Friday, February 24, 2023

యజ్ఞోపవీత మహిమ

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’.

దీనినే తెలుగులో ‘జంధ్యం ’ అంటాం. ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు.

ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ,   కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు.

యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్*

తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్’

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది.

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం.

ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ

వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ

ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ

తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా

పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః

సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ

సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’

మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతువులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవుత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.

‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అది తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.

తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్

కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’


ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది:

తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.

యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది.

’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ*

*తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’

నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం.

గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.

యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.


పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్

తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్

ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్

*యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’


అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.

యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు.

అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి.

యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని తంతువులు మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి.

మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం రుద్రం...ఓం నమశ్శివాయ

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.

రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు.

నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |

నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||

నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం  ప్రాప్తిస్తుంది.

నమకం విశిష్టత :

నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.

అనువాకం – 1:

తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.

అనువాకం – 2 :

ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.

అనువాకం – 3:

ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు.

అనువాకం – 4:

ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:

అనువాకం – 5:

ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.

అనువాకం – 6:

ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.

ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.

అనువాకం – 7:

నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.

అనువాకం – 8:

ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.

అనువాకం –9:

ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.

అనువాకం – 10:

ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.

అనువాకం – 11:

ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. 

ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.


చమకం విశిష్టత:

నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు

అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే..    

ఓం శ్రీ రుద్రాయ నమః

Monday, February 20, 2023

బిల్వ చెట్టు వృత్తాంతం, బిల్వాష్టకం - విశిష్టత

శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.

శివపూజకు సంబంధించినంత వరకు 

  • వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
  • వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
  • వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
  • వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
  • వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
  • వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.
  • వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
  • వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
  • వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.
  • వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.
  • వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. 


శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.

పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.

ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.

సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.

ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.

ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.

ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి.

మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.

దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని

శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే

పదిసుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది

అందరం భక్తితో " అరుణాచల శివ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ పరమాత్మ 

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

Tuesday, February 14, 2023

ముత్తయిదువ లక్షణాలు

మొత్తం అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు.అవి..


1) కాళ్ళకి పట్టీలు, మెట్టెలు

2) చేతులకి గాజులు

3) మెడలో మంగళసూత్రం

4) తలలో పువ్వులు..చివరగా

5) నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కానీ..


1.మొదటగా కాళ్ళకు పట్టిలు మెట్టెలు ఎందుకో చూద్దాం:

కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ 

మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి 

టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది ..


ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత 

రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది..

ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే 

మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి 

అక్కడ అంతమవుతుంది.


అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో 

టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న

గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది. 


అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు 

ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా 

ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి 

తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి. 


ఫలితంగా వారిలో గర్భాశయ మరియు 

మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.

గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల 

బిడ్డను మోయడానికి సుఖప్రసవానికి కూడా 

సులువుగా ఉంటుంది. 


అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా 

మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. 

దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే 

tibia nerve అని గూగుల్లో వెతికితే 

మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.


2.ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు.

గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా 

బంగారం గాజులు మాత్రమే 

ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..


మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే 

గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి 

సంబంధాన్ని కలిగి ఉంటుంది 

వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే 

గమనిస్తూ ఉంటారు. 


ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి 

బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.


అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి,

గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా 

వారికి రక్తపోటు అవి రావా అని.

పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు 

లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది 

దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది 

అందువల్ల వారికి గాజులు అవసరం అనేది 

లేకుండా పోయింది.


అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు 

సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా 

రాగితో చేసినటువంటి కడియం ధరించమని 

చెప్పడం జరిగింది.

ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి 

చల్లగా ఉంచుతాయి. 


అందునా పొలం పనులు , కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో 

వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.


ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి 

అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే 

మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది


3.మూడవది మెడలో మంగళసూత్రం

దీని చివరున్న  బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. 

అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు 

మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని మగవాళ్ళు 

రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను 

కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ 

ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.


ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేదిఉపయోగపడుతుంది.

ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల 

చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.

క్యాన్సర్ కి ట్రీట్మెంట్గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.


4.ఇక నాల్గవది తలలో పూవులు

వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు 

ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన 

పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.

కలయక సమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య 

ఆకర్షణకు తోడ్పడుతాయి.


5.ఇక అయిదవది..చివరిది.. నొసటన సింధూరం

పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి 

రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.

ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే 

ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై 

ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.


ఇవే కాకుండా సైనస్ కు రాకుండా ముక్కపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులనూ ధరించేవారు!


అవే పద్ధతులు నేటికీ పాటించడం ద్వారా 

కొన్ని రకాల వ్యాధులకు సహజంగా నిరోధాన్ని 

డెవలప్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో 

చక్కగా జీవనం కొనసాగించు కోవచ్చు..!!


(సేకరణ)

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...