Sunday, December 8, 2019

శ్రీ చక్రం గొప్పతనం-విశిష్టత..

శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం కాశ్మీరీ హైందవము ఆధారితమైన తంత్రములో ఒక పవిత్రమైన యంత్రం. దీని జ్యామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణులైన శ్రీ విద్య, లలితా దేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమ ద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమ ద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవయోని చక్రం అని లేదా నవ చక్రం అని కూడా పిలుస్తారు.

రకములు
------------------

భూప్రస్తారం: రేఖాచిత్రం వలె ద్విమితీయం
(two-dimensional)గా ఉంటుంది.

మేరు ప్రస్తారం: పిరమిడ్ వలె త్రిమీతీయంగా (three-dimensional)గా నిర్మాణించబడితే,
(మేరు పర్వతాన్ని సూచించే) మహా మేరు అని అంటారు.

సరియైన బీజాలు, మంత్రాలు లేనిదే శ్రీ యంత్రము నిరుపయోగము. ప్రాణప్రతిష్ఠ, పూజలు చేయకున్నచో యంత్రము మరణించినట్లు సమానం.శ్రీ చక్ర భాగాలుశ్రీ చక్రం లోని ఒక్కొక్క భాగం త్రిపుర సుందరి యొక్క సూచికగా భావిస్తారు.

బయటి నుండి లోపలికి వెళ్ళే దిశలో శ్రీ చక్ర భాగాలు

మూడు సమాంతర రేఖలతో కూడుకుని ఉన్న చతురస్రాకారము - త్రైలోక్య్య మోహనం లేదా భూపం.

పదహారు రేకులు గల వృత్తము - సర్వ ఆశా పరిపూరకము

ఎనిమిది రేకులు గల వృత్తము - సర్వ సంక్షోభనము

పధ్నాలుగు చిన్న త్రిభుజాలు - సర్వ సౌభాగ్యదాయకము

పది చిన్న త్రిభుజాలు - సర్వ అర్థసాధకాలు

పది చిన్న త్రిభుజాలు - సర్వ రక్షకాలు

ఎనిమిది చిన్న త్రిభుజాలు - సర్వ రోగహరింపులు

మధ్యనున్న ఒక త్రిభుజం - సర్వ సిద్ధిప్రద బిందువు

సర్వ ఆనందమయివివరణవివిధ పరిమాణాలలో ఉన్న ఈ తొమ్మిది త్రిభుజాలు, ఒకదానితో ఒకటి కలుస్తాయి. వీటి మధ్యలో మానవ నేత్రానికి అందనంత, అత్యున్నత స్థానం కలిగిన, అనంతమైన కేంద్రంలో బిందువు రూపంలో శక్తి ఉంటుంది. ఈ కేంద్రము నుండే సమస్త విశ్వము వ్యాపిస్తుంది. ఈ త్రికోణాల చుట్టూ ముందు సృష్టిని సూచించే ఎనిమిది రేకులు గల వృత్తము, దాని తర్వాత పునరుత్పత్తిని సూచించే పదహారు రేకులు గల వృత్తములు ఉంటాయి. వీటి చుట్టూ నాలుగు దిశలలో పవిత్ర స్థలానికి ద్వారలు ఉంటాయి.బిందువు అంతరాలలో కామకళ నిగూఢమై ఉంటుంది. దీనికి మూడు రకాల శక్తులు ఉంటాయి. అవి• ఎరుపు - అండము• తెలుపు - వీర్యము• రెండిటి కలయిక - శివశక్తుల సంగమము. ఈ సంగమమే శ్రీ చక్ర కారకము.

వామకేశ్వర తంత్రము:-
-------------------------------------
వామకేశ్వర తంత్రము రెండవ భాగమైన యోగినీ హృదయ లో శ్రీ చక్రం గురించి ఈ విధంగా చెప్పబడినది.• స్త్రీ శక్తి నుండి సృజనాత్మకం పురుష శక్తి నుండి అగ్ని వెలువడతాయి. వీటి సంయోగము తోనే చక్రము ఆవిర్భవిస్తుంది. ఇదే చక్రము యొక్క మూలము. మహోన్నతమైన స్త్రీ శక్తి స్వేచ్ఛగా సృష్టి అనే రూపాంతరము పొందినది. దీనికి ప్రతిస్పందనగా చక్రము యొక్క సృష్టి కూడా జరిగినది. ఈ ప్రకంపనలతో శూన్యముని పోలిన విసర్గ (:) వలె చైతన్య స్థితిలో బిందువు ఉద్భవించినది. దివ్య శక్తి యొక్క ఈ స్థిర ప్రవాహంలో సంపూర్ణమైన వ్యవస్థ అనే సముద్రము అవతరించినది. ఇదే ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చక్రం లో బైందవము (బిందువు)కి మూడు రూపాలు కలవు. ధర్మము, అధర్మము మరియు ఆత్మ. మాత్రి, మేయము మరియు ప్రమము. నవయోని చక్రము చైతన్యానికి, అనంత సౌఖ్యానికి సూచిక. మంత్రము యొక్క తొమ్మిది విభాగాలు కలది.స్తోత్రముఇది శ్రీ చక్రాన్ని వర్ణించే శ్లోకము. శ్రీ చక్రం అమ్మ నివాస స్దానమ్.శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నవి. ఈ తొమ్మిది ఆవరణలను అర్చించుటయె శ్రీ చక్రనవావరణార్చన.

శ్రీ చక్ర విశిష్టత-వివరణ....
-------------------------------------
సకల చరాచర విశ్వం లో ఉన్నది “బ్రహ్మము” ఒక్కటే . ఈ బ్రహ్మము సత్ చిత్ ఆనంద స్వరూపము ల తో కూడుకున్నది . బ్రహ్మము చలనము లేనిది అయినప్పటికీ … ‘ చేతనం ‘ అనే విశేష బీజం కలిగి ఉంటుంది .
పరాశక్తి కి శ్రీ చక్రము కు భేదముండదు .శ్రీ దేవియే శ్రీ చక్రం . శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర సారం కూడా …………. శ్రీ మాతా,శ్రీ విద్య్హ , శ్రీ చక్రం వేరు కాదని , ఈ మూడు ఒకే పరబ్రహ్మ స్వరూపమని ….తెలియజేస్తుంది . శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది … ఇటువంటి శ్రీ విద్యను , శ్రీ చక్రోపాసనను … మనువు ,చంద్రుడు ,కుభేరుడు ,అగస్త్యుడు , లోపాముద్ర ,అగ్ని ,మన్మధుడు ,సూర్యుడు ,ఇంద్రుడు ,శివుడు ,స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుగురు , పన్నెండు శాస్త్ర విధానాలుగా ప్రవేశపెట్టినట్టు … జ్ఞానార్ణవ తంత్రం తెలుపుతుంది .
శ్రీ చక్రం — బిందువు , త్రికోణం ,అష్టకోణ చక్రం ,అంతర్దశారం , బహిర్దశారం అను దశ త్రికోణ చక్రము , చతుర్దశారం , అష్టదళ పద్మము , భూపురము అను తొమ్మిది ఆవరణము ల తో కూడి ఉన్నది . శ్రీ చక్రం లో త్రిభుజాల సంఖ్యా 43 , మొత్తం పద్మముల సంఖ్యా 24 , మొత్తము వృత్తములు సంఖ్యా 7 ( బిందువు తో కలిపి ).
శ్రీ చక్రము లోని తొమ్మిది చక్రములను ( శివ చక్ర , శక్తి చక్రములు అంటారు ) నాయోనులని వ్యవహరిస్తారు …….
త్రికోణ , అష్టకోణ , దశకోణ ద్వయము , చతుర్దశ కోణం లు శక్తి కోణములు … బిందువు , అష్టదళ పద్మము , షోడశ దళము , చతురస్రము లు శివ చక్రములు …. బహిర్దశార , అంతర్దశారము ల ను కలిపితే శ్రీ చక్రము అష్టాచక్రము అవుతుంది …

***** నవద్వార అంటే తొమ్మిది త్రికోణములు … శివ శక్త్యాత్మకం ……..*****

భూపుర త్రయం అంటే త్రైలోక్య మోహన చక్రం , షోడశదళ పద్మము అంటే సర్వాశా పరిపూర చక్రం , అష్టదళ పద్మము అంటే సర్వ సంక్షోభిణీ చక్రము , చతుర్దశారము అంటే సర్వ సౌభాగ్య చక్రము , బహిర్దశారం అంటే సర్వార్థ సాధక చక్రము , అంతర్దశారము అంటే సర్వ రక్షాకర చక్రము , అష్టకోణము అంటే సర్వ రోగహర చక్రము , త్రికోణము అంటే సర్వ సిద్ధి ప్రధా చక్రము , బిందువు అంటే సర్వ ఆనందమయ చక్రము …..ఒక్కొక్క ఆవరణము లో ఉండే దేవతలను సాక్షాత్కరించుట కొరకు కొన్ని బీజాక్షర మంత్రము లు ప్రత్యేకం గా కలవు …..
ఇక మనము గమనించవలిసిన విషయమేమిటంటే …. ఈ జగత్తు లో ని సకల తత్వాలు , సకల భువనాలు ,పరమశివుడు , పరాశక్తి మానవునియందు కలవు .. మానవుని శరీరాను రెండు భాగాలుగా చూస్తే …. నాభి నుండి పైకి ఊర్థ్వ లోకమని , క్రిందకి అధోలోకమని ….. ఈ రెంటిని కలిపే వెన్నెముక ను మేరు దండమని అంటారు .. శ్రీ చక్రమును “మేరువు” అంటారు … మేరు పర్వతము కూడా భూమి కి ఇరుసు వంటిది . ఏ రకం గా పరాశక్తి దివ్య స్వరూప కాంతులచే … ఈ జగత్తంతా ప్రకాశవంతమై ఉందొ , మన మేరుదండం లో గల ” కుండలినీ శక్తి ” చేత శరీరము చైతన్యవంతము గా అవుతుంది … మనలో ఆత్మా ఉన్నదని అంగీకరించినట్లే .. మన శరీర నిర్మాణం యొక్క ప్రాధాన్యత ను గుర్తించాలి .. నవావరణాత్మకమైన శ్రీ చక్రానికి , మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రాలు చెబుతున్నాయి … శ్రీ చక్రమును ఆరాదిస్తే సకల దేవతా మూర్తులను ఆరాదించినట్లే … అని తంత్ర శాస్త్రం తెలియజేస్తుంది …
శ్రీ చక్రమును మన శరీరము తో పోల్చి చూస్తే … మనము ఆ జగన్మాతను దర్శించుట యెంత దుర్లభమో అవగతమవుతుంది … మనలోని కర్మ , జ్ఞానేంద్రియాల వెంటపడి పరుగెత్తే మనస్సు , బుద్ధి , అహంకారం , మమకారములు , కామోద్రేకాలు , శృంగారాది నవరసాలు , జాగ్రద స్వప్న సుషుప్తాది అవస్థలు .. వీటిని నడిపే సత్వ రజ తమో గుణాలు .. వీటన్నింటిని ఆ “శ్రీదేవి” విభూతులుగా గ్రహించి , వీటన్నింటిని దాటి ‘బిందు’ స్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన , సచ్చిదానంద రూపమైన , సత్స్వరూపానుభవము కలుగుతుంది అనేది సత్యము … కానీ … ఎన్ని జన్మలకు సాధ్యమో ….
మనలోని ప్రాపంచికమైన ముప్పది ఆరు తత్వములు , త్రిపుటలు , నవావరణములను … నిర్లిప్తతో , నిష్కామంగా , నిస్వార్థంగా అనుభవిస్తూ ….. గమ్యాన్ని చేరుకోవటానికి నిరంతర సాధన చెయ్యాలె తప్ప వేరొక మార్గం ఉండదు … లేదు కూడాను …

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...