Friday, November 9, 2018

కార్తీకమాసంలో ఉపవాసం చేయాలనుకుంటే ఇలా చేయండి

ముందుగా ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకుందాం

ఉప అంటే  సమీపంలో అని,  వాసం అంటే ఉండటం అని అర్ధం . అంటే ఉపవాసం అనే పదానికి దగ్గరగా ఉండటం అని అర్థం. దేనికి దగ్గరగా ఉండటం? ఈ ప్రశ్నకి సమాధానం ఎందుకు ఉపవాసం చేస్తున్నామో తెలిసి ఉంటే తెలుస్తుంది. ఉపవాసం భగవదనుగ్రహం కోసం చేస్తారన్నది జగద్విదితమైన విషయం. కనుక ఉండవలసింది భగవంతుని సమీపంలో. ఇంటిపని వంట పని తగ్గితే సమయమంతా భగవద్ధ్యానంలో గడపటానికి వీలుగా ఉంటుంది. అప్పుడు వంటికి కూడా పని తగ్గుతుంది. బరువైన, అరగటానికి కష్టమైన ఆహారం తీసుకోక పోవటంతో జీర్ణ వ్యవస్థకి వెచ్చించాల్సిన శక్తి కూడా భగవద్ధ్యానానికో, పూజకో  వెచ్చించటానికి వీలవుతుంది. కడుపు నిండా తినగానే కునుకు వస్తుంది చాలమందికి.  ఎందుకంటే శక్తి అంతా జీర్ణాశయం దగ్గరకి వెళ్ళి పోయి ఉంటుంది. మెదడుకి శక్తి సరఫరా తగ్గుతుంది. దానివలన భగవంతుని ధ్యాస కుదరదు. Concentration.
అందుకే  ఉపవాసం అనే కాన్సెప్ట్ ద్వారా దేవునికి దగ్గర అవుతాము. ఇందులో శరీర ఆరోగ్య రహస్యం కూడా ఉంది. లంఖణం పరమ ఔషధం అన్నారు మన పెద్దలు. ఇలా వారానికో మాసానికో ఉపవాసం చేయడం ద్వారా    జీర్ణ వ్యవస్థ రిపేర్ అయ్యి బాగా పనిచేస్తుంది. మన ఋషులు ఆధ్యాత్మికము ద్వారానే   మన శ్రేయస్సు ఏర్పాటు చేసారు. ఇది గగ్రహించక కొంతమంది ఉపవాసం   పేరిట ఏదీ తినకుండా   మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు.

ఉపవాసంలో రకాలు :

 వండని పదార్ధాలతో ఉపవాసం : ఈ ఉపవాసం ఆహారపదార్ధాలకు బదులుగా పండ్లు, పచ్చికూరగాయలు తింటారు.

 పానీయాలతో ఉపవాసం : ఇందులో ఆహారానికి బదులుగా మంచి నీళ్ళు, పండ్ల రసాలు, కూరగాయల రసాలు, హెర్బల్‌ టీ, గోరువెచ్చటి నీరు, నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం చేయడం .

వండిన పదార్ధాలతో ఉపవాసం : ఈ తరహా ఉపవాసంలో ఉడికించిన కూరగాయలు, వండిన పెసరపప్పును, గింజలను తీసుకుంటారు.

 సంపూర్ణ ఉపవాసం : ఈ తరహా ఉపవాసం చేసేవారు మంచి నీళ్ళు కూడా తాగరు. జేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి ఇలాంటిదే .

ఉపవాసం అలవాటు లేకుండా అప్పుడే కొత్తగా మెదలు పెట్టేవారు తక్కువ సమయం ఉపవాసం చేసి ఆ తరువాత ఎక్కువ రోజులు చేయడానికి ప్రయత్నించాలి. ఏమి తినకుండా , ఒక్కసారి భోజనం చేసి లేదా ఆహార పదార్ధాలను కొన్నింటిని మినహాయించుకుని తినవచ్చు. ఉపవాసం పూర్తయ్యాక ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా తీసుకోకూడదు. ఈ విషయాన్ని మరువరాదు.

ఉపవాస సాఫల్యత అది పూర్తయ్యాక తీసుకునే ఆహారం పైనే ఆధారపడి వుంటుంది. ఉపవాస సమయంలో పొట్టలో ఖాళీయైన స్థానంలో తిరిగి అధికంగా చేర్చినట్లయితే ఉపవాసం వల్ల ప్రయోజనం వుండదు. మితిమీరిన సమయంలో ఉపవాసం చేస్తే జీవక్రియను దెబ్బతీస్తుంది. జీర్ణ శక్తి తగ్గుతుంది. శరీరం బలహీన పడుతుంది. అందువల్ల ఉపవాసం ఎలా, ఎంతకాలం చేయాలనే విషయం తెలుసుకుని ఆచరించాలి.  ఉపవాసంలో తాజాగా తీసిన పండ్లు, కూరగాయల రసాలు మంచివి. శారీరకంగా, మానసికంగా బాధపడే సమయంలో ఉపవాసం ఉండకూడదు. అలాగే మహిళలు రుతుస్రావం, గర్భినీ సమయంలో, శరీరం బలహీనంగా, అలసటచెంది ఉన్న సమయంలో ఉపవాసం చేయడమనేది ఎంత మాత్రము మంచిది కాదు.

ఈ విధమైన ఉపవాసాలు చేయవచ్చు

 ఏక భుక్తం : అంటే ఒక పూట భోజనం చేయడం. ఉదయం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవడంను ఏక భుక్తం అంటారు.

 నిరాహారం : రెండు పూటలా పాలు పళ్ళు మాత్రమే తీసుకొని వండినవి తినకపోవడం.

 నక్తం : ఇది చాలా విశేషం అయినది. ఉదయం నుండి పాలు పళ్ళు ఫలహారాలు మాత్రమే స్వీకరించి సాయంత్రం నక్షత్రాలు రాగానే భోజనం చేయడం. ఈ కార్తీకమాసంలో ఇది చాలా మంచిది.

 చివరగా ఒక మాట భగవంతుని పైన మనసు లగ్నము చేయకుండా, భగవంతుని సమీపంలో ఏమాత్రమూ గడపకుండా  ఎంత   చేసినా వ్యర్ధమే

No comments:

Post a Comment

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...