేగాక, మోక్షసౌధాన్ని అధిరోహించడానికి ఈ నాలుగు ఆశ్రమాలూ నాలుగు సోపానాలు, నాయనా! ఒక్కొక్క ఆశ్రమ ధర్మాన్నీ క్రమంగా పాటిస్తూ, చివరకు మోక్షాన్ని సంపాదించవచ్చు. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యా వినయ సంపన్నుడై , సకల ధర్మవేత్తయై, జీవితం విలువను గుర్తించిన మానవుడు గృహస్థాశ్రమ స్వీకారానికి అర్హుడవుతాడు. గృహస్థ జీవితంలోని కష్టనష్టాలను ఓర్పుతో భరిస్తూ, అందలి అనుభవసారాన్ని గ్రహిస్తూ, ఇంద్రియాల తీరుతెన్నులను, భ్రమ ప్రమాదాలను లోనయ్యే పరిస్థితినీ గుర్తిస్తూ, అభ్యాస వైరాగ్యాలను అలవరచుకోవాలి. గృహస్థ ధర్మనిర్వహణలో తన బాధ్యతలన్నింటిని నెరవేర్చి, వైరాగ్య సంపన్నమైన మనస్సుతో మానవుడు వానప్రస్థ, సన్న్యాస ఆశ్రమాలకు అర్హుడుకాగలుగుతాడు. సన్యాస జీవితంలో సర్వసంగ పరిత్యాగం చేసి మోక్షపదవిని కైవసం చేసుకుంటాడు సాధకుడు.

కుమారా! క్రమసోపాన పరంపర అయిన ఈ మర్గాన్ని అతిక్రమిస్తే, ఒక్కొక్క ప్పుడు ఇంద్రియాలు బలీయమై మానవుణ్ణి పెడత్రోవలు పట్టించే అవకాశం ఉంది. మూడువేల సంవత్సరాలు నిరాహారిగా ఉండి ఉగ్ర తపస్సు చేసిన విశ్వామిత్రుడంతటివాడే దేవకాంత అయిన మేనకను చూచి, వ్యామోహితుడై కాలం గడిపి, శకుంతల అనే పుత్రికకు జన్మనిచ్చి, సంసార బంధంలో చిక్కుకొని , తన తపశ్శక్తిని వ్యర్థం చేసుకున్నాడు కదా !కనుక, క్రమసోపాన పరంపరను అనుసరించి మోక్షసాధనాన్ని చేరుకోవడానికి గృహస్థ జీవితమే సర్వోత్తమమైనది. నా మాట విని, గృహస్థాశ్రమాన్ని అంగీకరించవయ్యా" !అని పరిపరి విధాల నచ్చచెప్పాలని చూశాడు వ్యాసుడు.

తండ్రి ఎన్ని రీతులలో వివరించినా, ఎంతగా బోధించినా, శుకమహర్షికి ఆ మాటలు రుచించలేదు. సంసార జీవితంలోని దుఃఖాలను, క్లేశాలను తండ్రికి వివరించి, వివాహం పట్ల తన వ్యతిరేకతను స్పష్టం చేశాడు శుకుడు. సాగరంలో ఉన్నవాడి రక్తాన్ని జలగలు పీల్చినట్లుగా, సంసార సాగరంలో ఉన్న మానవుని సమస్త శక్తులనూ ఆలుబిడ్డలు పీల్చి పిప్పిచేసి, ఆ మానవుణ్ణి ఆధ్యాత్మిక సాధనకు అయోగ్యునిగా చేస్తారని- నిష్కర్షగా నిర్ణయించాడు శుకుడు .కనుక తనకు గృహస్థజీవితం వద్దని ఖండితంగా చెప్పాడు.
శుకుడు బ్రహ్మచారిగా ఉండిపోయాడు.

Thursday, June 11, 2020

శ్రీ సాయినాథ అష్టకం



పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహమ్ || ౧ |

మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే
ద్విజరాజం తమోఘ్నం తం సాయినాథం నమామ్యహమ్ || ౨ ||

జగదుద్ధారణార్థం యో నరరూపధరో విభుః
యోగినం చ మహాత్మానం సాయినాథం నమామ్యహమ్ || ౩ ||

సాక్షాత్కారే జయే లాభే స్వాత్మారామో గురోర్ముఖాత్
నిర్మలం మమ గాత్రం చ సాయినాథం నమామ్యహమ్ || ౪ ||

యస్య దర్శన మాత్రేణ నశ్యంతి వ్యాధి కోటయః
సర్వే పాపాః ప్రణశ్యంతి సాయినాథం నమామ్యహమ్ || ౫ ||

నరసింహాది శిష్యాణాం దదౌ యోఽనుగ్రహం గురుః
భవబంధాపహర్తారం సాయినాథం నమామ్యహమ్ || ౬ ||

ధనాఢ్యాన్ చ దరిద్రాన్యః సమదృష్ట్యేవ పశ్యతి
కరుణాసాగరం దేవం సాయినాథం నమామ్యహమ్ || ౭ ||

సమాధిస్థోపి యో భక్త్యా సమతీర్థార్థదానతః
అచింత్య మహిమానంతం సాయినాథం నమామ్యహమ్ || ౮ ||

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

Wednesday, June 10, 2020

దశావతార నృసింహ మంత్రము

ఇది దశావతార నృసింహ మంత్రము - ప్రతిరోజు భక్తి తో చదివితే మనసులోని కోరికలు ఒక్కోక్కటిగా నేరవేరుతాయి.
"ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ |
ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః |
ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః |
ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః |
ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః |
ఓం క్ష్రౌం వామనరూపాయ నమః |
ఓం క్ష్రౌం పరశురామాయ నమః |
ఓం క్ష్రౌం రామాయ నమః |
ఓం క్ష్రౌం బలరామాయ నమః |
ఓం క్ష్రౌం కృష్ణాయ నమః |
ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ సాలగ్రామ నివాసినే నమః |
దివ్యసింహాయ నమః |
స్వయంభువే పురుషాయ నమః |
ఓం క్ష్రౌం ||"

Tuesday, June 2, 2020

గాయత్రి జయంతి

ఈ సంవత్సరం  రేపు, అనగా  03-జూన్-2020, గాయత్రి జయంతి

గాయత్రి  ప్రార్ధన

ముక్తా విద్రుమ హేమ నీల ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్త త్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదా భయాంకుశ కశాశ్శుభ్రమ్కపాలం గదామ్
శంఖం చక్రమధార విందం యుగళమ్హ సైర్వహం తీం భజేే

గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ , హేమ , నీల , ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ , చక్ర , గద , అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని , శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు , శిఖపఈ రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.


అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ , మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను , సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది.


నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని ఉపాసన చేసి , అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.


శ్రీ గాయత్రీ మాత మహాత్యం


వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.

ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.


త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం , సంకల్ప బలం , ఏ కాగ్రత , ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు.  ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని , ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది.  ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి , కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.


బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ , నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి , సృష్టి ఉత్పత్తి , వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి .  ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.


గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు. గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:

01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.

02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.

03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.

04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.

05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.

06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.

07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.

08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.

09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.

10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.

11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.

13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.

14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.

15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.

16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమే.

17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.

18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.

19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.

20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.

21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.

22. హయ గ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.

23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.

24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.



శ్రీ గాయత్రీ అష్టకం

ఉషఃకాలగమ్యా ముదాత్త స్వరూపాం
అకార ప్రవిష్టాముదారాంగ భూషామ్‌
అజేశాదివంద్యా మజార్చాంగ భాజాం
అనౌపమ్య రూపాం భజామ్యాది సంధ్యామ్‌ !!

సదాహంసయానాం స్పురద్రత్న వస్త్రాం
వరా భీతి హస్తాం ఖగామ్నాయ రూపామ్‌
స్ఫురత్స్వాధికామక్షమాలాంచ కుంభం
దధా నామహం భావయే పూర్వసంధ్యామ్‌ !!

స్ఫురచచంద్ర కాంతాం శరచ్చంద్ర వక్త్రాం
మహా చంద్రకాంతాద్రి పీనస్తనాఢ్యామ్‌
త్రిశూలాక్షహస్తాం త్రినేత్రస్యపత్నీం
వృషారూఢ పాదాం భజే మధ్య సంధ్యామ్‌ !!

సదాసామగాన ప్రియాం శ్యామలాంగీం
అకారాంతరస్థాం కరోల్లాసి చక్రామ్‌
గణాపద్మహస్తాం స్వనత్పాంచజన్యాం
ఖగేశోపవిష్టాం భజేమాస్త సంధ్యామ్‌ !!

ప్రగల్భ స్వరూపాం స్ఫురత్కంకణాఢ్యాం
సదాలంబ మానస్తన ప్రాంతహారామ్‌
మహా నీలరత్న ప్రభాకుండలాఢ్యాం
స్ఫురత్స్మేర వక్తాం భజేతుర్య సంధ్యామ్‌!!

హృదంభోజమధ్యే పరామ్నాయనీడే
సుఖాసీన సద్రాజ హంసాం మనోజ్ఞామ్‌
సదాహేమభాసాం త్రయీవిద్య మధ్యాం
భజామస్తువామో వదామ స్మరామః !!

సదాతత్పదైస్తూయమానాం సవిత్రీం
వరేణ్యాం మహా భర్గరూపాం త్రినేత్రామ్‌
సదా దేవదేవాది దేవస్యపత్నీం
మహంధీ మహీత్యాది పాదైకజుష్టామ్‌ !!

అనాథం దరిద్రం దురాచారయుక్తం
శతం స్థూలబుద్ధిం పరం ధర్మహీనం
త్రిసంధ్యాం జపధ్యాన హీనం మహేశి
ప్రసన్నంచ మాంపాలయత్వం కృపార్హం!!

ఇతీదం భుజంగం పఠేద్యస్తు భక్త్యా
సమాదాయ చిత్తే సదా తాం పరాంచాం
త్రిసంధ్య స్వరూపాం త్రిలోకైకవంద్యాం
సముక్తోభవేత్సర్వ పాపైరజస్రమ్‌ !!


గాయత్రీస్తోత్రం


నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేఽక్షరీ |
అజరేఽమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || 1 ||

*నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేఽమలే |
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోఽస్తు తే || 2 ||

*అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ |
నిత్యానందే మహామాయే పరేశానీ నమోఽస్తు తే || ౩ ||

త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా |
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః || 4 ||

పూషాఽర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః |
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాఽప్సరసాం గణాః || 5 ||

రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ |
ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ || 6 ||

త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః |
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ || 7 ||

త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ |
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ  || 8 ||

తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా |
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే || 9 ||

చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే |
స్వాహాకారేఽగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ || 10||

నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్ |
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ || 11||

అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ |
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే || 12 ||


గాయత్రీ మంత్రం - పరమేశ్వరుడు

గాయత్రీ మంత్రం సృష్టిస్థితి లయ కారకుడైన పరమేశ్వరునిది - శుద్ధ బ్రహ్మ స్వరూపుడైన పరమాత్మది. నిజానికి సృష్టికి అతీతంగా చెప్పినప్పుడు

’పరమాత్మ’ అని వ్యవహారం. అతడే సృష్టి స్థితి లయలు చేస్తున్నప్పుడు ’పరమేశ్వరుడు’ అని వ్యవహరింపబడతాడు.
రెండూ ఒకటే తత్త్వం. అయితే ఆ పరమాత్మను శివునిగా భావించి ఆరాధించే వారికి గాయత్రి శివస్వరూపమే. దానికి ప్రమాణంగా కొన్ని వాక్యాలున్నాయి. అలాగే విష్ణువుగా భావించే వారికి గాయత్రీ మంత్రానికి విష్ణువే లక్ష్యం. దానికీ ప్రమాణ వాక్యాలు ఉన్నాయి.  అదేవిధంగా గణపతి పరంగా , సూర్య పరంగా , శక్తి పరంగా , స్కందుని పరంగా కూడా అన్వయించే శాస్త్ర వాక్యాలున్నాయి. వీటినిబట్టి ఎవరి ఉపాస్య దైవాన్ని వారు గాయత్రీ మంత్ర స్వరూపంగా ధ్యానించి ఆరాధించి తరించవచ్చు అని భావం.
"మాబుద్ధులను ప్రేరేపించే సృష్టికారకమైన శ్రేష్ఠమైన పరబ్రహ్మ తేజస్సును ధ్యానిస్తున్నాము" అని మంత్రభావం.  సూర్య మండలంలోని పరంజ్యోతిని వారి వారి ఇష్ట దేవతారూపంగా భావించడం పరమార్థం. ఈ దేవతలు కూడా వేదం ప్రతిపాదించిన శివ విష్ణు శక్తి గణేశ సూర్య స్కంద రూపాలు కావాలి. ఎందుకంటే - మంత్రం కూడా వేద సంబంధి కనుక.

మరొక విశేషం - పై దేవతల మంత్రాలను సంధ్యాకాలంలో ఉపాసిస్తే అది వారికి గాయత్రి అవుతుంది. అయితే - అందరూ పఠించదగిన గాయత్రీ మంత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాధానమైనవి మూడు. సంధ్యాకాలాలలో వీటిని జపిస్తే ’గాయత్రి’ అవుతాయి.

సర్వ చైతన్య రూపాం తాం , ఆద్యాం విద్యాం చ ధీమహి , బుద్ధిం యా నః ప్రచోదయాత్!!
పరమేశ్వర విద్మహే, పరతత్త్వాయ ధీమహి, తన్నో బ్రహ్మ ప్రచోదయాత్!!
యోదేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః!
ప్రేరయేత్తస్య తద్భర్గః తద్వరేణ్య ముపాస్మహే!!
సద్బుద్ధి ప్రదాయిని.. గాయత్రి


ఏ పనిచేస్తున్నా - ‘ఇది నేను చేయటం లేదు, నాలోని జగన్మాత చేయిస్తున్నది’ అనే సంపూర్ణ శరణాగతి , నివేదన భావంతో మంచిపని చేస్తే అది జగజ్జనని ఆరాధన అవుతుంది. జీవితమంతా ఒక మహాసాధన. ఇందులో ఏ క్షణం కూడా మనది కాదు. దానిని వ్యర్థం చేసేందుకు మనకు అధికారం లేదు. అద్భుతమైన ఈ శరీర యంత్రాన్ని మనకు ప్రసాదించిన శ్రీమాతను స్మరిస్తూ , ఈ శరీరం మనకూడా ఉండగానే , ఇందులో అంతర్లీనంగా ఉన్న ఆనంద బిందువును ఆర్ద్రతతో , అప్రమత్తంగా , ఆప్యాయంగా అందుకోవాలి.  అందుకు ఆధారం - త్రికాల సంధ్యా దేవత గాయత్రీమాత అనుగ్రహం.
గాయత్త్రీ వ్యాహృతి సంధ్యా అని గాయత్రీ మాతను కీర్తించాడు హయగ్రీవ మహర్షి . దీనినిబట్టి మనకర్థమయ్యేదేమిటంటే- సంధ్య ఎవరో గాదు- గాయత్త్రే . ఆ గాయత్రి కూడా ఎవరో కాదు- శ్రీలలితా పరదేవతే , మహాశక్తే . ఆ శక్తి కాలస్వరూపిణి. కాలమంటే కదిలేది. అచలమైన తత్త్వం నుండి చలించి వస్తుంది ఆ శక్తి . చలించి , పరా పశ్యంతి , మధ్యమా , వైఖరీ అని నాలుగు దశలలో కిందికి చలించి దిగి వచ్చింది. వచ్చి, అదే మనకు చివరకు వైఖరీ రూపమైన ఈ ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ చరాచర ప్రపంచమే - నిరంతర భ్రమణశీలమైన ఆ గాయత్రీ శక్తి .

మన నాత్త్రాయతే ఇతి మన్త్రః మననం చేసే కొద్దీ మనలను కాపాడేదేదో అదీ మంత్రమంటే. మంత్రాణా మర్థస్తిరోహితో భవతి అని పెద్దలు చెప్తారు. మంత్రం పైకి కనిపిస్తున్నా మంత్రార్థమలా కనిపించదు. అందులో రహస్యంగా ఉంటుంది. మననం వల్లనే అది ప్రకటితమవుతుంది. ఆదిభౌతికం , ఆధ్యాత్మికం , ఆది దైవికమని మూడు భూమికలలో భావన చేయాలి. ఆది దైవికమైన స్థాయి నుంచే దిగి వచ్చిందది మనదాకా. దిగి వచ్చేటప్పుడది గాయత్రి .
గాయత్త్రీ  త్రాయతే ఇతి గాయత్రి . ఎవరా మంత్రాన్ని గానం చేస్తుంటే వారిని కాపాడుతుంది కనుక గాయత్రి అయింది.
న గాయత్య్రాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్ గాయత్రికి మించిన మంత్రము లేదు. తల్లిని మించిన దేవత లేదని దివ్య సూక్తి. ఏ మంత్రానుష్ఠానం చేసినా , ముందు గాయత్రి  మంత్రం చేస్తేనేగాని దాని ఫలితం మనకు రాదు. అదీ గాయత్రి  మంత్ర జప విశిష్టత. గాయత్రీ ఛందసామహమ్ అని ఋక్కులలో గాయత్రి మంత్రమును తానేనని భగవద్గీత పదవ అధ్యాయంలో గీతాచార్యుడు నొక్కి వక్కాణించటం - గాయత్రీ మంత్ర మహోదాత్తత విశదమవుతుంది.  సద్బుద్ధి ప్రదాయిని గాయత్రి. దీర్ఘాయువు , సత్సంతానం , గోవులు , కీర్తి , ద్రవ్యము, బ్రహ్మ వర్చస్సులను ప్రసాదించి , అంత్యంలో బ్రహ్మమును అనుగ్రహించు కరుణామయి ‘గాయత్రి’ అని చెపుతోంది అధర్వణ వేదం.


గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు వస్తాయి. వాటిని మూడు భాగాలుగా చేస్తే , ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి. ఈ మూడు ఖండాలు - సృష్టి స్థితి లయాలకు సూచితం. మొదటి ఖండం - ఋగ్వేదం ; రెండవది-సామవేదం ; మూడవది - యజుర్వేదం అవుతాయి. కనుక గాయత్రి వేదమాత.


గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలకు, వాల్మీకి మహర్షి ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలతో , వెరసి ఇరవది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని రచించారు. కనుకనే , గాయత్రీ మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్రామాయణము సర్వశక్తి సమన్వితమయింది. కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు సూర్యుడు. చండ మార్తాండ మండల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి అతనికి కూడా సత్తా స్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి గాయత్రి.

ప్రాణశక్తి గాయత్రి

సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రకృతిలో అనేక మార్పులొస్తాయి. అవి మానవ శరీరంపై , మనసుపై ప్రభావం చూపుతాయి. పుట్టినప్పుడు ఏ రాశిలో సూర్యుడున్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. అందుకే సృష్టించే బ్రహ్మదేవుడు - స్థితి కారకుడైన విష్ణుమూర్తి నాభి కమలం లోంచి జన్మించాడు. గర్భస్థ శిశువు నాభి , తల్లి నాభి కలుస్తాయి. ఇదే గర్భస్థ శిశువులకు ప్రాణశక్తిని ఇచ్చేది. బయటకు వచ్చిన తర్వాత శిశువును వేరు చేస్తారు. అలా వేరవగానే సూర్యశక్తి - ప్రాణశక్తిగా పుట్టిన శిశువుకు సమకూరుతుంది. ఈ శక్తియే గాయత్రీ మాత. పిల్లలు ఎదిగినకొద్దీ వారికి ప్రాణశక్తిని ఎలా పొందాలనే విషయమై ప్రాణామాయ కుండలినీ శక్తి గురించి నేర్పాలి. రోజూ మూడుసార్లు త్రిసంధ్యలలో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది , పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యా దేవతే గాయత్రీమాత.


గాయత్రీ జప సుప్రీతాయై నమః- సూర్య సహస్ర నామావళి


మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అందరికీ ఆరోగ్యాన్ని, జీవించటానికి ఆహారాన్ని ఇచ్చేవాడు.  కనుకనే ఆదిత్యుణ్ణి - అన్నదాత , ఆరోగ్య ప్రదాత అన్నారు. తల్లి తన పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. సూర్యభగవాడు సమస్త జీవరాశులకు , వృక్ష లతాదులకు , ప్రకృతిలోని అన్నింటికీ పోషకుడు. పంచభూతములకు (భూమి , నీరు , అగ్ని , వాయువు , ఆకాశము) సూర్యుడు స్ఫూర్తిదాయకుడు, శక్తినిచ్చేవాడు. అందుకే సూర్యుణ్ణి ‘పూషణ్’ అన్నారు.
కాలభేదములు ఏర్పడటానికి సూర్యుడే కారకుడు. ఒక్క సెకన్ కూడా తేడా లేకుండా ఆయా ప్రదేశాలలో , ఆయా ఋతువులను అనుసరించి ఆయా తేదీలలో సూర్యోదయ , సూర్యాస్తమానాలు జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలకైనా అదే సమయంలో జరుగుతుంది.  కనుక కాల నియమం , సమయ పాలన , కాలప్రాముఖ్యతకు, సూర్యుడే ఆదర్శంగా నిలుస్తాడు. ఇది లేకపోతే జ్యోతిశ్శాస్తమ్రే లేదు. నిత్యానుష్ఠాన కర్మలే లేవు. సూర్యుడు రాకపోతే రోజు గడవదు. అతడు త్యాగమూర్తి , నిత్య కర్తవ్య పరిపాలకుడు. అందుకే మహర్షులు ‘‘మీరు కూడా సూర్యుని వలె ఉండండని, ఆత్మ తేజస్సుని వికసింపచేసుకోండి’’ అని చెప్పారు.

సూర్యుణ్ణి మనం దైవంగా భావించి , పరబ్రహ్మ స్వరూపంగా ఉఫాసిస్తాం, ఆరాధిస్తాం. సూర్యునిలోని సద్గుణ శక్తియే - గాయత్రి. సూర్యునికి , గాయత్రికి భేదం లేదు. మంత్రం సూర్య తేజస్సు పరంగా ఉంటుంది. సాకార రూపం - గాయత్రీమాత.


గాయత్రీ మంత్రం.. ఆధ్యాత్మికత

శ్రీ దేవీ నవరాత్రులలో శ్రీ దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. ఇది గాయత్రీ మంత్ర స్వరూప తత్త్వమే. గాయత్రీ మంత్రంలోని మూడు పాదములు శ్రీ దుర్గా సప్తశతిలోని మూడు చరిత్రలకు స్ఫూర్తి. గాయత్రీ మంత్రంలోని మొదటి చరమణమైన  ఓం *భూర్భవో స్వాహాః తత్స వితుర్వరేణ్యం దుర్గా సప్తశతిలోని ప్రథమ భాగం. దానికి అధిష్ఠాన దేవత మహాకాళి.

కాళి - కాల స్వరూపం.

 సమస్తమూ కాలం లోంచి ప్రభవించి ప్రళయకాలంలో లయమవుతాయి. కనుక, ప్రథమ పాదాన్ని సంపూర్ణంగా తెలిసికొంటే ఆధ్యాత్మిక సూర్యోదయం కలిగి , ప్రతి ప్రభాతం ఒక సుప్రభాతం అవుతుంది.

గాయత్రీ మంత్రంలోని రెండవ పాదం


 ‘భర్గోదేవస్య ధీమహి’

అన్నదానికి శ్రీ దుర్గా సప్తశతిలో రెండవ చరిత్రలో ఉన్నది. దీనికి అధిష్ఠాత్రి శ్రీ మహాలక్ష్మి- స్థితికర్తయైన విష్ణుపత్ని. సాధకుడికి పోషణ సామర్థ్యం కలిగి , విజ్ఞానం , ఐశ్వర్యం , సత్వగుణం ప్రాప్తిస్తాయి. అనుదినం సుదినం అవుతుంది.

గాయత్రీ మంత్ర మూడవ చరణం


 ధియోయోనః ప్రచోదయాత్-


 దీని వివరణ శ్రీదేవీ సప్తశతిలో మూడవ చరిత్రలో విశదీకరింపబడింది. దీనికి మహాసరస్వతి అధిష్ఠానదేవత. ‘నేనెవరు?’ అనేదానికి సంపూర్ణమైన అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక సూర్యోదయం ఉండదు. ఎందుకంటే హృదయంలో సూర్యాస్తమయం ఉండదు గనుక. ఇది గాయత్రీ మంత్ర విశేషం.


నాభి హృత్కంఠ రసన నాసాదులయందు , ధర ఋక్యామాదులలో వర గాయత్రీ హృదయమున - అన్న త్యాగరాజ కీర్తనను మననం చేసుకొంటూ , సప్తస్వర సుందరులను భజించి, సంగీత సాధనలో గాయత్రీ మాతను ఆరాధిస్తారు నాదయోగి శిష్యపరంపర. సంధ్యాదేవీం , సావిత్రీం , వర గాయత్రీం , సరస్వతీ భజేహం అన్న దేవక్రియ రాగంలో ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన గాయత్రీ తత్త్వానికి దర్పణం.  దేవీ అనుగ్రహంతో సంప్రాప్తించిన శక్తిని లోక కల్యాణానికి ఉపకరించి తరించాలని ఉద్బోధిస్తోంది- సద్బుద్ధి ప్రదాయిని, సంధ్యాదేవత వేదమాత గాయత్రి.

ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు

ఓం శ్రీ శ్రీ శ్రీ అష్టలింగేశ్వర స్వామియే నమః
ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శాస్త్ర వచనం.

1 . సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.

2 . ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి  జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.

3 . ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.

4 .  అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.

5    శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.🙏

6 .   ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి. 

7 . సర్వప్రపంచం చేత సేవించ బడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన  మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.

8 . మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.

9 .  చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.

10 .   నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.

11 .  #శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం  చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.🙏

12    ‘#ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇలను అందజేస్తుంది.

సర్వే జానాః సుఖినో భవంతు 
ఓం నమః శివాయ నమః

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...